ఇక అక్కడ కూడా 'అవే' రాజకీయాలా..? మరో బెజవాడ కానున్న విశాఖ..!!
విశాఖ/హైదరాబాద్ : కృష్ణమ్మ ఒడ్డున విజయవాడ.. సాగరతీరాన విశాఖపట్టణం. రెండింటికీ పొంతనలేకపోయినా.. రాజకీయంగా మాత్రం ఇప్పుడిపుడే ప్రాధాన్యత సంతరించుకుంటోంది వాల్తేరు నగరం. అందాలతీరంలో విహరించేందుకు అదొక యాత్రాస్థలంగా మాత్రమే ఇప్పటి వరకూ గుర్తింపు. నావికాదళానికి కీలకమైన స్థావరంగా ప్రఖ్యాతి. ఉక్కుపరిశ్రమ, ఆధ్యాత్మిక నిలయంగా విలసిల్లుతున్న ప్రాంతం. రాష్ట్ర విభజన అనంతరం విశాఖ రాజకీయ కేంద్రంగా మారింది.
భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటే విశాఖ..! బెజవాడ సంస్క్రుతి ఎటు తీసుకెళ్తుంది..!!
గుంటూరు, కృష్ణాజిల్లాల నుంచి వ్యాపార, ఉద్యోగ వర్గాలు భారీగా చేరటంతో అక్కడ కుల సమీకరణలు అమాంతం ఎక్కువయ్యాయి. చేతుల నిండా డబ్బు.. పైరవీ చేయగల సత్తా ఉండటంతో పార్టీ కల్చర్ పూర్తిగా మారింది. ఇప్పుడు ఆ రెండే.. విశాఖను మరో విజయవాడగా మార్చుతాయనే భయం వెంటాడుతుంది. ప్రశాంతగా ఉండే వాల్తేరులో 2014లో వైసీపీ తరపున విజయలక్ష్మి బరిలోకి నిలిచారు.
తీరం వెంట చల్లని గాలులు..! అంత కన్నా ప్రశాంతంగా విశాఖ..!!
ఆమె గెలిస్తే.. కడప ఫ్యాక్షనిజం విశాఖకు చేరుతుందంటూ ఊదరగొట్టిన ప్రత్యర్థులు విజయమ్మ గెలుపును అడ్డుకోగలిగారు. కానీ.. అదే సమయంలో ఆంధ్ర రాజకీయాలలో ఉండే జిమ్మిక్కులను మాత్రం ఆపలేకపోయారు. ఇప్పుడు అదే విశాఖను పట్టిపీడిస్తున్న ఇబ్బందిగా మారింది. ఇటీవల సంచలనం రేకెత్తించిన రేవ్పార్టీ వెనుక ప్రభుత్వ పెద్దలు ఉన్నారనే ఆరోపణలున్నాయి. ఎక్సయిజ్ అధికారులను లోబరుచుకుని దర్జాగా అనుమతులు పొందినట్టు తెలుస్తోంది.
మారుతున్న రాజకీయం..! పెరుగుతున్న జనం..!!
ప్రస్తుతం ఎన్నికలకోడ్ ఉండటం వల్ల సదరు మంత్రిగారిని పక్కనబెట్టారు. రేపు అధికారం మారి మరో పార్టీ అధికారంలోకి వస్తే పాతతప్పుల చిట్టా తిరగతోడటం గ్యారంటీ అనిపిస్తోంది. 2019 ఎన్నికల్లో జగన్, పవన్, చంద్రబాబు ముగ్గురూ విశాఖ ఎంపీ సీటుపై సీరియస్గా ప్రయత్నించారు. ముగ్గురు నేతలు.. మూడు పార్టీలు.. మాత్రమే కాదు. మూడు కులాలకు చెందిన వారిగా ఆయా సామాజికవర్గాల్లో పాతుకుపోయింది.
కుల సంస్క్రుతిపై ఆందోళన వ్యక్తం చేస్తున్న స్థానికులు..! అయోమయంలో జనాలు..!!
ఇంతటి వాతావరణానికి బీజం వేసిన వాల్తేరు బీచ్లో ఏర్పాటైన హరికృష్ణ, దాసరి, అక్కినేని విగ్రహాలను విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ తొలగించింది. అయితే దీని వెనుక ఒత్తిడి తెచ్చిన పెద్దలు ఎవరనేది మాత్రం బయటకు రావట్లేదు. ఈ లెక్కన రాబోయే రోజుల్లో విశాఖ తీరంలోనూ.. కులాల కుంపట్లు సెగలు గక్కుతూ.. పగలను, ప్రతీకారాలను రెచ్చగొడతాయని విశాఖ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.