అప్పుడు ఒప్పుకొని...ఇప్పుడు మాట మార్చారు:సోమువీర్రాజు;వైసిపి ఎంపీల నాటకాలు:నక్కా
విజయనగరం:ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించినప్పుడు సీఎం చంద్రబాబు దాన్ని అర్ధరాత్రి అంగీకరించి...ఇప్పుడు మాటమార్చారని బీజేపీ ఎమ్మెల్సీ సోమువీర్రాజు ధ్వజమెత్తారు.
బుధవారం ఆయన విజయనగరంలో మీడియాతో మాట్లాడారు. 2019 ఏప్రిల్ లోనే ఎన్నికలు రావాలని బీజేపీ కోరుకుంటోందని సోమూ వీర్రాజు చెప్పారు. 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో ఒంటరిగానే 175 స్థానాల్లో పోటీ చేస్తామని ఆయన తేల్చి చెప్పేశారు. రాష్ట్రంలో ప్రత్యేక రైల్వేజోన్ ఏర్పాటు చేస్తామని...తమ నిజాయితీని శంకించొద్దని సోమువీర్రాజు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
కేంద్రం ప్రవేశపెట్టిన సరళీకృత వాణిజ్య విధానాల వల్లే ఏపికి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మొదటిస్థానం వచ్చిందని ఆయన అన్నారు. భోగాపురం ఎయిర్పోర్టుకు అడ్డుపుల్ల వేస్తోంది చంద్రబాబే అని ఆయన ఆరోపించారు. కేంద్రం నిధులతోనే తోటపల్లి ప్రాజెక్ట్ను పూర్తి చేశారని సోమువీర్రాజు చెప్పారు.
చలసాని శ్రీనివాస్, శివాజిలతో హోదాపై సిఎం వెనుకనే ఉండి మాట్లాడిస్తున్నారని ఆయన ఆరోపించారు. జిల్లాకు ట్రైబల్ యూనివర్సిటి, నేషనల్ హైవే ,డిఫెన్స్ ప్రోజెక్ట్ లు కేటాయించామన్నారు. పచ్చ గడ్డి కొనుగొలు దగ్గర నుంచి ప్రతీది రాష్ట్రంలో అవినీతిమయమైందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు డవలప్మెంట్ మానేసి డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు. మోడీ ఏం చేశారో మున్సిపాలిటీల్లో, గ్రామాల్లో తిరిగితే తెలిసిపోతుందన్నారు.
నితిన్ గడ్కరీ నాలుగు లక్షల కోట్ల రూపాయల నిధులు ఇచ్చామన్నారని చెప్పారు. కాని...పచ్చిగడ్డి, మట్టి కూడా మేసేస్తున్నారని మండిపడ్డారు. రూ.13 వేల కోట్లు మట్టి తవ్వకాలు ఎన్ఆర్ఈజిఎస్ ద్వారా చేపట్టారని, ఆ మట్టిని ముప్ఫై వేల కోట్ల రూపాయలకు అమ్ముకున్నారని తెలిపారు. పదమూడు వేలు బాత్రూమ్ నిర్మాణం కోసం ఇస్తే.. అందులో రెండు వేల రూపాయలు టిడిపి లీడర్ల అకౌంట్ లోకి పోతున్నాయని చెప్పారు. బిజెపి ఆంధ్రప్రదేశ్లో పాండవులు... మిగిలిన వారంతా కౌరవులేనని చెప్పారు. తాము దేశం కోసం పనిచేస్తున్నామన్నారు.
మరోవైపు గుంటూరులో మంత్రి నక్కా ఆనందబాబు ట్రైకార్ పథకం ఎస్సీ లబ్దిదారులకు ఇన్నోవా కార్లను అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ.32 కోట్లతో 150 ఇన్నోవా, 50 బోలెరో వాహనాలు అందజేశామని ఈ సందర్భంగా మంత్రి నక్క ఆనందబాబు చెప్పారు. దళిత, గిరిజన డ్రైవర్లను ఓనర్లు చేసిన ఘనత చంద్రబాబుదే మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ పై మండిపడ్డారు. వైకాపా ఎంపీల రాజీనామాల నాటకాలు ఈరోజు పార్లమెంటు సమావేశాల్లో బట్టబయలు అవుతాయని మంత్రి నక్కా ఆనందబాబు చెప్పారు. మోడీకి భయపడి పార్లమెంట్ మెట్లు ఎక్కడానికి కూడా వైసీపీ ఎంపీలు భయపడుతున్నారని నక్కా ఆనందబాబు విమర్శించారు. టిడిపి ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా అన్ని రాజకీయ పార్టీలు ముందుకు వస్తున్నాయని తెలిపారు.