వైసిపి ఎపి బంద్లో విషాదం...వైకాపా కార్యకర్త మృతి;రాష్ట్ర ప్రభుత్వందే బాధ్యత: వైవీ సుబ్బారెడ్డి
తూర్పుగోదావరి:వైసిపి నిర్వహిస్తున్న ఎపి బంద్ లో విషాదం చోటుచేసుకుంది. తూర్పు గోదావరి జిల్లాలో ఈ బంద్లో పాల్గొన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కాకి దుర్గారావు హఠాన్మరణం చెందారు.
అయితే శాంతియుతంగా జరుగుతున్న బంద్ను టీడీపీ సర్కార్ విఫలం చేసేందేకు చేసిన కుట్ర వల్లే దుర్గారావు మృతిచెందాడని మృతుడి బంధువులు, వైసిపి నేతలు ఆరోపిస్తున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధనలో సీఎం చంద్రబాబు నాయుడు మోసాలు, కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు తీరును వ్యతిరేకిస్తూ వైసిపి అధినేత జగన్ ఇచ్చిన పిలుపు మేరకు వైకాపా నిర్వహిస్తోన్న బంద్లో కార్యకర్త మృతితో విషాదం నెలకొంది.
తోపులాట వల్లే...మరణం
వైసిపి పిలుపు మేరకు తూర్పుగోదావరి జిల్లా బుట్టాయిగూడెంలో బంద్ లో పాల్గొంటున్న తెల్లం బాలరాజుతో పాటు కాకి దుర్గారావు, మరికొందరు వైఎస్సార్సీపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకొని వారిని బలవంతంగా పోలీస్స్టేషన్కు తరలించే యత్నం చేయగా తోపులాట జరిగినట్లుగా వైసిపి నేతలు చెబుతున్నారు. ఈ క్రమంలో దుర్గారవు గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలిపోయారని...ఆయనను ఆస్పత్రికి తరలించగా...చికిత్స పొందుతూ కొంత సమయానికే దుర్గారావు చనిపోయారని వారు తెలిపారు. దుర్గారావు స్వస్థలం బుట్టాయిగూడెం మండలం కృష్ణాపురం వాసి అని తెలిసింది.
జగన్...దిగ్భ్రాంతి
రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం తలపెట్టిన ఏపీ బంద్లో పాల్గొన్న వైఎస్సార్సీపీ కార్యకర్త కాకి దుర్గారావు మృతిపట్ల ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దుర్గారావు కుటుంబానికి జననేత తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. హోదా పోరులో దుర్గారావు అమరుడయ్యారని జగన్ పేర్కొన్నారు. శాంతియుతంగా చేపట్టిన బంద్ను భగ్నం చేసేందుకు పోలీసులు తీసుకుంటున్న చర్యలను వైఎస్ జగన్ ఈ సందర్భంగా తీవ్రంగా ఖండించారు.
రాష్ట్ర ప్రభుత్వం దే...బాధ్యత
పోలీసుల తోపులాట వల్లే తమ పార్టీ కార్యకర్త దుర్గారావు మరణించారని వైఎస్సార్సీపీ ఎస్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు తెల్లం బాలరాజు తెలిపారు. హోదా కోసం శాంతియుతంగా బంద్లో పాల్గొన్న వైఎస్సార్సీపీ కార్యకర్తలను పోలీసులు బలవంతంగా తీసుకెళ్లారని మండిపడ్డారు. ఈ ఘటన చూస్తుంటే ఇది ప్రభుత్వ హత్యలా అనిపిస్తోందన్నారు. దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. దుర్గారావు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. ఇలాంటి ఎన్ని ప్రాణాలు పోతే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తారని ఆయన ప్రశ్నించారు.
ఇది...ప్రభుత్వ హత్య:వైవి సుబ్బారెడ్డి
ప్రత్యేక హోదా పోరాటంలో అమరుడైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కాకి దుర్గారావు మృతి పట్ల ఆ పార్టీ మాజీ ఎంపీ, సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దుర్గారావు మరణ వార్త తెలిసి అక్కడకు చేరుకున్న వైవీ సుబ్బారెడ్డి ఆయన మృతదేహానికి నివాళులు ఆర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ దుర్గారావు మృతి.. రాష్ట్ర ప్రభుత్వ హత్యేనని ఆయన అన్నారు. ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తుంటే.. ప్రజల ప్రాణాలెందుకు హరిస్తున్నారని ఆయన చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీశారు.