అగ్రిగోల్డ్ ఆస్తుల కోసం ప్రభుత్వం కుట్ర: కన్నా;వైసిపిది ఆ డ్రామా...బిజెపిది ఈ డ్రామా:బుద్ధా వెంకన్న
గుంటూరు:ఎపిలో బిజెపి,టిడిపి నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సోమవారం మీడియాతో మాట్లాడుతూ అగ్రిగోల్డ్ ఆస్తులను టిడిపి ప్రభుత్వం దోచేయాలని కుట్ర పన్నిందని ఆరోపించారు.
అయితే ఆ కుట్రను బిజెపి గమనించి అడ్డుకుందని కన్నా లక్ష్మీనారాయణ చెప్పారు. బిజెపి అక్రమాలు జరిగినట్లు ఆరోపిస్తున్న అమరావతి భూ కుంభకోణం, కాకినాడ సెజ్, విశాఖలో భూ కుంభకోణాలపై ప్రభుత్వం నోరు మెదపడం లేదెందుకని దుయ్యబట్టారు. నవ్యాంధ్ర రాజధాని పరిధిలో ఏడాదికి మూడు పంటలు పండే భూమిని రైతుల నుంచి లాక్కొని వ్యాపార కేంద్రంగా మార్చడం సిగ్గుచేటని ఆయన ధ్వజమెత్తారు.
రాజధాని పరిధిలోని ఉండవల్లి, పెనుమాక రైతులను రాష్ట్ర ప్రభుత్వం చిత్రహింసలకు గురి చేస్తోందని కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. ఇసుక ఉచితం పేరుతో చంద్రబాబు, లోకేష్ భారీ ఎత్తున దోచుకుంటున్నారని చెప్పారు. ఈ భూ కుంభకోణాలు, అక్రమాలు ఆగిపోవాలంటే ప్రజలు తిరగబడాల్సిందేనని కన్నాలక్ష్మీనారాయణ ఈ సందర్భంగా పిలుపు ఇచ్చారు.
మరోవైపు టిడిపి ప్రభుత్వంపై ప్రతిపక్ష నేతల విమర్శలపై టిడిపి ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ప్రతిస్పందించారు. ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఒకవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోడికత్తి డ్రామా ఆడుతుంటే...మరోవైపు బీజేపీ అగ్రిగోల్డ్ డ్రామా ఆడుతోందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర బిజెపి నేతలు అగ్రిగోల్డ్ ఆస్తులు అమిత్ షా కుమారుడికి అప్పగించాలని చూస్తున్నారని బుద్ధా వెంకన్న ఆరోపించారు.
అగ్రిగోల్డ్ బాధితులకు ఎపి ప్రభుత్వం న్యాయం చేయాలని ప్రయత్నం చేస్తుంటే కావాలనే బిజెపి నేతలు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని బుద్ధా వెంకన్న ఆరోపించారు. అగ్రిగోల్డ్ విషయమై ఎపి ప్రభుత్వంపై అవాకులు చవాకులు మాట్లాడుతున్న బీజేపీ అగ్రిగోల్ఢ్ ఆస్తులపై బహిరంగ చర్చకు సిద్ధమా?...అని బుద్దా వెంకన్న సవాల్ చేశారు. త్వరలోనే బిజెపి ఎంపి జీవీఎల్, మాజీ సిఎస్ ఐవైఆర్, వైసిపి ఎంపి విజయసాయిరెడ్డి నాటకాలను తాను ఆధారాలతో సహా బయట పెట్టనున్నట్లు బుద్ధా వెంకన్న ఈ సందర్భంగా వెల్లడించారు.