ఏపీలో దొంగ వ్యాపారం చేసేవారు లేరు...ఐటీ అధికారులకు స్వాగతం చెప్పి వివరిస్తాం:సిఎం చంద్రబాబు
అమరావతి:కేంద్ర ప్రభుత్వం వ్యవస్థలన్నింటినీ దుర్వినియోగం చేస్తోందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. గురువారం ఆయన కలెక్టర్ల సదస్సులో మాట్లాడుతూ కేంద్రం తీరుని దుయ్యబట్టారు.
రాష్ట్రంలో భయాలను సృష్టించేలా ఐటీ దాడులు చేయిస్తున్నారని...రోజు విడిచి రోజు ఐటీ దాడులు చేస్తున్నారని సిఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో దొంగ వ్యాపారం చేసేవారు ఎవరూ లేరని...ఐటీ అధికారులకు స్వాగతం చెప్పి ఇక్కడ ఏం జరుగుతుందో వివరంగా చెబుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు.
సిబిఐని...భ్రష్టు పట్టించిన కేంద్రం
రాజకీయ ప్రయోజనాల కోసమే కేంద్రం సీబీఐని భ్రష్టుపట్టించిందన్నారు. నిబంధనల్ని కాలరాసి మోడీ అర్ధరాత్రి నిర్ణయాలు తీసుకున్నారని చంద్రబాబు విమర్శించారు. తప్పులు బయటపడతాయనే భయంతోనే ప్రధాని మోడీ సీబీఐ డైరెక్టర్ను మార్చారని...ఆ రకంగా సీబీఐపై విశ్వాసాన్ని కోల్పోయే పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని సిఎం చంద్రబాబు ధ్వజమెత్తారు. సీబీఐలో జరుగుతున్న పరిణామాలు మంచిది కాదని ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయపడ్డారు.
నిధులు ఇచ్చి...వెనక్కి తీసుకున్నారు
ఆంధ్రప్రదేశ్ లో వెనుకబడిన జిల్లాలకు కేంద్రం నిధులు ఇచ్చినట్లు ఇచ్చి మరీ వెనక్కు తీసుకుందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో ఎన్నికలు ఉన్నందున ఆ రాష్ట్రానికి నిధులు ఇచ్చిందని ఆరోపించారు.
హోదా ఇవ్వలేదు... ప్యాకేజీ కూడా లేదు
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేదని...చివరకు ప్రత్యేక ప్యాకేజీ కూడా ఇవ్వలేదన్నారు. పైగా ఇచ్చిన నిధులు వెనక్కి తీసుకున్నారని, పోలవరానికి...అమరావతి నిర్మాణానికి నిధులు కూడా ఇవ్వలేదని చంద్రబాబు విమర్శించారు.
ధైర్యంగా...ముందుకు వెళుతున్నాం
స్మార్ట్ సిటీల వల్ల రాష్ట్రానికంటే కేంద్రానికే ఎక్కువ ఆదాయం వస్తుందని, కేంద్రం పట్టణాల అభివృద్ధికి నిధులు అరకొరగానే ఇస్తోందని చంద్రబాబు విమర్శించారు. ఎన్ని కష్టాలు ఎదురైనా ధైర్యంగా ముందుకు పోతున్నామని చంద్రబాబు చెప్పుకొచ్చారు.