ఆడుకుంటూ వెళ్లి పాల గిన్నెలో పడిన బాలుడు మృతి .. శుభకార్యం జరగాల్సిన ఇంట విషాదం
అనంతపురం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. శుభ కార్యం జరగాల్సి ఇంట విషాదం చోటుచేసుకుంది. మంగళ వాయిద్యాలు మోగాల్సిన చోట చావు డప్పు మోగుతోంది. ఓ ఏడాదిన్నర చిన్నారి ప్రమాద వశాత్తూ వేడి పాల గిన్నెలో పడి మరణించడంతో ఓ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది.
అనంతపురం జిల్లాలోని పెద్దపప్పూరు గ్రామంలోని సుంకులమ్మ కాలనీకి చెందిన లోకేశ్వరయ్య, చంద్రిక దంపతులకు ఇద్దరు కుమారులు. వీరిలో దేవాన్ష్ చిన్నవాడు .ఆదివారం లోకేశ్వరయ్య ఇంట్లో శుభకార్యం వుంది. బంధుమిత్రులతో ఇల్లంతా సందడిగా ఉంది. శుభ కార్యం జరగాల్సి న ఆ ఇంట్లో చోటు చేసుకున్న విషాదం స్థానికంగా ఉన్న వారందరిని ఆవేదనకు గురి చేసింది.
తెల్లవారితే శుభకార్యం అనగా భోజనాల నిమిత్తం పెరుగు తోడుపెట్టటం కోసం కోసం రాత్రి పాలను వేడి చేసి, పెద్ద పాత్రలో పోసి చల్లార్చేందుకు ఫ్యాన్ కింద వుంచారు. ఇక ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. ఈ సమయంలో దేవాన్ష్ అనే సంవత్సరన్నర వయసున్న బాలుడు ఆడుకుంటూ వెళ్లి పాలగిన్నెలో పడిపోయాడు.
చిన్నారి ఏడుపును విన్న కుటుంబసభ్యులు గిన్నెలోంచి బాలుడిని బయటకు తీసి హుటాహుటిన అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తరలిస్తుండగా మార్గమధ్యలోనే దేవాన్ష్ ప్రాణాలు విడిచాడు. చిన్నారి మరణంతో గ్రామంలో విషాదం అలుముకుంది.
18 నెలల పసివాడు..బుడిబుడి అడుగులతో ఇంత సందడి చేసిన చిన్నారి ఊహించని విధంగా ప్రమాదం జరిగి చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. దేవాన్ష్ ఇక లేరు అనే వార్తను తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక వీరి దుఃఖాన్ని చూసిన స్థానికులు కన్నీరు పెడుతున్నారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదచాయలు అలుముకున్నాయి. చిన్న పిల్లలు ఇంట్లో ఉన్న సమయంలో వారి పైన ఒక దృష్టి పెట్టి ఉంచాల్సిన అవసరం ఉంది. చిన్నారుల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోకుంటే చిన్న పాటి నిర్లక్ష్యం అయినా భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి.