వైసీపి ప్రభుత్వం తప్పటడుగులు వేస్తోంది ! ఏపిలో తర్వాత అదికారం బీజేపిదే అంటున్న రాంమాధవ్ !!
అమరావతి/హైదరాబాద్ : ఏదో చేస్తాడని అధికారం కట్టబెడితే ఇప్పుడు ఏమీ చేయలేకపోతున్నాడంటూ జగన్ పాలనపై బీజేపి విమర్శలు గుప్పిస్తోంది. ప్రజాదర్బార్ కూల్చివేత నిర్ణయం సంగతి ఎలా ఉన్నా.. పరిపాలన విషయంలో వైఎస్ అడుగుజాడల్లో నడుస్తాడని భావించి సామాన్యులకు జగన్ మనసులో ఏముందనేది అర్దంగాకుండా ఉందని ఏపి బీజేపి మండిపడుతోంది. ఆశా వర్కర్ల జీతాలు పెంచినా ఇంతవరకూ ఖాతాలో పడలేదని, పోలవరం, అమరావతి నిర్మాణాలు రెండు నెలలుగా అక్కడే నిలిచిపోయాయని ఆరోపిస్తోంది భారతీయ జనతా పార్టీ. వెయ్యిరూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ అంటూ ఊదరకొట్టిన జగన్ హామీ ఇప్పటికీ పట్టాలెక్కలేదని, సీఎం రిలీఫ్ ఫండ్ నిలిచిపోయిందని, కొత్తగా ఇసుక కుంభకోణాలకు వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు తెరలేపారని ఆరోపిస్తున్నారు బీజేపి నేతలు.
అంతే కాకుండా రాష్ట్రంలో కొత్తగా వచ్చిన వైసీపి ప్రభుత్వం కూడా తప్పటడుగులు వేస్తోందని భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ విమర్శించారు. తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేట మండలం పుల్లేటికుర్రులో నిర్వహించిన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జాతీయ పార్టీ బీజేపితోనే ఏపీకి న్యాయం జరుగుతుందన్నారు. గత ఐదేళ్లలో ఓ ప్రాంతీయ పార్టీ వలన రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని ప్రజలు చూశారని.. అందుకే మరో ప్రాంతీయ పార్టీకి అవకాశమిచ్చారన్నారు. ఈ ప్రభుత్వం వల్ల మేలు జరగకపోగా కీడే ఎక్కువగా జరుగుతోందనే భయం కలుగుతోందని ఆయన ఆరోపించారు. బీజేపిలో సభ్యత్వం దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం అని రాంమాధవ్ వ్యాఖ్యానించారు. 2024 నాటికి ఏపీలో బీజేపి అతిపెద్ద పార్టీగా అవతరించబోతుందని ఆయన జోస్యం చెప్పారు. గ్రామగ్రామాన బీజేపీని పటిష్ఠం చేయాలని, సభ్యత్వ నమోదును దీనికి సాధనంగా ఉపయోగించుకోవాలని కార్యకర్తలకు రాంమాధవ్ సూచించారు.