ఓటుకు నోటు కేసు మళ్లీ హఠాత్తుగా తెర మీదకు ...కారణం ఇదా!
అమరావతి:ఇప్పుడు రెండు తెలుగురాష్ట్రాల్లో హాట్ టాపిక్ ఓటుకు నోటు...2015 తెలంగాణా ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న ఈ సంచలనాత్మక కేసు అప్పట్లో కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యావత్ భారత దేశంలో సంచలనాత్మకంగా మారింది.
అయితే ఆ తరువాత ఈ కేసుకు సంబంధించి అడపాదడపా చిన్నపాటి కంపనాలు చోటుచేసుకుంటున్నప్పటికీ మొత్తం మీద క్రమంగా ఈ కేసు అలజడి సద్దుమణుగుతూ వస్తున్న వాతావరణం కనిపించింది. అయితే తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ ఉన్నట్టుండి హఠాత్తుగా ఈ కేసు మీద సమీక్ష నిర్వహించడంతో మళ్లీ తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. అయితే కెసిఆర్ సడెన్ గా ఈ కేసును తెరమీదకు తీసుకురావడంపై రాజకీయాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇగో క్లాషెసే ఈ కేసు తెరమీదకు రావడానికి కారణమని కొందరు రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఎలాగంటే?....
పూర్వాపరాలు...కెసిఆర్ వ్యాఖ్యలు
ఫెడరల్ ఫ్రంట్ పేరుతో జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తీసుకు వస్తానంటూ ముందుకు సాగుతున్న తెలంగాణ సిఎం కె.చంద్రశేఖరరావు ఆ ప్రయత్నంలో భాగంగానే ఇటీవలే తమిళనాడు పర్యటన జరిపిన సంగతి తెలిసిందే. అక్కడ వివిధ తమిళ రాజకీయ పార్టీల నేతలను కలిసిన అనంతరం కెసిఆర్ మీడియాతో మాట్లాడారు. ఆ సందర్భంలో చంద్రబాబుతో ఫెడరల్ ఫ్రంట్ విషయం చర్చించారా అన్న ప్రశ్నకు సామాధానంగా...తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనకు బెస్ట్ ఫ్రెండ్ అని, తామిద్దరం గతంలో చాలాకాలం కలసి పనిచేశామని చెప్పారు. ఫెడరల్ ఫ్రంట్ విషయమై చంద్రబాబు తో మాట్లాడలేదని త్వరలోనే అమరావతిలో చంద్రబాబును కూడా కలుస్తామని, ఆయన సహకారం తీసుకుంటామని చెప్పిన సంగతి తెలిసిందే.
కెసిఆర్ వ్యాఖ్యలు...చంద్రబాబుకు చిరాకు
అయితే తమిళనాడు పర్యటనలో కెసిఆర్ మాట్లాడిన మాటలు చంద్రబాబుకు నచ్చలేదట. సీనియర్ అయిన తనను ఫ్రెండ్ అని చెప్పడం, తన దగ్గర మంత్రి వర్గంలో పనిచేసిన 1997 నుంచి 99 వరకు అప్పటి అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ లో సిఎం చంద్రబాబు హయాంలో మంత్రి గా పనిచేసిన కెసిఆర్ తనను ఫ్రెండ్ గా మాత్రమే సంబోధించడం చంద్రబాబుకు నచ్చలేదట. తమిళ నేతలు అందరికీ చంద్రబాబు సీనియారిటీ గురించి, తెలుగు రాష్ట్రాల్లో పరిణామాల గురించి అవగాహన ఉండే నేపథ్యంలో కెసిఆర్ తనకు పెద్దగా ప్రాధాన్యత ఆపాదించకుండా మాట్లాడిన తీరు చంద్రబాబుకు చిరాకు తెప్పించిందట.
ఆ తరుణంలో...టిటిడిపి నేతల సమావేశం
అలా కెసిఆర్ తీరుతో అసహనంతో ఉన్న చంద్ర బాబు అదే తరుణంలో హైదరాబాద్ లోని ఎన్టీఆర్ భవన్ లో టీటీడీపీ నేతలతో సమావేశం అవ్వాల్సి వచ్చిందట. ఆ సమావేశంలో నారా బ్రాహ్మణికీ తెలంగాణా పార్టీ పగ్గాలు ఇవ్వాలన్న టిటిడిపి నేతల డిమాండ్ చిరాకు తెప్పించిందట. ఆ తరుణంలోనే కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ గురించి టాపిక్ రావడంతో అసలే కెసిఆర్ తీరుపై గుర్రుగా ఉన్న చంద్రబాబు "ఫెడరల్ ఫ్రంట్ లేదు, ఏ ఫ్రంటూ లేదు. టీఆర్ఎస్లో కీలక నిర్ణయాలు తీసుకోవడంలో అంతర్గతంగా సమస్యలేమైనా ఉండవచ్చు. ఇదంతా ఇక్కడి సమస్యల నుంచి దృష్టి మళ్లించే ఎత్తుగడ" అని తీసిపారేసినట్లు మాట్లాడేశారట.
