మళ్లీ జనంలోకి జనసేనాని...ఒక్కరోజులో ఏడు మీటింగ్ లు:అదీ పవన్ కళ్యాణ్ స్పీడ్!
పశ్చిమ గోదావరి:జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మళ్లీ జనంలోకి వచ్చేశారు. ఇటీవలి వరకు సాగించిన ప్రజా పోరాట యాత్రకు కొంత కాలం విరామం ఇచ్చిన ఆయన మళ్లీ మలి విడత పర్యటనలకు సంసిద్దం అయ్యారు.
పశ్చిమ గోదావరి జిల్లాలో తన ప్రజా పోరాట యాత్రను కొనసాగించేందుకు ఏలూరుకు చేరుకున్న ఆయన మంగళవారం వివిధ సంఘాలతో సమావేశమయ్యారు. పదిరోజులపాటు ఆయన ఇక్కడే మకాం వేయనున్న పవన్ మంగళవారం ఒక్కరోజే ఏడు సంఘాల ప్రతినిథులతో సమావేశమయ్యారు. ఇలా రోజువారీ ఈ భేటీలు కొనసాగిస్తూనే నిర్దేశించిన నియోజకవర్గాల్లో బహిరంగ సభలకు హాజరుకావాలని ఆయన నిర్ణయించారు.
సోమవారమే ఏలూరుకు చేరుకున్న పవన్ కళ్యాణ్ వందలాది మంది అభిమానులు, కార్యకర్తలు వెంట రాగా స్థానిక క్రాంతి కల్యాణ మండపానికి చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ పది రోజులు ఆయన ఇక్కడే బస చేస్తారని తెలిసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ "పార్టీ సిద్ధాంతాలను గ్రామాలకు చేర్చండి...అందరికీ తెలిసేలా వివరించాలి. క్షేత్ర స్థాయిలో మరింతగా బలపడాలి...అభిమానులు, జన సైనికుల మీద నాకు పూర్తి నమ్మకం, విశ్వాసం ఉంది" అని అన్నారు.
పవన్ కళ్యాణ్ అంతకుముందు ప్రజాపోరాట యాత్రలో భీమవరం కేంద్రంగా చేసుకుని, పార్టీ వ్యవహారాలను, భేటీలను ఎలా కొనసాగించగా...ఇప్పుడ ఈ విడతలోనూ అదే తరహాలో యాత్ర కొనసాగించబోతున్నారని తెలిసింది. అయితే ఈసారి తన సమావేశాలు, భేటీల సంఖ్య పెంచాలని...వీలైనంత ఎక్కువమందితో కలవాలని పవన్ కళ్యాణ్ సంకల్పించినట్లు తెలిసింది. ఆ క్రమంలోనే ఆయన మంగళవారం ఒక్కరోజే ఆయన ఏడు వర్గాలతో విడివిడిగా భేటీ అయ్యారు. ఆటోడ్రైవర్స్ అసోసియేషన్, డ్రైవర్ల అసోసియేషన్, పాస్టర్ల బృందం, ఆలిండియా దళిత రైట్ ఫెడరేషన్ సభ్యులతో హమాలీలు, రెల్లి సంక్షేమ సంఘం, శారీరక వికలాంగులు, రైతులతో పవన్ సమావేశం అయ్యారు.
ఈ క్రమంలో వికలాంగులతో సమావేశం అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఎన్నికల్లో వికలాంగులకు అవకాశం కల్పించాలని అన్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా దివ్యాంగుల పరిస్థితిలో మాత్రం ఏ మార్పు లేదన్నారు. అలాగే ఎన్ని అసెంబ్లీ సమావేశాలు జరిగినా దివ్యాంగులకు సంక్షేమపై చర్చలులేవు... చర్యలు లేవన్నారు.