పాపికొండల బోట్లపై నిషేధం ఎత్తివేత...ఇదేంటిలా?: అస్థవ్యస్థ నిర్ణయాలు
తూర్పుగోదావరి:పాపికొండల యాత్రకు వెళ్లే బోట్లపై నిషేధం విధించిన ప్రభుత్వం 24 గంటలు కూడా గడవకముందే మళ్లీ తన తన నిర్ణయాన్ని మార్చుకుంది. మళ్లీ ఆ బోట్లకు అనుమతిస్తూ నిర్ణయం తీసుకుంది.
ఇటీవలి అగ్నిప్రమాదం నేపథ్యంలో పాపికొండల విహారయాత్రకు సందర్శకులను తీసుకెళ్లే సుమారు 70 ప్రైవేట్ బోట్లలో ఏ ఒక్కదానికి కూడా ప్రభుత్వ అనుమతి లేదని తెలియడంతో ఆదివారం నుంచి అక్కడకు వెళ్లే బోట్లన్నింటినీ తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు శనివారం ఉదయం జలవనరులశాఖ ప్రకటించింది. అయితే ఆ తరువాత ఏమైందో ఏమో కానీ శనివారం రాత్రి 11 గంటలకు మళ్లీ బోట్లకు అనుమతులు ఇస్తున్నట్లు ప్రకటించడంతో ఆదివారం బోట్ల రాకపోకలన్నీ యథావిధిగా కొనసాగాయి.
నిషేధం...అంతలోనే ఎత్తివేత
అయితే ఆదివారం భారీ సంఖ్యలో పర్యాటకులు తరలివస్తారని, ఒక్కసారిగా బోట్లు నిలిపివేస్తే పర్యాటకులు అసంతృప్తికి లోనయ్యే అవకాశం ఉందని మళ్లీ నిర్ణయం మార్చుకున్నట్లు తెలుస్తోంది. మరైతే ఆ విషయం నిషేధం ప్రకటించే సమయంలో ఎందుకు జ్ఞప్తికి రాలేదనేది విచిత్రంగా ఉంది.
సందర్శకుల వెల్లువ
మరోవైపు ఊహించిన విధంగానే ఆదివారం రెండు తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 700 మంది పర్యాటకులు దేవీపట్నం మండలంలోని పోశమ్మగండికి చేరుకున్నారు. అక్కడి నుంచి 7 బోట్లలో పాపికొండల విహారానికి వెళ్లారు. దీంతో దేవీపట్నం మండలంలోని గోదావరి తీరం ఒక్కసారిగా పర్యాటకులతో సందడిగా మారింది. అయితే ఎన్నడూ లేనంతగా పర్యాటకులు తరలిరావడం వెనుక స్థానికులు కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఆపరేటర్లు...ఎత్తుగడలు
మొత్తం అనుమతి లేని బోట్లు 70 వరకు ఉన్నందున వాటిని ఒక్కసారిగా నిలిపివేయడాన్ని జీర్ణించుకోలేని ఆపరేటర్లు ఎలాగైనా నిషేధాన్ని ఎత్తివేయించే ఎత్తుగడలు ఉంటాయని, ప్రభుత్వం కొన్ని గంటల వ్యవధిలోనే తమ నిర్ణయం మార్చుకోవడాన్ని బట్టి చూస్తే వారి ఎత్తుగడలు సఫలీకృతం అయినట్లే చెప్పుకోవచ్చంటున్నారు.
అనుమానాలు...అప్రతిష్ట
ఏదేమైనా ప్రైవేట్ బోట్లను నిలువరించేందుకు ఆర్భాటంగా ప్రకటన చేసి కొద్ది గంటల వ్యవధిలోనే నిర్ణయం వెనక్కి తీసుకున్న తీరు, నిషేధం ఎత్తివేత వెనుక ఏదో జరిగి ఉంటుందనే అనుమానాలు వ్యక్తం అవడం ప్రభుత్వానికి అప్రతిష్ట తెస్తుందనే ఆలోచన అధికారుల్లో ఏమాత్రం లేకపోవడం శోచనీయమని చెప్పొచ్చు.