అప్పుడు జన్మభూమి కమిటీలు.. ఇప్పుడు గ్రామ వాలంటీర్లు .. సర్కార్ మారినా అదే సంత
Recommended Video
వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి గ్రామ వాలంటీర్లను నియమించి ప్రజలకు మెరుగైన సేవ చేయటానికి సంకల్పించారు . ప్రజలకు గవర్నమెంట్ ఆఫీస్ లు చుట్టూ తిరిగే పని లేకుండా చేయటానికి ఆయన ప్రతి గ్రామంలోనూ 50 మందికి ఒక గ్రామ వాలంటీర్ ను నియమించాలని నిర్ణయం తీసుకున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా ఇదే తరహా నిర్ణయం తీసుకుని జన్మభూమి కమిటీలను ఏర్పాటు చేసింది . ఇప్పుడు జగన్ నియమించనున్న గ్రామ వాలంటీర్ల వ్యవస్థ కూడా జన్మ భూమి కమిటీల లాంటిదే అని విమర్శలు వినిపిస్తున్నాయి.
ఏపీలో ఇసుక తిప్పలు .. 10 కిలోమీటర్ల మేర ట్రాక్టర్ల బారులు
టీడీపీ హయాంలో జన్మభూమి కమిటీలు .. టీడీపీ ఓటమికి జన్మభూమి కమిటీల అవినీతి ఒక కారణం
టీడీపీ హయాంలో ఏర్పాటు చేసిన జన్మభూమి కమిటీలలో భాగంగా ప్రతి ఊరికి ఒక కమిటీ ఉండేది, ప్రభుత్వ పథకాలకు సంబంధించిన అన్ని విషయాలు వాళ్లే చూసుకునేవాళ్ళు , ఈ క్రమంలో ప్రజా సేవ పక్కన పెట్టి , జన్మభూమి కమిటీల దోపిడీ ఎక్కువయ్యింది. ప్రతి చిన్న పనికి లంచం ఇవ్వాల్సిందే. లేకుంటే పని చెయ్యని పరిస్థితి . అది ఏ స్థాయికి వెళ్లిందంటే మొన్న ఎన్నికల్లో టీడీపీ ఘోరపరాజయానికి జన్మభూమి కమిటీలు కూడా కారణం అనే టాక్ వినిపించింది. ఇక ఈ విషయాన్నిస్వయంగా జయప్రకాశ్ నారాయణ వంటి ప్రముఖులు చెప్పారంటే జన్మభూమి కమిటీల పని తీరు మనం అర్ధం చేసుకోవచ్చు.
గ్రామ వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు చెయ్యనున్న జగన్ సర్కార్ .. వైసీపీ వాళ్ళకే ఇస్తున్నారని ఆరోపణలు
ఇప్పుడు జగన్ ప్రభుత్వం అదే ఆలోచనతో ప్రభుత్వ పధకాలు ప్రజల దగ్గరకి నేరుగా చేరాలనే గ్రామ వాలంటీర్ల వ్యవస్థను నియమిస్తుంది. ఇందులో మొదటి నుండే పెద్ద ఎత్తున అవినీతి,అక్రమాలు కనిపిస్తున్నాయి. కులం,పార్టీలతో సంబంధం లేకుండా అర్హత కలిగిన వాళ్ళకి వలంటీర్ పోస్ట్ ఇస్తామని చెప్పి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇక అర్హత ఉన్న ప్రతి ఒక్కరు గ్రామాల్లోని నిరుద్యోగులు పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఇక్కడ అర్హత అనే విషయాన్ని పక్కన పెట్టేసి కేవలం వైసీపీ సానుభూతి పరులకే ఇస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి . దీనిపై ఇప్పటికే పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినా కానీ ఎవరు పట్టించుకోవటం లేదు. వైసీపీ నేతలు మాత్రం తమవారికి గ్రామ వాలంటీర్ల గా అవకాశం ఇస్తున్నారు అని ప్రచారం జరుగుతుంది .
ఆదిలోనే హంసపాదు అన్నట్టు ఉన్న గ్రామ వాలంటీర్ల నియామకం .. ప్రభుత్వాలు మారినా కంపు అదే
ఇక గ్రామ వాలంటీర్ పోస్టులు కోసం ఎమ్మెల్యే ఆఫీస్ చుట్టూ పెద్ద ఎత్తున తిరుగుతున్నారు. అందుకు తగ్గట్లే స్థానిక ఎమ్మెల్యే రికమండేషన్ తో పోస్టులు ఇస్తున్నారు. ఇదేమిటని అడిగితే రాకరాక అవకాశం వస్తుంది కాబట్టి పార్టీలోని వాళ్ళకి న్యాయం చేయాలికదా అని పార్టీలోని ముఖ్యనేతలు అంటున్నారని సమాచారం . నెలకి ఐదువేలు మాత్రమే ఇస్తున్నారు, వాటిని పక్కవాళ్ళకి ఎందుకు ఇవ్వాలంటూ మాట్లాడుతున్న నేతలు తమ పార్టీ కోసం పని చేసిన వారికి ఏరి కోరి అవకాశం ఇస్తున్నారని సమాచారం. ఇక దీనిపై దరఖాస్తులు చేసిన మిగిలిన అభ్యర్థులు మాట్లాడుతూ తమ పార్టీ వాళ్ళకే ఇచ్చేటట్లైతే డైరెక్ట్ గా ఇచ్చుకోవచ్చు కదా .. ఆలా కాకుండా నోటిఫికేషన్ ఇవ్వటం, ఇంత మంది నిరుద్యోగులను ఇబ్బంది పెట్టటం ఎందుకంటూ విమర్శలు గుప్పిస్తున్నారు . గ్రామ వాలంటీర్ వ్యవస్థ ఆదిలోనే హంసపాదు అన్నట్లు తయారు కావటంతో అప్పట్లో జన్మ భూమి కమిటీలు, ఇప్పుడు గ్రామ వాలంటీర్ వ్యవస్థ రెండూ ఒకటే అని .. ప్రభుత్వాలు మారినా ఈ సంత మాత్రం మారలేదని నిట్టూర్పు విడుస్తున్నారు ఏపీ ప్రజలు .