భార్యను టెట్ పరీక్ష హాల్లోకి పంపి...గుండెపోటుతో మృతి చెందిన భర్త
చిత్తూరు:విధి ఎప్పుడు ఎవరి జీవితంలో విషాదం నింపుతుందో ఎవరూ చెప్పలేరనడానికి ఈ విషాద ఘటనే ఉదాహరణ...అతడో మెకానిక్...అల్పజీవులు అందరిలాగే అరకొర సంపాదనతో...ఆర్థిక ఇబ్బందులతో సంసారాన్ని భారంగా లాక్కొస్తున్న ఆ యువకుడు...కనీసం తన భార్యనైనా ప్రభుత్వ ఉద్యోగిగా మార్చి కష్టాల నుంచి కాపురాన్ని గట్టెక్కిద్దామని ఆశపడ్డాడు.
అందుకే ఉపాధ్యాయ విద్య పూర్తయిన తన భార్యను టెట్ ఎగ్జామ్ రాయించేందుకని పరీక్షా కేంద్రానికి తీసుకువచ్చాడు. పరీక్ష బాగా రాయాలని ఆల్ ద బెస్ట్ చెప్పి...భార్యను ఎగ్జామ్ హాల్లోకి పంపించాడు. భార్య లోపలికి వెళ్లిన కొద్ది సేపటికే గుండె పోటుకు గురై కుప్పకూలాడు. చుట్టప్రక్కలవారు గమనించి ఆస్పత్రికి తీసుకువెళ్లే ప్రయత్నంలో ఉండగానే మృత్యువు ఒడిలోకి చేరిపోయాడు. భర్త మరణం గురించి తెలిస్తే తట్టుకోలేదని భార్య ఎగ్జామ్ పూర్తయేంతవరకు ఆమెకు ఈ విషయం ఎవరూ తెలియనివ్వలేదు. హృదయం ద్రవించే విషాద ఘటన తాలూకు వివరాలు ఇవి...
రేణిగుంట పోలీసుల కథనం మేరకు...చిత్తూరు జిల్లా గంగాధరనెల్లూరు మండలం నెల్లేపల్లె పంచాయతీ కొండేపల్లెకి చెందిన ప్రభాకర్(33) కు పదేళ్ల క్రితం సరితతో వివాహమైంది. పెళ్లి తరువాతే చదువు పూర్తి చేసిన సరితకు మంగళవారం టెట్ ఆన్లైన్ అర్హత పరీక్ష ఉంది. దీంతో వారు మంగళవారం తెల్లవారుజామున ఇంటి నుంచి ద్విచక్ర వాహనంపై బయల్దేరి చిత్తూరుకు చేరుకున్నారు. అక్కడ బైక్ పార్క్ చేసి బస్సులో తిరుపతికి చేరుకుని అక్కడ నుంచి పరీక్ష కేంద్రం ఉన్న రేణిగుంట మండలం కరకంబాడి సమీపంలోని అన్నమాచార్య ఇంజినీరింగ్ కాలేజ్ వద్దకు చేరుకున్నారు. టెట్ పేపర్-1 పరీక్ష రాసేందుకు ఉదయం 8.30 గంటలకు భార్య సరితను పరీక్షా కేంద్రంలోకి పంపిన ప్రభాకర్ ఆమె తిరిగి వచ్చేంతవరకు కళాశాల ప్రాంగణంలో వేచి చూసేందుకు సిద్దమయ్యాడు.
భార్యను పరీక్షా కేంద్రంలోకి పంపిన గంట వ్యవధిలోనే సుమారు 10 గంటల ప్రాంతంలో ప్రభాకర్ కు గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలాడు. చుట్టుపక్కల వారు గుమిగూడే లోపే చనిపోయాడు. అయితే అందరూ ఆలోచించి భర్త మరణించిన విషయం భార్య సరితకు వెంటనే తెలియచేస్తే తట్టుకోలేదన్న భావనతో ఎవరూ పరీక్ష పూర్తయ్యే వరకు ఆమెకు ఈ విషయాన్ని తెలియనివ్వలేదు. పరీక్ష రాసి మధ్యాహ్నం 12 గంటలకు బయటకు వచ్చిన సరిత అక్కడ విగతజీవిగా పడివున్న భర్తను చూసి ఒక్కసారిగా షాక్కు గురైంది. ఆ తరువాత విషయం తెలిసి..."ఏవండీ పరీక్ష బాగా రాశాను...లేవండి...పదండి...మన ఇంటికెళదాం"...అంటూ గుండెలవిసేలా రోదించడం అక్కడున్న వారందరినీ కంటతడి పెట్టించింది.
అనంతరం స్థానికుల సహకారంతో ప్రభాకర్ మృతదేహాన్ని వారి స్వగ్రామానికి తీసుకెళ్లారు. కాగా మృతుడికి ముగ్గురు పిల్లలు యశ్వంత్(9), హాసిని(7), గోపీకృష్ణ(5) ఉన్నారు. ప్రభాకర్ చిత్తూరులో మెకానిక్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆయన మృతి చెందడంతోవారి కుటుంబం వీధిన పడిందని...ప్రభుత్వం ఆదుకోవాలని మృతుని బంధువులు వేడుకుంటున్నారు.