ఐఏయస్ అధికారి ఇంట్లో భారీ చోరీ: 85 లక్షలు..ఆభరణాలు మాయం : అంతా రహస్యంగా...!
ఆయన ఓ సీనియర్ ఐఏయస్ అధికారి. ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇచ్చే అధికారుల్లో ఒకరు. కీలకమైన శాఖలో ముఖ్యకార్యదర్శిగా పని చేస్తున్నారు. ఆయన నివాసంలో చోరీ జరిగింది. ఆయన ఇంట్లో పెద్ద ఎత్తున నగదు.. ఆభరణాలు చోరీకి గురైనట్లు తెలుస్తోంది. అయితే, ఈ విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నారు. రహస్యంగానే విచారణ సాగిస్తున్నారు. ఇంత పెద్ద మొత్తంలో నగదు రూపంలో ఎలా ఉంది..లెక్కలు ఏంటనే చర్చ మొదలవుతుందనే భయం తో ఆయన కొందరు ముఖ్యుల ద్వారా వ్యవహారం నడుపుతున్నారు..
పెద్ద ఎత్తున 85 లక్షలు..ఆభరణాలు మాయం..
రాష్ట్ర ప్రభుత్వ నీటి పారుదల శాఖా ముఖ్యకార్యదర్వి శశిభూషన్ నివాసంలో చోరి జరిగింది. దాదాపుగా 85 లక్షల నగదు ..పెద్ద ఎత్తున అభరణాలు మాయం అయినట్లు సమాచారం. విజవాడలోని సూర్యారావు పేటలో ఆయన నివాసం ఉంటున్నారు. ఇంత భారీ స్థాయిలో నగదు..ఆభరణాలు పోతే ఆ అధికారి మాత్రం ఓపెన్గా కేసు పెట్టటానికి నిరాకరించినట్లె సమాచారం. ఇంత పెద్ద మొత్తంలో నగదు పోయిందని చెబితే..అసలు అంత నగదు ఎక్కడి నుండి వచ్చిందనే దానికి సమాధానం..లెక్కులు చెప్పాల్సి ఉంటుందనే కారణంతో మన్నకుండి పోయారు. అదే సమయంలో దాదాపు 25 లక్షల విలువైన ఆభరణాలు సైతం మాయం అయ్యాయి. వీటిని అధికారి బయటకు చెప్పలేక పోతున్నారు. ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
అంతా రహస్యంగా..
శశి భూషన్ నివాసంలో చోరి జరిగిన తరువాత కొందరు ముఖ్యుల సహకారంతో పోలీసులకు ఫిర్యాదు చేసారు. విషయం బయటకు పొక్కకుండా అధికారులు విచారణ చేస్తున్నారు. అయితే, ఆయన నివాసంలో ఎంతో కాలంగా పని చేస్తున్న సెక్యూరిటీ గార్డు ఈ చోరీకి పాల్పడినట్లు నిర్ధారణకు వచ్చారు. సెక్యూరిటీ గార్డు బిశ్వాస్ ఎంతో కాలంగా ఆయన వద్ద పని చేస్తున్నాడు. నమ్మకంగా ఉండే వ్యక్తి కావటంతో అధికారి కుటుంబం కూడా కుటుంబ సభ్యుడిగానే చూసుకుంది. అయితే, ఇంట్లో ఎవరూ లేని సమయంలో సెక్యూరిటీ గార్డు ఆ సొమ్ము..ఆభరణాలతో సహా ఉడాయించాడు. పోలీసులు ఈ కేసును టాస్క్ఫోర్స్ కు బదిలీ చేసారు. వారు పశ్చిమ బెంగాల్లో తల దాచుకున్న బిశ్వాస్ను పట్టుకున్నారు.
రికవరీ కొంత సొమ్ముతోనే..
పోలీసులు బిశ్వాస్ను పట్టుకొని ఏపీకీ తీసుకొచ్చారు. అప్పటికే అతడు పెద్ద మొత్తంగా నగదు ఖర్చు చేసినట్లు గుర్తించారు. అయినా..మిగిలిన సొమ్ము రికవరీ చేసీ ఐఏయస్ అధికారికి ఇచ్చారు. వచ్చిన దాంతో సంతృప్తి పడి అధికారి కామ్ అయిపోయారు. అయితే, ఈ వ్యవహారం అంతా ఇంత గోప్యంగా ఉంచాల్సిన పరిస్థితికి కారణం..ఆ నగదు మొత్తానికి అధికారిక లెక్కలు లేకపోవటమే అనే ప్రచారం జరుగుతోంది.