చేసేది సోషల్ వర్కర్ పని...చేయించేది వ్యభిచారం:9 మంది అరెస్ట్;వదినతో అక్రమ సంబంధం...హత్య
విజయవాడ:అడ్డదారిలో డబ్బు సంపాదనకు ఎంతటి నీచానికైనా ఒడిగట్టే స్థితికి చేరుతున్నారు కొందరు వ్యక్తులు. ఇదే కోవలో సోషల్ వర్కర్ల ముసుగులో వ్యభిచారం చేయిస్తున్నవారి ఆట కట్టించారు విజయవాడ పోలీసులు. వివరాల్లోకి వెళితే...
విజయవాడ పటమటలోని దానయ్య బజారులో నివసిస్తున్న ఇద్దరు మహిళలు డాక్టర్ సమరం హాస్పటల్లో హెచ్ఐవీ వ్యాధిగ్రస్థులకు కౌన్సెలింగ్ ఇస్తుంటారు. ఈ క్రమంలో వారు అక్కడికి వచ్చే మహిళలకు మాయమాటలు చెప్పి వ్యభిచారం చేయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. దానయ్య బజారులో వ్యభిచారం జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందగా దానిపై ఆరాతీసిన పోలీసులు అసలు విషయం తెలిసి విస్తుపోయారు.
తమకు అందిన సమాచారం మేరకు సీఐ ఉమామ హేశ్వరరావు సిబ్బందితో దానయ్య బజారులో వ్యభిచారం నిర్వహిస్తున్న గృహంపై సోమవారం అర్ధరాత్రి దాడిచేసి ఆరుగురు మహిళలు, ముగ్గురు యువకులను అరెస్టు చేశారు. వారి నుంచి రూ.13 వేలు నగదు, 12 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో డాక్టర్ సమరం ఆస్పత్రిలో సోషల్ వర్కర్లుగా పనిచేస్తున్న వారే ఇలా ఇల్లు అద్దెకు తీసుకొని వ్యభిచారం దందా నడిపిస్తున్నట్లు తేలింది.
మరోవైపు వదిన వరసయ్యే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం గురిజేపల్లి గ్రామానికి చెందిన నూతలపాటి అంజనీరాజు(25) గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం యడవల్లి సమీపంలో మంగళవారం తెల్లవారుజామున దారుణ హత్యకు గురికాగా...ఈ హత్యకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసుల ప్రధమిక విచారణలో తేలినట్లు సమాచారం.
చిలకలూరిపేట రూరల్ సీఐ శోభన్బాబు తెలిపిన వివరాల ప్రకారం...గురిజేపల్లికి చెందిన అంజనీరాజు మండలంలోని యడవల్లిలోని క్వారీలో మిషన్ ఆపరేటర్గా పనిచేస్తున్నాడు. ఇతడికి రెండేళ్ల క్రితం వివాహమైంది. భార్యతో కలిసి చిలకలూరిపేటలోని సుభానినగర్లో నివాసం ఉంటూ ప్రతిరోజూ క్వారీలో విధులకు హాజరవుతుంటాడు. ఈ నేపథ్యంలో మంగళవారం అర్థరాత్రి సమయంలో విధులు ముగించుకున్న తర్వాత ద్విచక్ర వాహనంపై చిలకలూరిపేటకు వస్తుండగా యడవల్లి శివారున కొందరు గుర్తు తెలియని దుండగులు అంజనీరాజుపై మారణాయుధాలు, బండరాళ్లతో విచక్షణారహితంగా దాడి చేసి హత్య చేశారు.
ఈ సమాచారం అందుకున్న రూరల్ సీఐ శోభన్బాబు, ఎస్ఐ ఉదయ్బాబులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అంజనీరాజు గతంలో తనకు అన్నయ్య వరుసయ్యే వ్యక్తి భార్యతో అక్రమ సంబంధం నెరిపినట్లు పోలీసుల విచారణలో తెలిసింది. ఈ విషయంలో గతంలో బంధువుల మధ్య గొడవలు కూడా జరిగాయి. పెద్దలు సర్దిచెప్పినా వినకుండా ఇంకా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న నేపథ్యంలో ఈ హత్య జరిగి ఉండొచ్చని అంజనీరాజు సోదరుడు నూతలపాటి హరికృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.