అప్పుడు తీవ్ర వ్యాఖ్యలు .. ఇప్పుడు మా వాడు జగన్ అంటూ పొగడ్తలు .. జేసీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
జేసీ దివాకర్ రెడ్డి ... అనంతపురం జిల్లాలో కీలక రాజకీయ నేతగా ఉన్న ఆయన ఎన్నికలకు ముందు జగన్ గురించి చాలా ఘాటు వ్యాఖ్యలు చేశారు. అనంతపురం జిల్లా ధర్మపోరాట దీక్షలో వైఎస్ జగన్ కు కులపిచ్చి ఉందంటూ ఆరోపణలు గుప్పించిన ఆయన ఇప్పుడు జగన్ సీఎం కావటంతో జగన్ మా వాడు .. సీఎం అయ్యాడు అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నాడు .ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిపై చేసిన టీడీపీ నేత అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు ఆసక్తికర చర్చ జరుగుతుంది.
జగన్ మావాడే అంటూ జగన్ ను పొగుడుతున్న టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి
రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే.. అప్పుడే తిట్టి అంతలోకే పొగడటం , వ్యక్తిగత దూషణలకు దిగి కూడా అవసరం అనుకుంటే ఆలింగనం చేసుకోవటం రాజకీయాల్లో మామూలే. ఎన్నికల సమయంలో జగన్ పై విరుచుకుపడిన జేసీ దివాకర్ రెడ్డి ఇప్పుడు జగన్ సీఎం కావటంతో మాట మార్చాడు. జగన్ మావాడే .. అధికారంలోకి వచ్చాడు అంటూ చెప్పుకొచ్చారు.ముఖ్యమంత్రి అయ్యాడు కంగ్రాట్యులేషన్స్ టు హిమ్ అంటూ చెప్పుకొచ్చారు. వైయస్ జగన్ నిజాయితీని తాను అభినందిస్తున్నట్లు తెలిపారు. ప్రత్యేక హోదా విషయంలో వైయస్ జగన్ మెుదటి నుంచి నిజాయితీగా ఉన్నాడని తెలిపారు.
జగన్ కచ్చితంగా ప్రత్యేక హోదా సాధిస్తాడు అంటూ కితాబిచ్చిన జేసీ
ఓ ఛానల్ లో మాట్లాడిన జేసీ దివాకర్ రెడ్డి తాను ఇకపై రాజకీయాలకు దూరంగా ఉంటానని స్పష్టం చేశారు. జగన్ మీద పొగడ్తల వర్షం కురిపించారు. కచ్చితంగా జగన్ ప్రత్యేక హోదా సాధిస్తాడని స్పష్టం చేశారు. ఢిల్లీలో వైయస్ జగన్ మాట్లాడిన తీరు అద్భుతమని కొనియాడారు. మోదీ మేజిక్ ఫిగర్ కంటే విజయం సాధించడం మన ఖర్మ అంటూ జగన్ అనడాన్ని ఆయన అభినందించారు. కేంద్రంలో బీజేపీ అత్యధిక మెజారిటీతో అధికారంలోకి రావడంతో తాను నమస్కారం పెట్టడం తప్ప చెయ్యగలిగేది ఏమీ లేదని జగన్ చెప్పడం మంచి పరిణామమన్నారు. అది వాస్తవం కూడా అని చెప్పుకొచ్చారు. ఎన్డీఏలో తాము ఉన్నప్పుడే మోదీని ప్రత్యేక హోదా కోసం నిలదీస్తే అప్పుడే వినలేదని ఇప్పుడు సిగపట్లు, మెడపట్లకు వెళ్తే సరికాదని అందులో జగన్ తీసుకున్న నిర్ణయం అభినందనీయం అని కొనియాడారు.
ఎన్నికలకు ముందు జగన్ కు కులపిచ్చి అని తీవ్ర ఆరోపణలు .. తాజాగా జగన్ మా వాడు అంటూ మాట మార్చిన జేసీ దివాకర్ రెడ్డి
ఎన్నికలకు ముందు కుల రాజకీయాలు చేస్తున్నారంటూ జగన్ పై ఫైర్ అయిన జేసీ జగన్ కు కుల పిచ్చి అని తీవ్ర ఆరోపణలు చేశారు.అంతే కాదు కుల ప్రాతిపదికన ఓట్లు అడుగుతున్నారని ఫైర్ అయ్యారు .ప్రజల ఆదరణ ఉంటే సీఎం అవుతారు తప్ప కులాభిమానంతో కాదని అప్పుడు జగన్ పై జేసీ మండిపడ్డారు . నీ సత్తా ఏంది..? నీ ముఖానికి ఏం విలువ ఉంది..? రెడ్లు అయితే కొమ్ములు ఉంటాయా..? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక ఇప్పుడు జగన్ మా వాడు అనటం , జగన్ నిజాయితీపరుడు అని వ్యాఖ్యానించటం ఏపీ రాజకీయాల్లో చర్చకు దారి తీస్తుంది.