కొత్త ప్రాజెక్ట్ ల డీపీఆర్ లను కేంద్రానికి పంపటంపై ఏపీ, తెలంగాణా వేచి చూసే ధోరణి ... కారణం ఇదే!!
ఆంధ్రప్రదేశ్ ,తెలంగాణ రాష్ట్రాలలో నిర్మించ తలపెట్టిన కొత్త ప్రాజెక్టుల డీపిఆర్ లు కేంద్రానికి సమర్పించాలని ఇప్పటికే కేంద్ర జలవనరుల శాఖ మంత్రి రెండుసార్లు లేఖలు రాసిన విషయం తెలిసిందే. అయితే ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు మాత్రం కేంద్రానికి డీపీఆర్ లు సమర్పించే విషయంలో వేచి చూసే ధోరణి అవలంభిస్తున్నాయి. ఏపీ ఏం చేస్తుంది అన్న దానిపై తెలంగాణ, తెలంగాణ ఇచ్చాక చూద్దాంలే అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పటివరకు కేంద్రానికి డీపీఆర్ లు పంపించకపోవడం గమనార్హం .
డీపీఆర్ లను సమర్పిస్తే ఎదురయ్యే పరిణామాలపై కసరత్తులు చేస్తున్న తెలుగు రాష్ట్రాలు
రెండు తెలుగు రాష్ట్రాలు డిపిఆర్ లు సమర్పించిన తర్వాత ఎదురయ్యే పరిణామాలపై కసరత్తు చేస్తున్నాయి. ఇటు కృష్ణ అటు గోదావరి నదులపై ఏపీ తెలంగాణ రాష్ట్రాలు చేపట్టే కొత్త ప్రాజెక్టులపై ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు నిబంధనలు పాటించటం లేదంటూ, అనుమతులు లేకుండా నిర్వహిస్తున్నారు అంటూ పరస్పరం ఫిర్యాదులు చేసుకోవడం రెండు రాష్ట్రాలకు ఇబ్బంది తెచ్చిపెట్టింది. ఈ విషయమై కృష్ణా, గోదావరి యాజమాన్య బోర్డులు సైతం రెండు రాష్ట్రాల తీరును కేంద్రానికి నివేదించాయి.
మరోమారు కొత్త ప్రాజెక్ట్ ల డీపీఆర్ లను పంపాలని ఏపీ, తెలంగాణా రాష్ట్రాలకు కేంద్రమంత్రి లేఖ
చివరకు అపెక్స్ కౌన్సిల్ లోనూ ఈ విషయంపై పెద్ద చర్చ జరిగింది. దీంతో కేంద్రం రంగంలోకి దిగి కొత్త ప్రాజెక్టులకు సంబంధించిన డిపిఆర్ లను సమర్పించాలని రెండు రాష్ట్రాలను ఆదేశించింది.
ఇక అపెక్స్ కౌన్సిల్ లో అన్ని వివరాలు సమర్పించాలని కేంద్రం ఆదేశించి మూడు నెలలు గడిచినా, డిపిఆర్ లను సమర్పించడానికి అటు ఆంధ్రా ఇటు తెలంగాణ రాష్ట్రాలు ముందుకు రాలేదు. దీంతో కేంద్ర మంత్రి తాజాగా ఏపీ ,తెలంగాణ రాష్ట్రాలకు మరో లేఖ రాయడంతో రెండు రాష్ట్రాలు పునరాలోచనలో పడ్డాయి.
డిపిఆర్ లు సమర్పించిన తర్వాత సకాలంలో కేంద్రం వాటికి అనుమతి ఇవ్వకపోతే ఎలా?
డిపిఆర్ లు సమర్పించిన తర్వాత సకాలంలో కేంద్రం వాటికి అనుమతి ఇవ్వకపోతే ఎలా అని అనుమానం రెండు రాష్ట్ర ప్రభుత్వాలు వ్యక్తం చేస్తున్నాయి. అధికారికంగా డీపీఆర్ సమర్పించిన తర్వాత, వాటిని ఆధారంగా చేసుకొని కేంద్రం కొర్రీలు పెట్టే అవకాశం ఉంటుందని అనుమానిస్తున్నాయి. ఇప్పటికే ఈ ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి వివిధ బ్యాంకుల నుండి ఆర్థిక సంస్థల నుండి రుణాలు స్వీకరిస్తున్నారు. ఒకవేళ కేంద్రం తాము సమర్పించిన డీపీఆర్ లకు కొర్రీలు పెడితే రుణాల స్వీకరణ లో ఇబ్బందులు తలెత్తే అవకాశముందని తెలుగు రాష్ట్రాలు భయపడుతున్నాయి.
వీలైనంత కాలం వాయిదా వేసి వేచి చూసే ధోరణిని అవలంబించాలని నిర్ణయం
అందులో భాగంగానే రెండు తెలుగు రాష్ట్రాలు దానికి కొత్త ప్రాజెక్టుల నిర్మాణ డిపిఆర్ లను సమర్పించడానికి వీలైనంత కాలం వాయిదా వేసి వేచి చూసే ధోరణిని అవలంబించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కేంద్రం అడిగిన ప్రాజెక్టులకు సంబంధించిన డిపిఆర్ లను తెలంగాణ ప్రభుత్వం సిద్ధం చేసి కూడా, కేంద్రానికి సమర్పించకుండా మిన్నకుంది . ఏపీ ప్రభుత్వం కూడా తెలంగాణా పంధానే అనుసరిస్తుంది.
డీపీఆర్ ల విషయంలో ఏపీ స్పందన చూశాకే తెలంగాణా , తెలంగాణా పంపాకే ఏపీ
డిపిఆర్ ల సమర్పణ విషయంలో ఏ విధంగా ఏపీ స్పందిస్తుందో చూసిన తర్వాత తెలంగాణ తుది నిర్ణయానికి రావాలని భావిస్తోంది. ఇదే సమయంలో తెలంగాణ డిపిఆర్ లను ముందుగా సమర్పిస్తే, ఆ తర్వాత పరిణామాలను గమనించి తదనుగుణంగా తాము డిపిఆర్ లను సమర్పించాలని ఏపీ భావిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల తాత్సారంతో ఇప్పటికే రెండు మార్లు లేఖలు రాసిన కేంద్ర జల వనరుల శాఖ తెలుగు రాష్ట్రాల తీరుపై ఏం నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.