రంగాపై గౌతం రెడ్డి వ్యాఖ్య వెనక సీక్రెట్: ఆయన ప్లాన్ ఇదీ....
వంగవీటి రంగాపై సస్పెన్షన్కు గురైన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు పి. గౌతం రెడ్డి చేసిన వ్యాఖ్య వెనక రహస్యం దాగి ఉందని అంటున్నారు.
విజయవాడ: వంగవీటి రంగాపై సస్పెన్షన్కు గురైన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు పి. గౌతం రెడ్డి చేసిన వ్యాఖ్య వెనక రహస్యం దాగి ఉందని అంటున్నారు. ఆయన ఇప్పటి వరకు వైసిపి ట్రేడ్ యూనియన్ నాయకుడిగా వ్యవహరిస్తున్నారు.
పి గౌతంరెడ్డిని పార్టీ నుంచి నాయకత్వం పార్టీ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయన వర్గానికి చెందినవారు భగ్గుమంటున్నారు. ఈ విషయాన్ని అలా పక్కన పెడితే గత ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి వైసిపి తరపున గౌతం రెడ్డి పోటీచేశారు.
అయితే, గౌతంరెడ్డిని తర్వాత కొద్దికాలానికే ఇన్చార్జ్ బాధ్యతల నుంచి తప్పించి విజయవాడ తూర్పులో ఓటమిపాలైన వంగవీటి రాధాకృష్ణను నియమించారు. దీంతో ఆయన తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. రాధాకృష్ణ 2009 ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి ప్రజారాజ్యం తరపున పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్థి మల్లాది విష్ణు చేతిలో ఓటమి పాలయ్యారు. తర్వాత రాధా కొంతకాలం కాంగ్రెస్లో కొనసాగి ఆ తర్వాత వైసిపిలో చేరారు.
మల్లాది విష్ణు కూడా...
కొద్దిరోజుల క్రితం మల్లాది విష్ణు వైసిపిలోకి వచ్చారు. దీంతో ఆయనకు వచ్చే ఎన్నికల్లో సీటు ఖాయమనే ప్రచారంతో గౌతంరెడ్డి మానసికంగా మరింత దెబ్బ తిన్నారు. దెబ్బపై దెబ్బ అన్నట్లు మూడురోజుల క్రితం సెంట్రల్ నియోజకవర్గంలోని 20 డివిజన్లలో కూడా రాధా-రంగా అనుచరులే అధ్యక్షులుగా నియమితులయ్యారు. అప్పటివరకు ఆయా పదవుల్లో కొనసాగుతున్న గౌతంరెడ్డి అనుచరులందరినీ పూర్తిగా రాధాకృష్ణ పూర్తిగా తప్పించారు. ఇది రాజకీయంగా గౌతం రెడ్డికి మరో దెబ్బ.
కన్నాతో బేటీ...
పార్టీలో తన స్థానం కదిగిలిపోతుండడంతో గౌతంరెడ్డి ఇటీవల బిజెపిలో కీలక పాత్ర పోషిస్తున్న మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణతో రహస్య మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది. విద్యార్థి దశ నుంచి గౌతంరెడ్డి వామపక్ష భావజాలంతో సిపిఐ అనుబంధ విద్యార్థి సంఘం ఎఐఎస్ఎఫ్లో వివిధ పదవులు నిర్వహిస్తూ వచ్చారు. నాగార్జున విశ్వవిద్యాలయంలో అప్పటి ఎన్ఎస్యుఐ నేతగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణతో ఆయనకు మంచి సంబంధాలున్నాయి. తర్వాత గౌతంరెడ్డి సిపిఐ నుంచి కాంగ్రెస్లో చేరాక వీరి సంబంధాలు మరింత మెరుగుపడ్డాయి. నగరంలో గౌతంరెడ్డికి బలమైన అనుచరులే ఉన్నారు. వరుసగా నాలుగుసార్లు సిపిఐ తరపున కార్పొరేటర్గా గెలిచారు.
రాధాకృష్ణ ప్రచారం చేసినా...
గత ఎన్నికల్లో గౌతంరెడ్డి విజయం కోసం రాధాకృష్ణ సెంట్రల్లో ప్రచారం చేశారు. అయితే తెరవెనుక తన ఓటమికి కృషి చేశారని గౌతంరెడ్డి ఇప్పుడు ఆరోపిస్తున్నారు. అదే సమయంలో జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రతి డివిజన్లోనూ రాధా-రంగా మిత్రమండలి అభ్యర్థులు పోటీచేసి తన అభ్యర్థులను ఓడించారని, ఇలాంటి స్థితిలో భవిష్యత్తులో పొరపాటున రాధాకు సీటు వస్తే తన అనుచరులు ఎలా పనిచేయగలరని గౌతంరెడ్డి స్పష్టంగా ప్రశ్నిస్తున్నారు.
మల్లాదిపైనా విసుర్లు...
కల్తీ మద్యం కేసులో ఇరుక్కున్న మల్లాది విష్ణును పార్టీలోకి చేర్చుకోవటం ఏమిటని కూడా గౌతం రెడ్డి ప్రశ్నిస్తున్నారు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకునే గౌతంరెడ్డి ఉద్దేశపూర్వకంగానే వంగవీటి కుటుంబం పట్ల తనకున్న అభిప్రాయాలన్నీ టివి ఇంటర్వ్యూలో చెప్పటం, ఆపై సస్పెన్షన్కు గురికావటం వెంటవెంటనే జరిగిపోయాయి. షోకాజ్ నోటీస్కు సమాధానం ఇచ్చే అవకాశం లేకుండానే సస్పెండ్ చేయటం ఏమిటని గౌతంరెడ్డి వర్గీయులు మండిపడుతున్నారు. బిజెపిలో చేరటానికి ఇదే అవకాశమని చెబుతున్నారు.