దేవుళ్లనే దోచుకున్నదొంగ భక్తుడు:వీడు మామూలోడు కాదు!
గుంటూరు:కలికాలం అంటే ఏంటో ఆ పూజారికి కళ్లకు కట్టినట్లు అర్థమైంది. అంతేకాదు అడ్డదారిలో డబ్బు సంపాదించేందుకు జనాలు ఎంతకైనా తెగిస్తారని, దేవుడినైనా దోచుకుంటారనే నిజం అక్షరాలా తెలిసివచ్చింది. పరమ భక్తుడి రూపంలో వచ్చి దేవుళ్లనే దోచుకెళ్లిన ఓ దొంగ ఉదంతం గుంటూరు జిల్లాలో కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే...
గుంటూరు జిల్లా వట్టి చెరుకూరు మండలం వింజనంపాడు గ్రామంలో నెలవైవున్న కోదండరాముని ఆలయం ఆ చుట్టుప్రక్కల ప్రాంతాల్లో చాలా ప్రసిద్ది. అయితే నా రూటే సపరేటు అనుకున్న ఒక దొంగ దృష్టి ఈ గుడిలోని దేవతామూర్తుల ఆభరణాలపై పడింది. వాటిని ఎలాగైనా కొట్టేసి సొమ్ము చేసుకోవాలని నిర్ణయించుకున్న అతడు అందుకు పక్కా ప్లాన్ ప్రణాళిక సిద్దం చేసుకున్నాడు.
ఆ ప్లాన్ ప్రకారం ఈ దేవాలయానికి పూజలు చేసేందుకు అంటూ ఉదయం 6.30 గంటలకే గొప్ప భక్తుడిలా విచ్చేశాడు. రావడంతోనే గర్భాలయం, ఆంజనేయ గుడి చుట్టూ పలుసార్లు ప్రదక్షిణలు చేశాడు. ఆ తర్వాత తనకు దేవుడి అనుగ్రహం కావాలని, అందుకు పూజలు చేయాలంటూ అర్చకుడు శర్మకు రూ.50లు నోటు ఇచ్చాడు. పూజ నిమిత్తం రూ.20 తీసుకొని, మిగతా చిల్లర రూ.30 తిరిగి ఇవ్వాలని కోరాడు. అయితే తన వద్ద చిల్లర లేదన్న పూజారి చిల్లర తెచ్చేందుకని గుడి వెలుపలికి వచ్చాడు.
దీంతో తాను ముందే వేసుకున్న ప్లాన్ ప్రకారం ఆ దొంగ భక్తుడు నిమిషాల వ్యవధిలోనే ఎదురుగా ఉన్న స్వామివారి కంఠాభరణాలు, అమ్మవారి మెడలోని మంగళసూత్రం, ఇతర నగలు (మొత్తం 75 గ్రాములు) కాజేసి పారిపోయాడు. ఆ తరువాత పూజారి చిల్లర తెచ్చి భక్తుడు కోసం చూస్తే కనిపించలేదు. దీంతో అనుమానం వచ్చిన పూజారి స్వామి, అమ్మవార్ల విగ్రహాల వైపు చూడగా బంగారు ఆభరణాలు కనిపించ లేదు. వెంటనే దొంగ దొంగ అంటూ కేకలు వేస్తూ గుడి బైటకు పరుగులు పెట్టుకుంటూ వచ్చారు.
అయితే అప్పటికే ఆ దొంగ భక్తుడు హెల్మెట్ పెట్టేసుకొని తాను వేసుకొని వచ్చిన పల్సర్ బైక్ పై మెరుపు వేగంతో పరారయ్యాడు. పూజారి కేకలు విన్న స్థానికులు ఆ చోరభక్తాగ్రేసుడి కోసం చుట్టుపక్కలా ఎంతవెదికినా ప్రయోజనం లేకపోయింది. దీంతో జరిగిన దొంగతనం విషయమై పూజారి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ సమాచారం తెలిసిన వెంటనే అక్కడికి చేరుకున్న వట్టిచెరుకూరు, ప్రత్తిపాడు పోలిస్ స్టేషన్ల ఎస్సైలు అశోక్, భార్గవ్ అర్చకుడు, స్థానికులతో మాట్లాడి చోరీ జరిగిన తీరును తెలుసుకున్నారు. అనంతరం క్లూస్ టీం కూడా రంగంలోకి దిగి గుడిలో దొంగ భక్తుడు సంచరించిన ప్రాంతాలలో వేలిముద్రలు సేకరించడం జరిగింది. త్వరలోనే ఈ దొంగను పట్టుకుంటామని ఎస్సైలు ఈ సందర్భంగా తెలిపారు.