పవన్ కళ్యాణ్తో విభేదాలపై ఉమ, 'చంద్రబాబు ఆ మతలబేంటి చెప్పాలి'
విజయవాడ: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో తమకు (తెలుగుదేశం) ఎలాంటి విభేదాలు లేవని విజయవాడ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బోండా ఉమ బుధవారం నాడు తెలిపారు. అలాగే, కుంభకోణాలు అంటూ ప్రతిపక్ష పార్టీలు వైసిపి, కాంగ్రెస్ పార్టీలు చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టారు.
ఏపీలో మూసేసిన పార్టీ కాంగ్రెస్ అని ఎద్దేవా చేసారు. దిగ్విజయ్ సింగ్ దిగుమతి చేసుకున్న నేతలు అని, అలాంటి వారు ప్రభుత్వం పైన విమర్శలు చేయడం విడ్డూరమన్నారు. కాపుల గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకు ఏమాత్రం లేదన్నారు.
2004లోనే కాపులను బీసీల్లో చేర్చుతామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని, మరి పదేళ్ల పాటు ఏం చేసారో చెప్పాలని నిలదీశారు. బీసీల్లో చేర్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. కాంగ్రెస్ పార్టీ దేశాన్ని దోచుకున్నదని, అలాంటి చరిత్ టిడిపిది కాదన్నారు.
కాగా, అంతకుముందు ఏఐసీసీ నేత దిగ్విజయ్.. చంద్రబాబు ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. పోలవరం వ్యయ అంచనాను రూ.16వేల కోట్ల నుంచి రూ.44వేల కోట్లకు పెంచడం వెనుక మతలబు ఏమిటో చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు.
పోలవరం నిర్మాణ వ్యయం పెంచడం వెనుక చంద్రబాబుకు ఆర్థిక ప్రయోజనాలు దాగున్నాయన్నారు. అమరావతి నిర్మాణ పనులు విదేశీ కంపెనీలకు అప్పగించడం, దేశీయ కంపెనీలు డ్రైనేజీలు నిర్మించడానికే పని కొస్తాయని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు దేశీయ నిర్మాణ సంస్థలను అవమానపరిచేలా ఉన్నాయన్నారు.
తమ అనుచరులకు నిర్మాణ పనులు అప్పగించి వచ్చే ఎన్నికల్లో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేలా చంద్రబాబు ప్రణాళికలు రచిస్తున్నారని విమర్శించారు. విభజనకు అన్ని పార్టీలు ఆమోదం తెలిపినా, ఏపీ ప్రజలు మాత్రం కాంగ్రెస్ను బాధ్యలుగా చూశారన్నారు. విపక్షంలో ఉన్నప్పుడు ఏపీకి ప్రత్యేక హోదా పదేళ్లు కావాలని డిమాండ్ చేసిన వెంకయ్యనాయుడు, అరుణ్ జైట్లీ అధికారంలోకి రాగానే మాట మార్చేశారన్నారు.