ఇద్దరు చంద్రులకు కేంద్రం ఝలక్: అసెంబ్లీ సీట్ల పెంపు ఇప్పట్లో కుదరదు!
ప్రస్తుత పరిస్థితుల్లో రాజ్యసభలో బీజేపీకి మెజారిటీ లేకపోవడం, 2018వరకు బీజేపీకి మెజారిటీ వచ్చే అవకాశం లేకపోవడంతో అప్పటిదాకా వేచి చూడాల్సిందేనని కేంద్రం చెబుతోంది.
హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల్లోని అధికార పార్టీలు ఇబ్బడి ముబ్బడిగా ఫిరాయింపుదారులను పార్టీల్లో చేర్చేసుకున్నాయి. నయానో.. భయానో.. ఇంతకుముందు పార్టీతో ఏమాత్రం పొసగని నేతలను సైతం తమ గూటికి ఆహ్వానించాయి.
ఇక్కడివరకు అంతా బాగానే ఉంది గానీ ప్రతిపక్ష సభ్యుల చేరిక సొంత పార్టీ నేతలకు కొత్త కష్టాలను తీసుకొచ్చింది. వచ్చే ఎన్నికల్లో తమ సీట్లకు ప్రతిపక్ష సభ్యులు ఎక్కడ గండికొడుతారోనన్నది వారి ఆవేదన. అంతేకాదు, ఇటీవలి ఏపీ మంత్రివర్గ పునర్వ్వవ్యస్థీకరణలోను ప్రతిపక్షం నుంచి వచ్చినవారికే పార్టీ పెద్ద పీట వేయడంతో.. ఈ అనుమానాలు వారిలో మరింత బలపడ్డాయి.
వచ్చే ఎన్నికల నాటికి అసెంబ్లీ సీట్ల పెంపు గనుక జరగపోతే రెండు తెలుగు రాష్ట్రాల్లోని అధికార పార్టీలకు ఇది ప్రతికూలంగా మారే అవకాశం ఉంది. పార్టీలో నాయకుల సంఖ్య ఎక్కువైపోవడంతో ఎవరికి టికెట్లు దక్కుతాయో? ఎవరికి దక్కవో తెలియని పరిస్థితి. చివరకు ఇది కాస్త అలకలు, అసంతృప్తులు, రెబల్స్ పుట్టుకురావడానికి దారితీసే అవకాశం లేకపోలేదు.
ఇలాంటి తరుణంలో:
ఇలాంటి తరుణంలో కేంద్రం రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలకు షాకింగ్ వార్త చెప్పింది. అసెంబ్లీ స్థానాల పెంపు ప్రక్రియ ఇప్పట్లో కుదరదని, రాజ్యాంగ సవరణ ద్వారానే దాన్ని సవరించాల్సి ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డికి పంపిన లిఖితపూర్వక లేఖలో కేంద్రం వివరణ ఇచ్చింది. నియోజకవర్గాల పునర్విభజనకు రాజ్యాంగంలోని 170 అధికరణను సవరించాల్సిందేనని అటార్నీ జనరల్ కూడా అభిప్రాయపడినట్లు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి హన్స్ రాజ్ గంగారామ్ అహీర్ తెలిపారు.
ఇప్పట్లో కుదరదు:
2014ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్26కు అనుగుణంగా భారత రాజ్యాంగంలోని 170వ అధికరణను సవరించనిదే ఏపీ, తెలంగాణల్లో అసెంబ్లీ సీట్ల పెంపు సాధ్యం కాదని కేంద్రం చెప్పింది. అందువల్ల ఏపీలో అసెంబ్లీ సీట్లను 175నుంచి 225కు, తెలంగాణలో 119నుంచి 153కు పెంచడం సాధ్యం కాదని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి గంగా రామ్ అహిర్ తెలిపారు.
50శాతం రాష్ట్రాల ఆమోదం తప్పనిసరి:
అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపు జరగాలంటే దేశంలోని 50శాతం రాష్ట్రాలు ఇందుకు అంగీకరించాలని, దాంతో పాటు పార్లమెంటు ఉభయ సభల్లోను మెజారిటీ సభ్యులు ఆమోదం తెలపాలని వైవీ సుబ్బారెడ్డికి రాసిన లేఖలో పేర్కొన్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో రాజ్యసభలో బీజేపీకి మెజారిటీ లేకపోవడం, 2018వరకు బీజేపీకి మెజారిటీ వచ్చే అవకాశం లేకపోవడంతో అప్పటిదాకా వేచి చూడాల్సిందేనని కేంద్రం చెబుతోంది. 2018లోను బీజేపీ సభ్యులు ఇందుకు అనుకూలంగా ఉంటేనే ఇది వాస్తవ రూపం దాల్చే పరిస్థితి నెలకొంది.
చంద్రబాబు ఎందుకలా?:
ఓవైపు అసెంబ్లీ సీట్ల పెంపు సాధ్యం కాదని కేంద్రం చెబుతున్నా.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాత్రం వచ్చే ఎన్నికల నాటికి మరో 50స్థానాలు పెరుగుతాయని చెబుతున్నారు. దీంతో ఆయనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల కమిషన్, కేంద్రం మాటను కాదని చంద్రబాబు ఇలా ఎందుకు ప్రచారం చేస్తున్నారని జనం ప్రశ్నిస్తున్నారు.
నియోజకవర్గాల పునర్విభజనపై చూపించే శ్రద్ద, ఏపీకి ప్రత్యేక హోదా, రైల్వే జోన్, వెనుకబడిన జిల్లాల అభివృద్ధిపై చూపిస్తే బాగుంటుందని పలువురు అభిప్రయాపడుతున్నారు. తప్పుడు ప్రకటనలతో ప్రజలను మోసం చేస్తూ రాష్ట్ర ప్రయోజనాలు గాలికొదిలేస్తున్నారని విమర్శిస్తున్నారు.