తాళం వేసిన ఇంటిపై కన్ను పడితే చాలు, ఘరాన దొంగ ఇతనే
విశాఖపట్నం: తాళం వేసిన ఇళ్లు అతని కంటిపడితే చాలు, ఇది రాత్రికి గుల్ల కావాల్సిందే. 28 ఏళ్ల సతీష్ అనే ఘరానా దొంగను విశాఖపట్నం పోలీసులు పట్టుకున్నారు. విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, కృష్ణా జిల్లాల్లో ఇతనిపై కేసులున్నాయి. క్రైం డిసిపి సతీష్ వివరాలను గురువారంనాడు మీడియా సమావేశంలో వెల్లడించారు
పెదగంట్యాడ మండలం బాపూజీ కాలనీకి చెందిన కర్రి సతీష్ అలియాస్ కర్రి సత్తిబాబు అలియాస్ బుజ్జి అలియాస్ స్ఠీఫెన్ చేయి తిరిగిన దొంగ. నిరుడు పరువాడ మండలం బందరుపాలెంలో బండారు నరసింగరావు ఇంట్లో రెండున్నర తులాల బంగారు పుస్తెలతాడు చోరీకి గురైంది.
కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పరవాడ పోలీసులు గురువారం ఉదయం లంకెలపాలెం జంక్షన్లో అనుమానాస్పదంగా తిరుగుతును్న సతీష్ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతన్ని పాత నేరస్థుడిగా గుర్తించారు. అతని నుంచి 230 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
నిందితుడు సతీష్పై విశాఖపట్నం త్రీటౌన్ పోలీసు స్టేషన్లో 9, టూటౌన్లో 2, భిమిలీలో 1, అనకాపల్లిలో 1, గాజువాకలో 7, పరువాడలో 1, విజయనగరం వన్ టౌన్లో 1, కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్లో 1, విజయవాడ త్రీటౌన్లో 5 కేసులు నమోదయ్యాయి. నిరుడు కాకినాడ జైలు నుంచి విడుదలై అదే రోజు రాత్రి విజయవాడ హనుమాన్ జంక్షన్లో దొంగతనానికి పాల్పడి 15 తులాల బంగారు ఆభరణాలను దొచుకుని హైదరాబాద్ వెళ్లిపోయాడు.
సతీష్ బెంగళూర్, హైదరాబాద్ తదితర ప్రదేశాలు తిరుగుతూ ఎపి పోలీసులకు దొరక్కుండా తప్పించుకుంటున్నాడు. దోచుకున్న సొత్తును రికవరీ చేయాల్సి ఉందని డిసిపి చెప్పారు.