ఉర్జిత్ పటేల్ రాజీనామా పైన చంద్రబాబు స్పందన, నరేంద్ర మోడీపై ఆగ్రహం
అమరావతి: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ పదవికి ఉర్జిత్ పటేల్ రాజీనామా చేయడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు సోమవారం స్పందించారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ట్వీట్ చేశారు.
ఉర్జిత్ రాజీనామా దురదృష్టకరమన్నారు. రాజ్యాంగ సంస్థల గౌరవ ప్రతిష్ఠలను ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం దిగజార్చిందని నిప్పులు చెరిగారు. ఈ కేంద్ర ప్రభుత్వం విధ్వంసకర ప్రయత్నాల వల్ల సీబీఐ, ఆర్బీఐ ప్రతిష్ఠ మసకబారిందని విమర్శించారు. దేశంలో ప్రజాస్వామ్యం ఎప్పుడూ లేనంతగా ప్రమాదంలో పడిందన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఏ స్వతంత్ర ప్రతిపత్తి సంస్థ కూడా ఉండలేవని చెప్పారు.
కాగా, బీజేపీయేతర పార్టీల సమావేశం నేపథ్యంలో చంద్రబాబు ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. ఇదే సమయంలో ఉర్జిత్ రాజీనామా కలకలం రేపింది. హఠాత్తుగా ఆయన తన రాజీనామా లేఖను కేంద్రానికి పంపించారు. తన రాజీనామా తక్షణమే అమలులోకి వస్తుందని ప్రకటించారు. తన వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు.
కాగా, ఇటీవల కాలంలో ఆర్బీఐ గవర్నర్కు కేంద్ర పెద్దలకు మధ్య దూరం పెరిగింది. ఆర్బీఐ వద్ద మిగులు నిధుల బదలాయింపు, ఎన్పీఏలు ఎక్కువ ఉన్న బ్యాంకులను పీసీఏ నుంచి బయట పడవేసే అంశం, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలకు నిధులు సమకూర్చే విషయంలో ప్రభుత్వంతో ఉర్జిత్ పటేల్కు విభేదాలు తలెత్తాయి. ఒక దశలో ప్రభుత్వం ఆర్బీఐ పైన నియంత్రణ సాధించేందుకు సెక్షన్ 7(ఎ)ను ఉపయోగించిందనే విషయం బయటకు వచ్చింది. ఇది విమర్శలకు తావిచ్చింది.
సెక్షన్ (బి)ని కూడా ఆర్బీఐపై అమలు చేయవచ్చనే వార్తలు వచ్చాయి. దీనిపైనా విమర్శలు వచ్చాయి. దీంతో కేంద్రం తగ్గింది. ఆర్బీఐ స్వేచ్ఛను గౌరవిస్తామని, కానీ సంప్రదింపులు కొనసాగుతాయని ఆర్థిక శాఖ తెలిపింది. కానీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లలోని ప్రభుత్వ ప్రతినిధుల రూపంలో ఆర్బీఐ గవర్నర్పై ఒత్తిడి పెంచింది. దీంతో గత నెల బోర్డు మీటింగ్కు ముందే ఉర్జిత్ రాజీనామా చేస్తారని ఊహాగానాలు వెల్లువెత్తాయి.
కానీ ప్రభుత్వ పెద్దలు బుజ్జగించారు. అప్పటికి సద్దుమణిగింది. బోర్డు మీటింగ్ తర్వాత ప్రభుత్వం కోరుకున్నట్టుగా నాలుగు బ్యాంకుల వరకు పీసీఏ నుంచి బయటకు వచ్చేందుకు మార్గం సుగమమైంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఉర్జిత్ ఇప్పుడు హఠాత్తుగా రాజీనామా చేశారు.