'వైసీపీ, జగన్ ల వెనుక అమిత్ షా.. ఆ విషయం వారికి తెలిసిపోయింది'
తిరుపతి: బీజేపీతో కలిసి ఉన్నట్లు తెలిస్తే ప్రజలు ఓట్లు వేయరన్న విషయం వైసీపీ, జనసేనలకు తెలిసిపోయిందని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. ఈ రెండు పార్టీలు బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్నాయి కానీ, ఇంతవరకు మోడీని మాత్రం ప్రశ్నించలేదని గుర్తుచేశారు. వారి వెనకాల బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఉన్నారని, అందుకే పైపై విమర్శలతోనే సరిపెడుతున్నారని ఆరోపించారు.
Recommended Video
సోమవారం తిరుపతిలో టీడీపీ నిర్వహించతలపెట్టిన 'ధర్మపోరాట సభ'లో జయదేవ్ ప్రసంగించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. తమ పోరాటం ఇకముందు కూడా కొనసాగుతుందని అన్నారు. ఇటీవల పార్లమెంటు ఇంటా బయటా కొట్లాడామని, ఇప్పుడు ప్రతీ జిల్లాలోనూ పోరు బాట పట్టామని అన్నారు.
నాలుగేళ్ల ముందు ప్రధానమంత్రి మోడీ ఇచ్చిన హామిలను గుర్తుచేయడమే ధర్మపోరాట సభ ముఖ్య ఉద్దేశం అని పేర్కొన్నారు. మోడీ ఇచ్చిన హామిలను చిన్నపిల్లాడిని అడిగినా చెబుతారని అన్నారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఎలాగైతే చూస్తున్నారో బీజేపీని కూడా అలాగే చూస్తున్నారని చెప్పారు.