ఇక్కడి అధికారులకు సెలవులు లేవు...నేనిక్కడే ఉంటా:శ్రీకాకుళంలో సిఎం చంద్రబాబు
శ్రీకాకుళం:తిత్లీ తుఫాన్ తాకిడికి గురైన శ్రీకాకుళం జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో అధికారులెవరికీ ఆదివారం కూడా సెలవు లేదని కావాలంటే తర్వాత సెలవు తీసుకోవచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.
శ్రీకాకుళంలో పర్యటిస్తూ తుఫాన్ సహాయక చర్యలు స్వయంగా పర్యవేక్షిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు అక్కడి నుంచే అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేసిన చంద్రబాబు సహాయక చర్యలు ముమురంగా సాగేందుకు వీలుగా అధికారులు ఆదివారం కూడా సెలవు తీసుకోకుండా పనిచేయాలని సూచించారు.
సహాయక చర్యలపై...దిశానిర్ధేశం
సహాయక చర్యల్లో అతిముఖ్యమైనటువంటి గండ్లు పూడ్చటం,రహదారుల మరమ్మతులు, కూలిన చెట్లను తొలగించడం వంటి పనులను యుద్ధ ప్రాతిపదికన చేయాలని ఆదేశించారు. బాధిత ప్రజానీకానికి సేవలు అందించటంలో అధికారులు పోటీ పడాలని చంద్రబాబు అన్నారు. మన కుటుంబాలకు ఆపద వస్తే ఎలా స్పందిస్తామో.. అదేవిధంగా సాయం కోసం ఎదురు చూస్తున్న బాధితుల పట్ల మెలగాలని అధికారులకు చంద్రబాబు హితవు పలికారు.
పనిచేస్తే అవార్డులు...లేకుంటే పనిష్మెంట్
ఎవరెవరు ఎలా పనిచేశారో విశ్లేషించి...బాగా పనిచేసిన వారికి అవార్డులు అందిస్తామని ఈ సందర్భంగా సిఎం చంద్రబాబు ప్రకటించారు. అదే సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం తిత్లీ తుపాను కారణంగా తీవ్రంగా నష్టపోయిన శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం అక్కుపల్లిలో బాధితులను సిఎం చంద్రబాబు పరామర్శించారు.
ముమ్మరంగా...సహాయక చర్యలు
తుపానుతో నష్టపోయిన రైతులందర్నీ ఆదుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు. తుపాను ప్రభావిత ప్రాంత వాసులకు 50 కిలోల బియ్యాన్ని అందజేస్తామని, విద్యుత్ పునరుద్ధరణ పనులు వేగవంతం చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే 194 గ్రామాల్లో సహాయకచర్యలను ముమ్మరం చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.
ఇక్కడే ఉంటా...సిఎం భరోసా
అవసరమైతే తాను పలాసలోనే ఉండి యుద్ధప్రాతిపదికన పనులు జరిగేలా చూస్తానని బాధితులకు ధైర్యం చెప్పారు. సహాయక చర్యలను పర్యవేక్షించడం, బాధితులను పరామర్శించడం చేస్తూనే మరోవైపు అధికారులతో కూడా సమీక్షలు జరుపుతూ పనుల వేగాన్ని పెంచుతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు.