మండలి రద్దు తీర్మానం ఆమోదం.. వైసీపీ అనుకున్నదే చేసింది
ఏపీలోని వైసీపీ సర్కార్ అనుకున్నదే చేసింది. శాసన మండలి రద్దు చేస్తుందని భావించిన విధంగానే రద్దు చేస్తూ తీర్మానం చేసింది. ఒక పక్క ప్రతిపక్ష పార్టీలు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నా, తమ ఆందోళన వ్యక్తం చేస్తున్నా అవేవీ పట్టించుకోకుండా అన్నంత పని చేసి చూపించింది. మండలి రద్దుతో వైసీపీకి కూడా నష్టం అని చెప్పినా వినకుండా తమకు జరిగే నష్టాన్ని లెక్క చెయ్యకుండా మండలి రద్దు తీర్మానం చేసింది.
శాసనసభలో మండలి రద్దు తీర్మానం ఆమోదం
ఆంధ్రప్రదేశ్ శాసనమండలిని రద్దు చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన తీర్మానానికి శాసనసభ మెజార్టీ సభ్యుల నుండి మద్దతు లభించింది .దీంతో ఏపీ శాసనమండలి రద్దు తీర్మానం ఏపీ అసెంబ్లీలో ఆమోదం పొందింది. అసెంబ్లీలో సుదీర్ఘంగా చర్చ జరిగిన అనంతరం దీనిపై ఓటింగ్ నిర్వహించారు . 133 మంది ఎమ్మెల్యేలు మండలి రద్దుకు అనుకూలంగా ఓటు వేశారని స్పీకర్ వెల్లడించారు. తీర్మానం ఆమోదం పొందిందని సభాపతి తెలిపారు. అనంతరం సభ నిరవదికంగా వాయిదా పడింది.
వైసీపీ సర్కార్ కు మండలిలో షాక్ ఇచ్చిన టీడీపీ
ఏపీలో తాజాగా మూడు రాజధానులను ఏర్పాటు చెయ్యాలని అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును , సీఆర్డీఏ రద్దు బిల్లును శాసనసభలో ఆమోదించి శాసనమండలి ఆమోదం కోసం పంపింది వైసీపీ సర్కార్ అయితే శాసనమండలిలో టీడీపీ సభ్యులు మెజార్టీ సభ్యులు ఉన్న నేపధ్యంలో వారు బిల్లులు ఆమోదం పొందకుండా శాయశక్తులా ప్రయత్నించి బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపాలని నిర్ణయించి వైసీపీ సర్కార్ కు ఝలక్ ఇచ్చారు.
మండలినే రద్దు చేసి పంతం నెగ్గించుకున్న వైసీపీ
ఇది జీర్ణించుకోలేకపోయిన సీఎం జగన్ మోహన్ రెడ్డి మెజార్టీ శాసన సభ్యులు ఆమోదించి తీర్మానం చేసి పంపిన బిల్లులను ఆమోదం పొందకుండా చేసిన మండలి అవసరమా అంటూ రద్దుకు నిర్ణయం తీసుకున్నారు. అనుకున్నదే తడవుగా నేడు సభలో చర్చ పెట్టి , ఎమ్మెల్సీ ద్వారా ఎన్నికైన మంత్రులను రాజీనామా చేయించి మరీ శాసనమండలిని రద్దు చేశారు. తమకు శాసనమండలి రద్దు చెయ్యటం వల్ల నష్టం జరుగుతుంది. రాజకీయ నిరుద్యోగులు తమ పార్టీలో పెరుగుతారని తెలిసినా సరే మొండిగా వ్యవహరించి మండలి రద్దు చేసింది .