మంగంపేట గనుల్లో సొరంగం బైటపడింది: సైలెంట్ గా మూసేశారు
వైఎస్సార్ జిల్లా: మంగంపేట బెరైటీస్ గనుల్లో సొరంగ మార్గం బైటపడిన ఘటన కలకలం సృష్టించింది. కార్మికులు ఖనిజాన్నివెలికితీసే పనుల్లో ఉండగా ఈ సొరంగం వెలుగు చూసింది. అయితే తొలుత సొరంగంలోకి వెళ్లే ప్రయత్నం చేసిన అధికారులు,సిబ్బంది లోనికెళ్లే కొద్దీ ఊపిరి ఆడకపోతుండటంతో వెనక్కి వచ్చేశారు. అయితే ఆ తరువాత ఈ విషయాన్ని రహస్యంగా ఉంచి సొరంగాన్ని మూసివేయడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
మరోవైపు ఈ సొరంగం బైటపడిన ఘటన ఆ నోటా ఈ నోటా పరిసర ప్రాంతాలంతా ప్రచారం జరగడంతో కలకలం రేగింది. ఈ ప్రాంతాన్ని మట్లి రాజులు పాలించారంటూ, వారు సొరంగ మార్గాలు ఉపయోగించారంటూ స్థానికంగా అనేక కథలు ప్రచారంలో ఉండటంతో ఈ సొరంగం బైటపడిందని చెబుతున్న ప్రదేశాన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.
వైఎస్సార్ జిల్లా మంగంపేట బెరైటీస్ గనుల్లో సుమారు 26 బెంచ్లు ఉన్నాయి. వీటిలో 19వ బెంచ్లో గురువారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో కార్మికులు ఖనిజాన్ని వెలికితీసే పనులు చేస్తుండగా ఒక ప్రదేశంలో రెండున్నర అంగుళాల వెడల్పు పదిమీటర్ల మేర గొయ్యి ఏర్పడింది. దీంతో ఆశ్చర్యపోయిన కార్మికులంతా ఆ గొయ్యివద్దకు చేరుకుని లైట్లువేసి పరిశీలించగా మనిషి వెళ్లడానికి అనువుగా లోపల సుమారు పది మీటర్ల లోతు వైశాల్యంతో రహస్యమార్గం కనిపించింది. దీంతో కార్మికులు కొంత దూరం లోనికి వెళ్లారు, అయితే ఇంకా లోనికి వెళ్లేందుకు ప్రయత్నించగా ఊపిరి ఆడకపోతుండటంతో భయపడి కార్మికులు వెనక్కి వచ్చేశారు.
ఈ విషయం తెలిసి విలేకరులు అక్కడికి చేరుకోగా ఇప్పుడు సొరంగం లాంటిదేమీ లేదని, దాన్ని మూసివేశామని గనుల శాఖ జనరల్ మేనేజర్ కేథారనాథ్రెడ్డి చెప్పారు. సొరంగం బైటపడిన ప్రాంతాన్ని చూసేందుకు కూడా ఎవరినీ అనుమతించలేదు. ఏ ప్రమాదం జరుగకుండా ఉండేందుకే సొరంగాన్నిమూసివేసినట్లు జీఎం చెబుతున్నారు. ఈ విషయం స్థానికులకు తెలియడంతో ఈ ప్రాంతంలో సొరంగ మార్గాలుంటాయని, ఇక్కడి వైకోట ప్రాంతాన్నిమట్లిరాజులు పాలించారని చెబుతున్నారు. వారు యుద్ధ సమయాల్లో శత్రువులనుంచి తమ కుటుంబాన్ని, సంపదను రక్షించుకోవడానికి ఈ సొరంగమార్గాలు ఏర్పాటు చేసుకున్నట్లు ఇక్కడి చరిత్ర చెబుతోందని వివరిస్తున్నారు.
ఇందుకు రుజువుగా నళ్లరాళ్లగుట్ట వద్ద ఉన్న రహస్య మార్గం గురించి తెలియజేస్తున్నారు. బండరాళ్లను వేయడంతో ఇది పూడిపోయిందని...ఈ సొరంగం చిత్తూరుజిల్లా చంద్రగిరి కోట వరకు ఉందని...అప్పట్లో రాజులు ఈ రహస్యమార్గం గుండా రాకపోకలు సాగించేవారని ఇప్పటికీ చెప్పుకుంటుండం గురించి వివరించారు. అయితే తాజాగా సొరంగం వెలుగు చూసిన సంగతి బయటపెట్టకుండా...మరోవైపు పురావస్తుశాఖకు ఈ సమాచారం ఇవ్వకుండా ఏపీఎండీసీ అధికారులు రహస్యమార్గాన్నిమూసివేయడంపై స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.