ప్రమాణ స్వీకారం ఇంకా మిగిలే ఉంది..! ముఖ్యమంత్రి దర్పం ప్రదర్శిస్తున్న జగన్..!!
అమరావతి: అందరూ ఊహించని రీతిలో సీట్లను సాధించి గెలిచారు వైసీపీ నేత జగన్. అసలు జగన్ కు ఓటమి తప్ప అనుకున్న సీట్లు కూడా రావు అన్నవారి నోళ్లు మూతపడేలా ఫలితాలు వెలువడ్డాయి. కాగా వచ్చే వారం నవ్యాంధ్రకు రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న జగన్ కోసం, ఏపీ పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేక కాన్వాయ్ ని సిద్ధం చేశారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని జగన్ నివాసం వద్ద భద్రతను పెంచిన పోలీసులు, ఆ ప్రాంతాన్నంతా మెటల్ డిటెక్టర్లు, డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు చేశారు. స్థానిక ఇళ్లలోనూ సోదాలు జరిపారు. ఇక జగన్ కాన్వాయ్ నిమిత్తం ఓ బులెట్ ప్రూఫ్ వాహనం, మొబైల్ సిగ్నల్ జామర్, అంబులెన్స్, సెక్యూరిటీ సిబ్బంది వాహనాలను ఏర్పాటు చేశారు. మొత్తం ఆరు వాహనాల కాన్వాయ్ ని ఏపీ 18పీ 3418 నంబర్ తో అధికారులు కేటాయించారు. ఈ వాహనాలన్నీ ప్రస్తుతం జగన్ ఇంటి ముందే నిలిచివున్నాయి.
మా టైమ్ వస్తుంది. మేమూ కొడతాం! చెప్పినట్టే కొట్టాడు..చెప్పి మరీ కొట్టాడు!
జగన్ కోసం బుల్లెట్ ప్రూప్ వాహనం...!151 అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ ఘణవిజయం..!!
ఆంధ్రప్రదేశ్ లో ఓట్ల వర్షం కురిసింది. ఏకంగా 151స్థానాలతో వైసీపీకి భారీ మెజార్టీని ప్రజలు అందించారు. ఏపీ ప్రజలు సైకిల్ కు పంక్చర్ చేశారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డినే సీఎంగా ఎన్నుకున్నారు. అన్ని అంచనాలను తల్లకిందులు చేస్తూ, ఎగ్జిట్ పోల్స్ కు కూడా అందని విజయం వైసీపీకి దక్కింది. అధికార టీడీపీ గట్టి పోటీ ఇస్తుందనుకున్నా అనుకున్న స్థాయిలో రాణించలేదు. వైసీపీ సునామీకి ఏకంగా టీడీపీ మంత్రులంతా కొట్టుకుపోయారు. 4 జిల్లాల్లో ఆ పార్టీకి ప్రాతినిధ్యమే లేకుండా పోయింది.
కుప్పంలో బాబుకు బారీటీ తగ్గిన మెజారిటీ..! చిత్తూరులో చిత్తైన టీడిపి..!!
ముఖ్యమంత్రి చంద్రబాబుకు పెట్టని కోట అయిన కుప్పంలో మెజారిటీ గణనీయంగా తగ్గింది. నవరత్నాల హామీలు జగన్కు అధికార పంచామృతాన్ని అందించాయి. పులివెందులలో జగన్ కు భారీ విజయం దక్కింది. చంద్రబాబు నమ్ముకున్న పోలవరం, రాజధాని టీడపీని గట్టెంకించకపోగా నట్టేటా ముంచాయి. ప్రభుత్వ వ్యతిరేకత, ఎమ్మెల్యేలపై విముఖత, పార్టీ వ్యూహాల్లో వెనుకబాటు వంటి అంశాలు అధికార టీడీపీని ఓటమి బాట పట్టించాయి. ఇక ఎన్నో అంచనాలతో, వామపక్షాల అండతో బరిలోకి దిగిన జనసేనాధిపతి పవన్ కల్యాణ్ పోటీచేసిన 2 చోట్లా పరాజయం పాలయ్యారు. ఆ పార్టీ ఒక్క సీటుతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
జగన్ చీఫ్ సెక్యూరిటీగా జోషి..! కాబోయే సీయం కు భారీ భద్రత..!!
నిన్న గెలుపు గుర్రం ఎక్కాడ్డో లేదో వెంటనే అలా అన్ని వచ్చేస్తున్నాయి. జగన్ కోసం భారీ భద్రతతో పాటు, స్పెషల్ కాన్వాయ్ అలా అన్ని సిద్దం చేశారు. కాగా ఇప్పుడు జగన్ చీఫ్ ఆఫీసర్ గా అమర్లపూడి జోషినీ పోలీస్ శాఖ నియమించింది. స్తుతం ఏపీ సీఎం సెక్యూరిటీ వింగ్లో జోషి విధులు నిర్వహిస్తున్నారు. జగన్ సీఎస్వోగా జోషి బాధ్యతలు చేపట్టారు. అలాగే జగన్కు ప్రభుత్వం కాన్వాయ్ కేటాయించింది. కాన్వాయ్లో 6 స్ట్రామ్ వాహనాలు ఉన్నాయి. AP 18 P 3418 నెంబర్తో జగన్కు కొత్త వాహనాలు ఏర్పాటు చేశారు.
వైఎస్ జగన్ నివాసం వద్ద భద్రత పెంపు..! పరిసరాలను అధీనంలోకి తీసుకున్న పోలీసులు..!!
మరో వైపు గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్ జగన్ నివాసాన్ని, దాన్ని పరిసర ప్రాంతాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. జగన్ ఇంటికి దారితీసే రహదారిపై బారికేడ్లను ఏర్పాటు చేసి, ఆ రూట్ లో వాహనాల రాకపోకలపై ఆంక్షలను విధించారు. వైఎస్ జగన్ కాబోయే ముఖ్యమంత్రి కావడంతో, నిబంధనల మేరకు భద్రతను పెంచామని ఉన్నతాధికారులు చెప్పారు. కాగా, మరికాసేపట్లో వైఎస్ జగన్ ఉన్నతాధికారులతో సమావేశమై, రాష్ట్ర పరిస్థితులను సమీక్షించనున్నారు. చీఫ్ సెక్రెటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం సహా పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు పాల్గొననున్నారు. ఆపై వైసీపీ తరఫున గెలిచిన అభ్యర్థులతోనూ జగన్ సమావేశం కానున్నారు.