దేశం మొత్తం పోలవరం వైపే చూస్తోంది: సీఎం చంద్రబాబు
అమరావతి: దేశం మొత్తం పోలవరం ప్రాజెక్టు వైపే చూస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అంతేకాదు అందరి దృష్టి తమ ప్రాజెక్టుల నిర్మాణంపైనే ఉందని చెప్పారు. సోమవారం ఉదయం నీరు-ప్రగతిపై సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
పాపను కాపాడుకోవడానికి ఆ తల్లిదండ్రులు పడే వేదన వర్ణానాతీతం.. మీ సాయం కావాలి
రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణంలో కీలకమైన మైలురాళ్లను అధిగమిస్తున్నామని, పోలవరం డయా ఫ్రం వాల్ నిర్మాణం 414 రోజుల్లోనే పూర్తిచేయడం ఒక చరిత్ర అని చంద్రబాబు చెప్పుకొచ్చారు. 24 గంటల్లో 11,158 క్యూ.మీ. కాంక్రీట్ వేయడం మరో రికార్డు అన్నారు. 42 గంటల్లో 19,500 క్యూ.మీ కాంక్రీట్ వేసి మరో రికార్డు అధిగమించాలని సూచించారు. ఇదే స్ఫూర్తితో ఎర్త్ కం రాక్ ఫిల్ డ్యాం పనులు కూడా వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
పోలవరం పూర్తిచేయడం మనందరి సంకల్పమని చంద్రబాబు ఈ సందర్భంగా చెప్పారు. స్మార్ట్ వాటర్ గ్రిడ్ రూపొందించడం మరో లక్ష్యం అన్నారు. కాఫర్ డ్యాం పనులు జెట్ గ్రౌటింగ్ విధానంలో పూర్తి చేస్తున్నామని తెలిపారు. ప్రతి ఊళ్లో ప్రతి ఎకరానికి సాగునీరు ఇవ్వగలగాలని సీఎం అన్నారు. లోటు వర్షపాతంలో కూడా 2.21 మీటర్లు భూగర్భజలం పెరిగిందని చెప్పారు. నీరు-ప్రగతి, నీరు-చెట్టు పనులు సత్ఫలితాలు ఇస్తున్నాయని అన్నారు. వానాకాలంలో 3 మీ., వేసవిలో 8మీ.లోతున భూగర్భజలాలు ఉండాలని అధికారులకు చంద్రబాబు సూచించారు.
ఈ నెలలో నరేగా పనులు మరింత చురుకుగా జరగాలన్నారు. పంట కుంటల తవ్వకం పనులు కూడా ముమ్మరంగా జరగాలని అన్నారు. ఓడీఎఫ్ స్ఫూర్తితో ఓడీఎఫ్ ప్లస్ కూడా విజయవంతం చేయాలని సీఎం పిలుపునిచ్చారు. నిర్మాణంలో ఉన్న 4,500వర్క్ షెడ్లు వెంటనే పూర్తిచేయాలన్నారు. మరో 6వేల వర్క్ షెడ్లకు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ ఇవ్వాలని అధికారులను సీఎం ఆదేశించారు.
రైతులకు అన్నిరకాల ఇన్ పుట్స్ అందజేయాలని...తెగుళ్ల గురించి ముందస్తు అంచనా వేయాలని...ఇస్రో, ఆర్టీజీఎస్ సేవలను వినియోగించుకోవాలని చంద్రబాబు సూచించారు. గోదావరి జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. మెషీన్ కటింగ్ వల్ల తేమ 17%కంటే ఎక్కువ ఉండటం సహజమని, దానిని అడ్డం పెట్టుకుని రైతులకు ధర తగ్గించడం సరికాదన్నారు. వర్షాలకు అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు తెలిపారు. పంచాయతీరాజ్, మున్సిపల్, వైద్యశాఖలు సమన్వయంగా పనిచేయాలన్నారు. చిన్నారులు అందరికీ త్వరలోనే హెల్త్ కార్డులు ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.