రాజధానిపై కేంద్రం పాత్ర పరిమితం .. బీజేపీ వైఖరి సుస్పష్టం : దగ్గుపాటి పురంధరేశ్వరి
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా తెలుగు రాష్ట్రానికి చెందిన దగ్గుబాటి పురంధరేశ్వరికి స్థానం దక్కింది. దీనిపై దగ్గుబాటి పురంధరేశ్వరి మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీలో ప్రతిభావంతులైన వారు ఎంతోమంది ఉన్నప్పటికీ తనకు ప్రాధాన్యత ఇచ్చినందుకు శక్తివంచన లేకుండా బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.
పదవి రావటం కన్నా దానికి న్యాయం చేస్తేనే ఆనందం
తనపై నమ్మకం ఉంచి జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చినందుకు బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కు, ప్రధాని నరేంద్ర మోడీ ,అమిత్ షా ల కు దగ్గుబాటి పురంధరేశ్వరి కృతజ్ఞతలు తెలిపారు. జాతీయ ప్రధాన కార్యదర్శి గా పదవి రావడం కన్నా, ఆ పదవికి న్యాయం చేసినప్పుడే తనకు ఆనందం కలుగుతుందని ఆమె పేర్కొన్నారు. రాష్ట్ర రాజధాని విషయంలో కేంద్రం పాత్ర చాలా పరిమితమైందని, గతంలో ఈ విషయాన్ని రామ్ మాధవ్ వంటి నాయకులే చెప్పారని పేర్కొన్నారు పురందరేశ్వరి. రాజధాని విషయంలో బీజేపీ స్పష్టమైన వైఖరితో ఉందని ఆమె పేర్కొన్నారు.
రైతుల సంక్షేమం కోసమే నూతన వ్యవసాయ బిల్లులు
కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసమే నూతన వ్యవసాయ బిల్లులను ప్రవేశ పెట్టిందని, నూతన వ్యవసాయ బిల్లుల విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని దగ్గుబాటి పురందరేశ్వరి పేర్కొన్నారు. వ్యవసాయ బిల్లులలో ఒకటి రెండు అంశాలలో ఆందోళన ఉన్నప్పటికీ ఎన్డీఏ ప్రభుత్వం రైతులకు న్యాయం చేస్తుందని ఆమె గట్టిగా చెప్పారు.రైతులకు లబ్ది చేకూర్చేందుకే ఈ బిల్లులు అన్నారు. ఈ బిల్లులతో రైతులకు దీర్ఘకాల ప్రయోజనాలు చేకూరుతాయని చెప్పారు .
ఏపీలో పరిణామాలు అధిష్టానం దృష్టికి తీసుకెళ్తా
బిజెపి ప్రధాన కార్యదర్శిగా తనకు పదవి ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపిన పురందరేశ్వరి బీజేపీని అధికారంలోకి రావడం కోసం ప్రజల పక్షాన నిలిచి ప్రజల నమ్మకాన్ని కలిగిస్తామని పేర్కొన్నారు. భవిష్యత్ కాలంలో బీజేపీ బలీయమైన శక్తిగా ఎదగడానికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఏపీలో ఎప్పటికప్పుడు జరుగుతున్న పరిణామాలను బిజెపి అధినాయకత్వం దగ్గరకు తీసుకు వెళ్తానని, ఏపీలో పార్టీ బలోపేతం కావడానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.
Recommended Video
దక్షిణాదిలో పార్టీని బలోపేతం చెయ్యటం లక్ష్యం
పదాధికారులతో సమావేశం అనంతరం రాష్ట్రంలో ఎటువంటి వ్యూహాలపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందో, వాటన్నింటినీ అమలు చేస్తానని పురందరేశ్వరి అన్నారు. దేశవ్యాప్తంగా బీజేపీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు పురంధరేశ్వరి. దక్షిణాది రాష్ట్రాల్లో కేరళ, తమిళనాడు , తెలుగు రాష్ట్రాలలో బీజేపీని బలోపేతం చేయడానికి తన వంతు కృషి చేస్తానని చెప్పిన ఆమె రానున్న ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పని చేస్తామని అన్నారు.