అమరావతిలో మరోసారి పర్యటించబోతున్న ప్రపంచ బ్యాంకు బృందం
అమరావతి: ప్రపంచ బ్యాంక్ ప్రతినిధుల బృందం అమరావతిలో మరోసారి పర్యటించబోతోంది. సోమవారం నుంచి ఈ నెల 27వ తేదీ వరకు ప్రపంచ బ్యాంకు బృంద సభ్యులు పర్యటించనున్నారు.
ఈ పర్యటనలో రాజధానిలో తాము రుణ సహాయం అందించాలనుకుంటున్న ప్రాధాన్య రహదారులు, వరద నియంత్రణ ప్రాజెక్టులను ప్రపంచ బ్యాంకు బృంద సభ్యులు పరిశీలించనున్నారు. ఆ తరువాత సిఆర్డీయే అధికారులతో సమావేశం అవుతారు. అమరావతి ప్రాజెక్టులకు రూ.3400 కోట్ల రుణం కావాలని రాష్ట్ర ప్రభుత్వం, సీఆర్డీయే అధికారులు ప్రపంచ బ్యాంకును మూడేళ్ల క్రితం కోరారు.
ఆ క్రమంలో ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు పలుమార్లు అమరావతికి వచ్చి మాట్లాడి వెళ్లారు, ఆ తరువాత సీఆర్డీయే అధికారులు సైతం అమెరికా వెళ్లి వరల్డ్ బ్యాంకు అధికారులతో చర్చలు జరిపారు. ఇక రుణం విడుదలే తరువాయి అనుకుంటున్న తరుణంలో రాజధానిలో నిబంధనల ఉల్లంఘనలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ కొందరు వరల్డ్ బ్యాంకుకు ఫిర్యాదు చేశారు. దీంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది.
ఈ నేపథ్యంలో ప్రపంచ బ్యాంకు బృంతం తాజా పర్యటన రుణ మంజూరులో అత్యంత కీలకం కానుందని తెలిసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా వరల్డ్ బ్యాంకు అధికారులకు తాము రుణం మంజూరు కోరిన కారణాలపై సమగ్ర సమాచారం అందించేందుకు పటిష్టమైన ఏర్పాట్లు చేసినట్లు తెలిసింది. రెండు నెలల క్రితం మే నెలలో ప్రపంచ బ్యాంక్కు చెందిన 11 మంది ప్రతినిధులు అమరావతి నగరంలోని వివిధ ప్రదేశాల్లో పర్యటించి, అక్కడ జరుగుతున్న పనులతోపాటు ఇతర అంశాలు కొన్నింటిని కూడా పరిశీలించారు.