అందేకాదు...మరి కొన్ని వ్యాఖ్యలు
అంతేకాదు...'ఫ్రంట్ లు, పొత్తుల సంగతి పూర్తిగా పక్కనపెట్టండి. పార్టీని ఎలా బలోపేతం చేయాలన్న దానిపైనే మీ దృష్టి కేంద్రీకరించండి. తెలంగాణలో త్రిముఖ పోటీ ఉంటుంది. తద్వారా టీడీపీకి కొన్ని అసెంబ్లీ స్థానాలు దక్కవచ్చు. సమస్యలపై పోరాడకుండా ప్రభుత్వంపై మెతకగా ఉండవద్దు. నాయకత్వ బాధ్యతల్లో ఉన్నవారికి పక్షపాతం అసలే వద్దు, గ్రూపు రాజకీయాలు పక్కనపెట్టండి, టికెట్ల సంగతి నేను చూసుకుంటాను, ముందుగానే ప్రకటిస్తాను' అని టీటీడీపీ నేతలతో చంద్రబాబు స్పష్టం చేశారట. ఇప్పటివరకైతే తననెవరూ ఫ్రంట్ గురించి సంప్రదించలేదని, అసలు ఇలాంటి వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పేశారట.
ఈ విషయం...కెసిఆర్ దగ్గరకు
ఈ విషయాలన్నీ కెసిఆర్ దగ్గరకు ఎవరో మోసుకొని పోవడం...తన ఫెడరల్ ఫ్రంట్ ను చంద్రబాబు తేలిగ్గా తీసిపారేయడంతో పాటు ప్రభుత్వంపై పోరాటం, వచ్చే ఎన్నికల్లో టిడిపి పోటీ తదిదర విషయాల గురించి చంద్రబాబు గట్టిగా మాట్లాడటం కెసిఆర్ అహాన్ని దెబ్బతీసి ఉండొచ్చంటున్నారు. కావాలంటే చంద్రబాబును ఇబ్బంది పెట్టగల అవకాశం ఉన్న తాను స్నేహపూర్వకంగా మెలుగుతుంటే చంద్రబాబు ఇలా మాట్లాడటం ఏమిటని కెసిఆర్ కు చిర్రెత్తుకొచ్చి ఉండొచ్చనేది రాజకీయ పరిశీలకుల అభిప్రాయం. అందులోనూ కెసిఆర్ తాను ఎవరినైనా మాట్లాడే విషయంలో మాటపట్టింపు ఉండదు కానీ తననెవరైనా అనే విషయంలో మాటపట్టింపు చాలా తీవ్రంగా ఉంటుందని, అందుకు గతంలో చాలా ఉదాహరణలున్నాయని గుర్తు చేస్తున్నారు.
అందుకే...గట్టి హెచ్చరికలా
అందుకే చంద్రబాబు కు గట్టి హెచ్చరికలా ఉండేలాగా...ప్రస్తుత పరిస్థితుల్లో చంద్రబాబు తమపై ఆధిపత్య భావనని ఏ దశలో ప్రదర్శించడాన్ని తాము సహించమనే విషయాన్ని స్పష్టం చేసేలాగా కెసిఆర్ హఠాత్తుగా మళ్లీ ఓటుకు నోటు కేసును తెరమీదకు తీసుకువచ్చారంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ కేసు తెరమీదకు రావడం కేంద్రానికి కూడా సంతోషాన్నిస్తుందనే విషయం కూడా తెలిసే ఏమాత్రం ఆలస్యం చేయకుండా దీన్ని వెంటనే తిరగదోడుతున్నారని వారు అభిప్రాయపడుతున్నారు. అదే నిజమైతే కేవలం ఇగో క్లాషెసే ఓటుకు నోటుకు తిరిగి తెరమీదకు రావడానికి కారణమయ్యాయని భావించవచ్చనేది రాజకీయ పరిశీలకుల విశ్లేషణ.