అప్పుడు ముద్దుల వర్షం కురిపించారు.!ఇప్పుడు తుపాను వచ్చినా తొంగి చూడలేదు.!సీఎంపై జనసేన ఫైర్.!
హైదరాబాద్ : అకాల వర్షాలకు జిల్లాల్లోని ప్రజల కష్టాలు వర్ణనాతీతమని, సర్వం కోల్పోయిన ప్రజలు సహాయం కోసం చేస్తున్న ఆర్తనాదాలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వినిపించడం లేదా అని జనసేన పార్టీ సూటిగా ప్రశ్నిస్తోంది. నాడు ఇంటెనక, ఇంటిముందు, నడి రోడ్ల మీద, సందు చివర్లో, మూల మలుపుల్లో, ఏటిగట్టు దగ్గర, వాగుల్లో, వంకల్లో, ఎండల్లో, వానల్లో, నీళ్లల్లో, బురదలో, తెంపు లేకుండా జనాలకు ముద్దులు పెట్టి, ఇప్పుడు ఆ జనాలకే కష్టాలొస్తే, వరదలతో కకావికలం అవుతుంటే కనీసం తొంగి చూడరా అని జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సీఎం జగన్ మోహన్ రెడ్డిని నిలదీసారు.
వరదలతో జనం కకావికలం.. ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదన్న జనసేన
వరద బాధితుల పరామర్శ కోసం నెల్లూరు జిల్లాకు వచ్చిన జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సీఎం జగన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సందు సందులో తిరిగి జనాలకు ముద్దులు పెట్టిన జగన్ ఒక్క ఛాన్స్ అంటూ అడిగి సీఎం అయ్యారని, ఇప్పుడు ఆయన వరదల్లో చిక్కుకున్న బాదితులకు కనిపించడం లేదని మండిపడ్డారు. వరదలతో కడప జిల్లా అతలాకుతలం అయితే, ముఖ్యమంత్రి తన సొంత జిల్లాలో కూడా పర్యటించలేదని అన్నారు. కేవలం హెలికాప్టర్లో ఏరియల్ సర్వే చేశారని సీఎం వర్క్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్ కి అలవాటు పడ్డారని నాదెండ్ల మనోహర్ ఘాటుగా విమర్శించారు.
కడపలో వందకు వందశాతం మానవ తప్పిదమే.. సకాలంలో గేట్లు ఎత్తకపోడంతో వరదలు..
కడప జిల్లాలో వచ్చిన వరదలకు ప్రకృతి విపత్తు కారణం కాదని, ఇసుక, గ్రానెట్ అక్రమ తవ్వకాలేనని స్పష్టం చేసారు మనోహర్. నెల్లూరు నగరంలో పార్టీ కార్యకర్తలతో సమావేశం అయిన నాదెండ్ల మనోహర్, వరద సహాయ చర్యల్లో జనసైనికుల చొరవను ప్రశంసించారు. అయితే నేతలు, అధికారులు ప్రాజెక్ట్ ల గేట్లు ఎత్తడంలో ఆలస్యం చేయడం వల్లే ఈ ప్రమాదం ఏర్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు మనోహర్. శాసన సభలో కూడా సమయం వృథా చేశారని, అర్థవంతమైన చర్చలు జరగలేదన్నారు నాదెండ్ల మనోహర్. గేట్లు ఎత్తడం ఒక్కరోజు ఆలస్యం చేయడం వల్లే గ్రామాలు కొట్టుకుపోయాయని, ఈ మాత్రం ప్రభుత్వానికి సోయి లేదా అని ప్రశ్నించారు.
సీఎం యువకుడా.? నడి వయస్కుడా. సీఎం పనిలో వేగం లేదన్న జనసేన
యువకుడైన ముఖ్యమంత్రి ఎంతో హుషారుగా పనిచేయాల్సిన తరుణంలో ఏపీ సీఎం జగన్ మాత్రం వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ కి అలవాటు పడ్డారని విమర్శించారు. వరదల సమయంలో ప్రభుత్వం కంటే సామాన్య ప్రజలే ఎక్కువగా ఇతరులను ఆదుకున్నారని చెప్పారు. నెల్లూరు జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు నాదెండ్ల మనోహర్. చిన్న చిన్న మనస్పర్థలు పక్కనపెట్టండని పార్టీ నేతలకు, కార్యకర్తలకు హితవు పలికారు.
వరద బాదితులకు సాయం చేయండి.. జనసైనికులకు నాదెండ్ల మనోహర్ పిలుపు
అందరు నాయకులు ఒకేమాటపై నిలబడాలని, పదవులతోపాటు పార్టీ కోసం పనిచేయాలన్నారు దిశానిర్దేశం చేసారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన నాదెండ్ల మనోహర్, బాధితులకు నిత్యావసర సరుకులు అందిస్తూ భరోసా ఇచ్చారు మరోవైపు అమరావతి రైతుల పాదయాత్రలో కూడా జనసైనికులు కలసి నడిచారు. నెల్లూరులో రైతులతో కలసి యాత్రగా ముందుకు సాగారు. అమరావతే ఏకైక రాజధానిగా ఉండాలనేది జనసేన అభిప్రాయమని, మొదటి నుంచి తమది అదే ఆలోచన అన్నారు. రైతులకు జనసేన పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.