మంచు విష్ణు భేటీపై ఆసక్తి: ముద్రగడతో మోహన్బాబుకు లింకేమిటి?
హైదరాబాద్: కాపు నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభాన్ని సినీ హీరో, మోహన్ బాబు కుమారుడు మంచు విష్ణు కలుసుకోవడం రాజకీయ రంగంలో చర్చనీయాంశంగా మారింది. నాన్న మోహన్ బాబు చెప్తేనే తాను ముద్రగడ పద్మనాభాన్ని కలిశానని మంచు విష్ణు మీడియాతో చెప్పారు. ఈ భేటీకి గల ప్రత్యేక కారణాలేమిటై ఉంటాయనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.
Also Read: 'జగన్ ఓర్వలేకే': మోహన్ బాబు చెప్తే.. ముద్రగడను కలిసిన హీరో విష్ణు
తన తండ్రి ఆదేశాలమేరకు పద్మనాభాన్ని కలిశానని విష్ణు మీడియాకు చెప్పారు. ముద్రగడ ఏదైనా తలపెడితే అది కార్యరూపం దాల్చేవరకు ఊరుకోరని, ఆయన చాలా మొండివారని తన తండ్రి చెప్పినట్లు విష్ణు తెలిపారు. తన అభిమాని కుమార్తె వివాహానికి హాజరవటానికి మండపేట వచ్చానని, ముద్రగడను కిర్లంపూడిలో కలుద్దామనుకుని ముందుగా ఫోన్ చేస్తే, ఆయన ఒక పెళ్ళికి హాజరవటానికి కాకినాడ వచ్చారని తెలియటంతో అక్కడే కలిశానని చెప్పారు.
మోహన్ బాబుకు ప్రముఖ దర్శక నిర్మాత దాసరి నారాయణ రావు గురువు. దాసరి నారాయణ రావు పద్మనాభం కాపు రిజర్వేషన్ల ఉద్యమానికి మద్దతు ఇస్తున్నారు. ముద్రగడను ఆయన కలిశారు కూడా. ముద్రగడకు, మోహన్ బాబుకు మధ్య సంబంధం అదొకటి కాగా, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు మోహన్ బాబు సమీప బంధువు. ఈ సంబంధం కూడా ముద్రగడ వద్దకు తన కుమారుడిని మోహన్ బాబు పంపడానికి కారణమై ఉండవచ్చునని ఊహిస్తున్నారు.
అయితే, విష్ణును ప్రత్యేకంగా పంపటం వెనక ఆంతర్యం ఏమిటో స్పష్టంగా తెలియడం లేదు. కాగా, ముద్రగడను కలవటంపై విష్ణు ట్విట్టర్లో స్పందించారు. ముద్రగడ పద్మనాభం ఎంత సింపుల్గా, వినయంగా ఉన్నారో అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఆయన నిరాడంబరత, గౌరవాన్ని చూసి తాను మైమరచిపోయానని, గోదావరి మర్యాదలను ఎవరూ అధిగమించలేరని ట్వీట్ చేశారు.