మాయదారి మత్తుతో బతుకు చిత్తు..! మత్తు పదార్థాల వినియోగం ఏపీలో అధికం.!!
అమరావతి/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ మద్యానికి బానిసలైన వారిలో రెండో స్థానంలో, మాదకద్రవ్యాలకు బానిసలైన వారిలో ఏడో స్థానంలో ఉందని గణాంకాలు ఘోషిస్తున్నాయి. వ్యసనాలకు బానిసలైన వారికి తక్షణం చికిత్సలు అందించడంతో పాటు.. ప్రాథమిక, మధ్య స్థాయి వ్యసనపరులూ ఆ సమస్య నుంచి బయట పడేందుకు సహాయం చేయకపోతే లక్షల కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం ఉంది.
ఆంధ్రప్రదేశ్ జనాభాలో ఆరు శాతం మంది మద్యానికి బానిసలేనట.. మత్తు పదార్థాల వినియోగంపై కేంద్ర సామాజిక న్యాయ, సాధికార మంత్రిత్వశాఖ నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైన చేదు నిజమిది. మద్యం మహమ్మారికి బానిసలైన వారు అధికంగా ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉన్నట్లు ఈ అధ్యయన నివేదిక తేల్చింది.
నల్లమందు(ఓపియం), హెరాయిన్ తదితర మాదకద్రవ్యాలను అత్యధికంగా వినియోగిస్తున్న ఏడు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కూడా ఒకటని స్పష్టం చేసింది. ఇంజెక్షన్ల ద్వారా మాదకద్రవ్యాలు తీసుకుంటున్న వారూ ఏపీలో ఎక్కువగానే ఉన్నారని పేర్కొంది. ఇలాంటి వారందరికీ తక్షణ చికిత్స అందించాల్సిన అవసరముందని హెచ్చరించింది. పదేళ్ల వయసుకే బాలలూ మద్యం రుచి మరుగుతున్నారని.. మాదకద్రవ్యాలను వినియోగించే వారిలో 75ఏళ్ల పైబడినవారూ ఉన్నారని వివరించింది.
నివేదికలోని ప్రధానాంశాలు ఇలా ఉన్నాయి. మాదక ద్రవ్యాలు అత్యధికంగా వినియోగించే వారిలో సగం కంటే ఎక్కువ మంది ఏడు రాష్ట్రాలు, దిల్లీలోనే ఓపియం, హెరాయిన్, ఫార్మాసూటికల్స్ మాదకద్రవ్యాలను అత్యధికంగా వినియోగించే వారు దేశవ్యాప్తంగా 77 లక్షల మంది ఉండగా.. వారిలో సగం కంటే ఎక్కువ మంది ఉత్తరప్రదేశ్, పంజాబ్, హరియాణా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, దిల్లీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనే ఉన్నారు. ఈ జాబితాలో ఏపీ ఏడో స్థానంలో నిలిచింది.