జగన్ గెలుపుకు కారణం చెప్పిన చంద్రబాబు .. ఏమన్నారంటే
ఆంధ్రప్రదేశ్ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో టీడీపీ అడ్రెస్ లేకుండా పోయింది . 1982లో పార్టీ ఏర్పాటు తర్వాత ఎన్నడూ ఎదురుకానంత ఘోర పరాభవాన్ని టీడీపీ చవి చూసింది . దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకున్న చంద్రబాబు పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. అటు కేంద్రంలో మోడీ సర్కార్, ఇటు రాష్ట్రంలో వైసీపీ సర్కార్ పాలనా పగ్గాలు చేపట్టనున్నాయి. ఏపీలో పార్టీ ఘోర ఓటమితో తీవ్ర నిరుత్సాహంలో ఉన్న తెలుగు తమ్ముళ్ళను అధైర్య పడొద్దని చంద్రబాబు దిశా నిర్దేశం చేస్తున్నారు. ప్రజల్లో టీడీపీపై కోపం లేదని చెప్పిన చంద్రబాబు ఓడినా గెలిచినా ప్రజా క్షేత్రం లో ఉండాలని సూచించారు.
నేడు జరిగిన టీడీఎల్పీ సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. ఉండవల్లిలోని తన నివాసంలో జరిగిన పార్టీ శాసనసభాపక్ష సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు పార్టీ నేతల్లో మనోధైర్యం నింపే ప్రయత్నం చేశారు. పార్టీ బలోపేతానికి ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఓడిపోయామని బాధపడాల్సిన అవసరం లేదన్నారు. జగన్ పై ఉన్న సానుభూతే వైసీపీని గెలిపించిందని ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రజలకు టీడీపీపై కోపం లేదని, ప్రజల కోపం వల్ల మనం ఓడిపోలేదని పార్టీ నాయకులకు ధైర్యం చెప్పారు. ఓటమితో నేతలు అధైర్య పడాల్సిన అవసరం లేదనిఆయన పేర్కొన్నారు . టీడీపీ ఎప్పటికీ ప్రజలతోనే ఉంటుందని అన్నారు.
ఇక టీఆర్ఎస్ పార్టీ పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు ఒకప్పుడు ఒక సీటుతో రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన టీఆర్ఎస్.. ఇప్పుడు రెండోసారి అధికారాన్ని కైవసం చేసుకుందని, అదే రీతిలో మనం కూడా ముందుకు సాగాలని చెప్పారు. ఎవ్వరూ నిరుత్సాహపడవద్దని ఆయన ధైర్యం చెప్పారు.