మావోయిస్టుల పోరాటం వల్ల ప్రజలకు ఒరిగేదేం లేదు:చింతపల్లి డిఎస్పీ అనీల్
విశాఖపట్టణం:ప్రజా ఉద్యమాల పేరుతో మావోయిస్టులు చేస్తున్న పోరాటం వల్ల వాస్తవంగా ప్రజలకు ఒరిగేదేమీ లేదని చింతపల్లి డీఎస్పీ పులిపాటి అనిల్ చెప్పారు. చింతపల్లి ఏరియా పరిధిలోని జర్రెల పంచాయితీ కేంద్రంలో ఉచిత మెగా వైద్యశిబిరం పోలీసుశాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా డిఎస్పీ అనిల్ మాట్లాడుతూ మావోయిస్టులు కేవలం తమ ఉనికి చాటుకునేందుకే అమాయక గిరిజనులను ఇన్ఫార్మర్ల పేరిట దారుణంగా హతమారుస్తున్నారని అన్నారు. పోలీసు శాఖ అన్ని విధాలా గిరిజనులకు అండగా ఉంటుందని చెప్పారు. గిరిజన యువతకు స్వయం ఉపాధి మార్గాలకు తోడ్పాటుతో పాటు వారు ప్రభుత్వ ఉద్యోగాలు పొందేందుకు అవసరమైన సహాయ, సహకారాలను పోలీసు శాఖ అందిస్తుందని ఈ సందర్భంగా తెలిపారు.
పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా వైద్యశిబిరంలో భాగంగా 600 మంది రోగులకు ఉచితంగా వైద్యపరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. అనంతరం జర్రెల మాజీ సర్పంచ్, 2016లో మావోయిస్టుల చేతిలో మృతి చెందిన సాగిన వెంకటరమణ తల్లిదండ్రులకు బట్టలు, సహాయ సామాగ్రిని ఆయన అందజేశారు.
అనంతరం డిఎస్పీ అనిల్ మాట్లాడుతూ పోలీసుశాఖ ఉన్నతాధికారుల ఆదేశాలను అనుసరించి మన్యంలో చేయూత, ఉజ్వల, భవిత, రైతు నేస్తం, ముందడుగు వంటి కార్యక్రమాలతో గిరిజనులతో మమేకమవుతున్నట్లు తెలిపారు. తమశాఖ ద్వారా గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కృషి తమ వంతుగా చేస్తున్నామన్నారు.