టీడీపీ నేతల హత్యలకు టీమ్స్.. రోజులు లెక్కపెట్టుకోవాలని బెదిరింపులు.. బోండా ఉమా సంచలనం..
రాష్ట్రంలో తెలుగుదేశం నాయకులకు భద్రత కరువైందన్నారు టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా. కొంతమంది టీడీపీ నేతల హత్యలకు టీమ్స్ ఏర్పాటు చేసినట్టు తమకు సమాచారం అందుతోందన్నారు. ఒక ప్రెస్ మీట్ పెట్టి.. అక్కడినుంచి బయటకు వెళ్లేలోపు 10 బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయన్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదన్నారు. రోజులు లెక్క పెట్టుకోవాలని ఫోన్ కాల్స్లో హెచ్చరిస్తున్నారని.. ఇక సోషల్ మీడియాలో అయితే చెప్పరాని పదజాలంతో దూషిస్తున్నారని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో తెలుగుదేశం నాయకులు హత్యలకు గురైనా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదన్నారు.
నియంతలకు ఏ గతి పట్టిందో జగన్ తెలుసుకోవాలి..
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక నియంతలా వ్యవహరిస్తున్నారని బోండా ఉమా విమర్శించారు. అయితే చరిత్రలో నియంతలకు ఎలాంటి గతి పట్టిందో.. ఇండోనేషియా మాజీ అధ్యక్షుడు మహమ్మద్ సుహార్తో,ఫిలీప్పీన్స్ మాజీ అధ్యక్షుడు మార్కోస్,ఉగాండా ఇడి అమిన్ల చరిత్రను పరిశీలిస్తే తెలుస్తుందన్నారు. నియంతలకే నియంత అయిన హిట్లర్ కూడా చివరకు తన తుపాకీతోనే కాల్చుకుని చనిపోయాడన్నారు. తిరుగులేని ప్రజామోదం ఉందని ఒక దళిత డాక్టర్ను చొక్కా విప్పి నడిరోడ్డుపై కొట్టడం.. లోపాలను ఎత్తిచూపే ప్రతిపక్ష నాయకులను హత్య చేయిస్తామని బెదిరించడం,తప్పుడు కేసులతో జైల్లో పెట్టించడం.. ఇవన్నీ నియంత లక్షణాలేనని పేర్కొన్నారు.
జరిగిన అవినీతి రూ.7.80కోట్లు మాత్రమే..
అచ్చెన్నాయుడు కుటుంబం 30 ఏళ్లుగా రాజకీయాల్లో ఉందని.. ఎర్రనాయుడు కుటుంబంపై ఇంతవరకూ ఒక్క మచ్చ కూడా లేదని అన్నారు. అవినీతికి పాల్పడినవారిపై చర్యలు తీసుకోవడానికి తమకేమీ అభ్యంతరం లేదని.. కానీ కేవలం రాజకీయ కక్ష సాధింపుల కోసం ప్రతిపక్ష నాయకుల జీవితాలతో ఆడుకుంటున్నారని ఆరోపించారు. అసలు విజిలెన్స్ శాఖ ఇచ్చిన రిపోర్టులో ఎక్కడా అచ్చెన్నాయుడు పేరు లేదన్నారు. 9 రకాల అవినీతి జరిగిందని అందులో పేర్కొన్నారని.. కానీ అందులో ఎక్కడా అచ్చెన్నాయుడు పేరు లేదన్నారు. ఇక మొత్తం అవినీతి రూ.7.80కోట్లు జరిగిందని విజిలెన్స్ రిపోర్టులో పేర్కొంటే... వైసీపీ నేతలు మాత్రం రూ.975కోట్లు స్కామ్ అని ఊదరగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అచ్చెన్నాయుడు పేరు ఎక్కడా లేదు..
అధికారంలోకి రాకముందు అబద్దాలతో ఊరూరు తిరిగి ప్రజలను మోసం చేశారని.. కనీసం ఇప్పుడైనా వాస్తవాలు మాట్లాడాల్సిన అవసరం ఉందని బోండా ఉమా అన్నారు. ఈఎస్ఐ స్కామ్కి సంబంధించి విజిలెన్స్ ఇచ్చిన రిపోర్టులో పేజీ నం.4లో స్పష్టమైన వివరాలు పొందుపరిచారని చెప్పారు. ఫాబ్రికేటెడ్ కొటేషన్స్లో డైరెక్టర్స్ బి.రవి కుమార్,సీకే రమేష్ కుమార్,డా.విజయ్ కుమార్ల పేర్లు ఉన్నాయన్నారు. అలాగే మందుల కొనుగోళ్లలో అవకతవకలు,ల్యాబ్ కిట్ల కొనుగోళ్లలో అవకతవకలు,ఫర్నీచర్ కొనుగోళ్లలో అవకతవకలు ఇతరత్రా అవకతవకలన్నింటిలోనూ వీరి పేర్లే ఉన్నాయన్నారు. అచ్చెన్నాయుడు పేరు ఇందులో ఎక్కడా పేర్కొనలేదన్నారు. అలాంటిది ఏసీబీ అధికారులు అచ్చెన్నాయుడును అరెస్ట్ చేయడం అన్యాయం అన్నారు.
మంత్రికి ఈఎస్ఐ కొనుగోళ్లకు సంబంధం ఉండదు..
ఈఎస్ఐ మార్గదర్శకాల ప్రకారం మందుల కొనుగోళ్లకు సంబంధించి మంత్రికి ఎటువంటి అధికారం ఉండదన్నారు. డైరెక్టర్స్గా ఉన్నవారే ఆ నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. కాబట్టి అందుకు వారే బాధ్యులు అవుతారని అన్నారు. తెలంగాణలోనూ ఇలాంటి స్కామే జరిగితే.. అధికారులను అరెస్ట్ చేశారని,మంత్రి వరకూ వెళ్లలేదని అన్నారు. కారణం.. మంత్రికి,అక్కడ జరుగుతున్న కొనుగోళ్ల వ్యవహారాలకు ఎలాంటి సంబంధం ఉండదన్నారు. కానీ జగన్ ప్రభుత్వం మాత్రం ఆఖరికి ఏసీబీతోనూ తప్పుడు స్టేట్మెంట్స్ ఇపిస్తోందన్నారు. ఏసీబీ అధికారులను కూడా తాము హెచ్చరిస్తున్నామని.. గతంలో జగన్కు అనుకూలంగా పనిచేసి ఇరుక్కుపోయిన శ్రీలక్ష్మి లాంటి ఐఏఎస్లు ఇప్పటికీ ప్రతీ శుక్రవారం నాంపల్లి కోర్టు చుట్టూ తిరుగుతున్నారని చెప్పారు. గతంలో వారు కూడా 16 నెలల జైలు శిక్షను అనుభవించారన్నారు. కాబట్టి అధికారులు ఇలాంటి వ్యవహారాల్లో ఇరుక్కుపోవద్దన్నారు. రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలు అవుతోందని.. దళిత డాక్టర్ సుధాకర్పై దాడి,డా.అనితా రాణిపై దాడి,స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల సందర్భంగా తమపై జరిగిన దాడి.. ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోందన్నారు.