ఏపీ రాజధానిపై అనిశ్చితి ఎఫెక్ట్ .. సంక్షోభంలో విజయవాడలో హోటల్స్ పరిశ్రమ
ఏపీ రాజధాని అమరావతి విషయం లో నెలకొన్న అనిశ్చితి అక్కడి రియల్ ఎస్టేట్ రంగాన్నే కాకుండా, హోటల్ పరిశ్రమను కూడా కుదేలు చేస్తోంది. రాజధాని అమరావతి ఈ విషయంలో క్లారిటీ లేకపోవడంతో ఏర్పడిన సందిగ్ధం విజయవాడ నగరంలోని హోటల్ పరిశ్రమ తాకింది. కోట్ల రూపాయల వ్యాపారం చేసే హోటల్స్ ఇప్పుడు నష్టాల బాటలో నడుస్తున్నాయి.
సంక్షోభంలో విజయవాడ హోటల్స్
గత నాలుగు నెలల్లో విజయవాడ కేంద్రంగా ఉన్న హోటల్స్ లో ఆక్యుపెన్సీ రేటు 90 శాతం నుండి 40 శాతానికి తగ్గింది. పలు ప్రసిద్ధ బ్రాండెడ్ హోటల్స్ సైతం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో సిబ్బందిని తగ్గిస్తున్నాయి. ఉదాహరణకు నగరంలో కొత్తగా నిర్మించిన స్టార్ హోటల్లో 200 గదులు ఉంటే సగటున 170 గదులు ఖాళీగా ఉంటున్న పరిస్థితి నెలకొంది. గత 30 ఏళ్లలో ఆతిథ్య రంగం ఎప్పుడూ ఇంత ఘోరమైన తిరోగమనాన్ని చూడలేదని హోటల్స్ పరిశ్రమల యజమానులు లబోదిబోమంటున్నారు.
బొత్సా వ్యాఖ్యలతో రాజధాని పై నెలకొన్న అనిశ్చితి
రాజధాని అమరావతి మార్పు విషయంలో రోజుకో రకంగా వార్తలు వస్తున్నాయి. గతంలో రాజధాని అమరావతి ప్రాంతం ముంపునకు గురవుతుందని, రాజధానికి శ్రేయస్కరమైన ప్రాంతం కాదని, అమరావతిని మార్చాలన్న అభిప్రాయాన్ని మంత్రి బొత్స సత్యనారాయణ వ్యక్తం చేసిన నేపథ్యంలో రాజధాని అమరావతి విషయంలో నీలి నీడలు కమ్ముకున్నాయి. ఇక ఆ తర్వాత తాజాగా బొత్స సత్యనారాయణ రాజధాని విషయంలో నిపుణుల కమిటీ రాష్ట్రమంతా పర్యటిస్తానని, కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత కేబినెట్ భేటీలో రాజధాని గురించి ప్రకటిస్తామని చెప్పడం ఏపీ రాజధానిని డైలమా లోకి నెట్టింది.
విజయవాడలో హోటల్స్ పరిశ్రమ కుదేలు
ఇక దీని ప్రభావం వల్ల రాజధాని అమరావతి కి దగ్గరగా ఉన్న విజయవాడ నగరంలోని హోటల్ పరిశ్రమ తీవ్రంగా దెబ్బతింది. సమీప భవిష్యత్తులో పరిస్థితి మెరుగుపడే అవకాశం కూడా లేదని వివిధ హోటల్స్ యజమానులు భావిస్తున్నారు. విజయవాడ నగరంలో ఒక ఫైవ్ స్టార్,2 ఫోర్ స్టార్,20 త్రీ స్టార్,100 టూ స్టార్ మరియు 2 స్టార్ రేటింగ్ హోటల్లో క్రింద రెండు వందల హోటళ్లు ఉన్నాయి. అన్ని రకాల హోటల్స్ లోనూ దాదాపు 5000 గదులు అందుబాటులో ఉన్నాయి.
అంతర్జాతీయ బ్రాండ్ హోటళ్ళలోనూ నష్టాలు
అమరావతి రాజధాని నగరంగా అభివృద్ధి చెందుతున్న కారణంగా అంతర్జాతీయ బ్రాండ్ హోటళ్ళు మరియు ఆన్లైన్ సర్వీస్ చైన్ హోటళ్లు కూడా నగరంలో తమ సేవలను అందిస్తున్నాయి. హోటల్ వ్యాపారం నగరంలో దినదినాభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో కుప్పలుతెప్పలుగా విజయవాడ కేంద్రంగా హోటల్స్ వెలిశాయి. గత ఐదేళ్లలో ఎవరూ ఊహించని విధంగా హోటల్ పరిశ్రమ అభివృద్ధి చెందింది. నగర హోటల్స్ లోని ఆక్యుపెన్సీ రేటు కూడా 40 శాతం నుండి 95 శాతానికి పెరిగింది.
నాలుగు నెలలుగా హోటల్స్ లో పడిపోయిన ఆక్యుపెన్సీ రేటు
వివిధ ప్రాంతాల నుండి ప్రజలు వాణిజ్య మరియు ప్రభుత్వ పనుల నిమిత్తం నగరానికి తరచూ వస్తుండేవారు.ఇక అంతే కాదు విదేశీ ప్రతినిధులు,పారిశ్రామికవేత్తలు,కాంట్రాక్టర్లు,రాజకీయ నాయకులతో నగరంలో హోటల్స్ లో ఎప్పుడూ సందడి ఉండేది. ఇక ఈ నేపథ్యంలోనే చాలామంది పారిశ్రామికవేత్తలు హోటల్ బిజినెస్ బాగుందని భావించి విజయవాడ కేంద్రంగా హోటల్స్ పెట్టారు. అయితే ప్రస్తుతం కథ అడ్డం తిరిగింది. గత నాలుగు నెలల్లో హోటల్స్ లో ఆక్యుపెన్సీ రేటు విపరీతంగా పడిపోయింది.
సిబ్బందికి ఉద్వాసన పలుకుతున్న హోటల్స్
ఇక ఇక్కడ ఉన్న ప్రముఖ ఫైవ్ స్టార్ హోటల్ సైతం నష్టాలను మూటగట్టుకుంది. దీంతో అందులో పని చేసే సిబ్బందిని 20 మందిని తొలగించినట్టు తెలుస్తుంది. ఈ సంవత్సరం మొదటి ఆరునెలల్లో ఈ హోటల్ 5 కోట్ల నష్టాన్ని చవి చూసింది. ఈ పరిస్తితు ఇలాగే ఉంటె నగరంలోని హోటల్స్ లో పని చేసే కార్మికులు 20శాతానికి పైగా ఉపాధి కోల్పోయే ప్రమాదం వుంది. మొత్తం 20 వేల మంది కార్మికులు విజయవాడలోని హోటల్ పరిశ్రమ మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. రాజధాని విషయంలో నెలకొన్న అనిశ్చితి నేపధ్యంలోనే హోటల్స్ పరిశ్రమ ఒడిదుడుకులకు లోనవుతుంది.