అమ్మని హింసించినందుకు కొడుకు, కోడలు అరెస్టు...పోలీసుల హెచ్చరిక
విజయవాడ:నవమాసాలు మోసి కని పెంచిన తల్లి విషయంలో అందరు బిడ్డల స్పందన ఒకే రకంగా లేకపోవడమే నేటి బ్రతుకు చిత్రం...అమ్మ లేదని చాలా మందికి బాధయితే...అయితే అమ్మ ఇంకా పోలేదేంటని బాధ పడేవాళ్లు కూడా ఉంటారని ఈ ఉదంతం రుజువుచేస్తోంది.
కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్న తల్లిని సంరక్షించాల్సి పోయి హింసిస్తే కటకటాలు తప్పవని ఇదే ఉదంతం అలాంటి కఠినాత్ములకు ఒక హెచ్చరికాగా నిలిచింది. వృద్దాప్యంలో ఉన్న అమ్మను వేధించినందుకు గాను ఆమె కొడుకు, కోడలిని పోలీసులు అరెస్ట్ చేసిన ఈ ఉదంతం సంచలనం సృష్టించింది. విజయవాడ శివార్లలోని గుణదలలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే...
గుణదల బెత్లహేంనగర్కు చెందిన ప్రకాశమ్మకు ఏసుదాసు అనే కొడుకు ఉన్నాడు. వృద్దురాలైన తన తల్లిని ఏ లోటు రాకుండా చూసుకోవాల్సిన ఏసుదాసు, తన భార్య మేరీతో కలసి తీవ్రంగా వేధిస్తున్నాడు. ఆమె చనిపోతే పీడ విరగడ అయిపోతుందన్న చందంగా అతడు, అతడి భార్య వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో ఆమెని ఇంట్లో ఉంచితే అడ్డుగా భావించిన కొడుకు ఏసు దాసు ఆమెని ఇంటి డాబా మీద ఎండలో ఒక మంచం వేసి ఆ మంచానికి ఆధరువుతో ఒక దుప్పటి వేసి అదే ఆమె మకాం గా మార్చేశాడు. అంతేకాదు ఆమె అక్కడ నుంచి ఎటూ పోకుండా ఒక గొలుసుతో మంచానికి కట్టేసి తిండీతిప్పలు అటుంటి కనీసం తాగటానికి నీళ్లు కూడా ఇవ్వకుండా మాడుస్తున్నారు.
చుట్టుప్రక్కల వాళ్ల ద్వారా ఈ విషయం మీడియాకు తెలియడంతో పత్రికల్లో వార్తలు వచ్చాయి. దీంతో ఈ ఉదంతం పై వెంటనే స్పందించిన పోలీసులు... హుటాహుటిన ప్రకాశమ్మను వృద్ధాశ్రమానికి తరలించారు. అనంతరం పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఏసీపీ సత్యానందం, మాచవరం సీఐ సాహేరాబేగం, ఎస్సై హనీష్ ఆదివారం గుణదలలోని వృద్ధురాలి ఇంటికి వెళ్లి జరిగిన ఘటనపై సమగ్రంగా విచారించారు. అనంతరం ప్రకాశమ్మ కొడుకు ఏసుదాసు, కోడలు మేరీలను అరెస్టు చేశారు. మరోవైపు విజయవాడ న్యూరాజరాజేశ్వరీ పేటలోని అరుణా మహిళా మండలి వృద్ధాశ్రమంలో ఆశ్రయం పొందుతున్న ప్రకాశమ్మను పరామర్శించి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమెకు నూతన వస్త్రాలు, కొంత నగదు ఇవ్వడంతో పాటు ఆశ్రమంలోని వృద్ధులందరికీ పండ్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎసిపి సత్యానందం మాట్లాడుతూ వృద్ధాప్యంలో తల్లిదండ్రులను ఇబ్బందులకు గురి చేస్తున్న వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కన్న తల్లిదండ్రులను సంరక్షించాల్సిన బాధ్యత బిడ్డలపై ఉందన్నారు. ఈ తరహా ఘటనలపై పోలీసు శాఖ ప్రత్యేక దృష్టిపెట్టిందని, ఇందుకోసం వృద్ధమిత్ర అనే విభాగం ఏర్పాటు చేసి వృద్ధులకు రక్షణ కల్పించి వసతి, భోజనం, భద్రత కల్పించడం వంటి బాధ్యతలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఎవరికైనా ఇలాంటి సమస్యలు ఎదురైనా, లేదా ఈ తరహా ఘటనలు ఎవరి దృష్టికైనా వచ్చినా వారు దగ్గర్లోని పోలీస్స్టేషన్లో లేదా, 100కి ఫోన్ చేసి ఫిర్యాదు చేస్తే బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు.