కాపులకు 'కాపు' కాసేదెవ్వరు? ఏపీలో నాయకుడనే వారే లేరా?
అమరావతిః రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ఉన్న కాపులు విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలో కాపు జనాభాలో సుమారు 15 శాతానికి పైగా ఉన్న బలమైన సామాజిక వర్గం కాపులు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో సుమారు 40 లక్షల మంది కాపులు ఉన్నారు. జస్టిస్ మంజునాథ కమిషన్ తేల్చిన లెక్క ఇది. రాజకీయంగా కాపులు వివక్షకు గురవుతున్నారు. వారు రాజకీయంగా నాయకత్వ లేమిని ఎదుర్కొంటున్నారు. దివంగత వంగవీటి మోహన రంగా తరువాత ఆ స్థాయిలో రాజకీయాల్లో కాపులను కాపు కాసే నాయకుడు కనిపించట్లేదు. తమ కోసం ప్రాణత్యాగాన్ని చేసిన నాయకునిగా వంగవీటి మోహనరంగాను గుర్తిస్తారు కాపులు.ఆయన తరువాత కాపుల హక్కుల కోసం గట్టిగా పనిచేసే నాయకుడు ఒక్కరూ లేరు. ఎవరి స్వార్థాన్ని వారు చూసుకోవడం వల్ల ఎదురైన సమస్యగా దీన్ని చెప్పుకోవచ్చు.
నాయుడు, రెడ్డి సరే.
రాష్ట్రంలోని రెండు బలమైన రాజకీయ పార్టీల్లో కూడా కాపు నాయకుల సంఖ్య చెప్పుకోదగ్గ స్థాయిలో ఉంది. అయినప్పటికీ వారిని ముందుండి నడిపించే నాయకుడు లేరు. మరో రెండు బలమైన సామాజిక వర్గాలైన కమ్మలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రెడ్డిలకు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ఆ స్థాయి నాయకుడు కాపులకు లేరు.
కాపు రిజర్వేషన్ల ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కొన్నేళ్ల పాటు కాపులకు రాజకీయంగా ప్రాతినిథ్యం వహించినప్పటికీ.. ప్రస్తుతం ఆయన పరిస్థితి ఆశించిన స్థాయిలో లేదు. చంద్రబాబు ప్రభుత్వం ఉద్దేశపూరకంగా ఆయనను అణగదొక్కేశారనే విమర్శలు ఉన్నాయి. కాపు రిజర్వేషన్ల ఉద్యమంలో భాగంగా తూర్పు గోదావరి జిల్లా తుని వద్ద 2016 ఫిబ్రవరిలో ఆయన నిర్వహించిన సభను ప్రభుత్వం ఎలా అణచి వేసిందో మనం చూశాం. ఆ ఒక్క సభ విజయవంతం అయి ఉంటే కాపుల రాజకీయ స్థితిగతులు వేరుగా ఉండేవనేది విశ్లేషకుల అంచనా.
ఆ తరువాత ఆయన రెండుసార్లు ప్రభుత్వాన్ని నిలదీసే ప్రయత్నం చేశారు. ప్రభుత్వం దీన్నీ అడ్డుకుంది. పూర్తిస్థాయి కాపు నాయకుడిగా ముద్రగడ పద్మనాభాన్ని ఎదగనివ్వలేదు ప్రభుత్వం. ముద్రగడతో పాటు ఆయన కుటుంబ సభ్యులపై పోలీసులు దౌర్జన్యం చేశారు. ఆయనను ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టనివ్వలేదు. ముద్రగడకు మరో ప్రత్యామ్నాయం కనిపించని పరిస్థితి ఎదురైంది. తనను ఎదగకుండా అన్ని రకాలుగా చేసిన చంద్రబాబును ముద్రగడ ఓ దశలో సమర్థించారు కూడా.
ప్రభావం చూపని చిరంజీవి..
ఇదివరకు మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య కాపులకు ప్రాతినిథ్యం వహించినప్పటికీ..పూర్తిస్థాయిలో కాదు. ప్రముఖ దర్శకుడు, కేంద్ర మాజీ మంత్రి దివంగత దాసరి నారాయణ రావు కొన్నాళ్ల పాటు కాపులకు అండగా ఉంటూ వచ్చారు. ఒకవైపు పూర్తిస్థాయి రాజకీయాలు, మరోవైపు సినిమాలతో ఆయన పెద్దగా ఉద్యమాలను నడిపించలేకపోయారు. సినిమా రంగం నుంచే వచ్చిన చిరంజీవి కాపు సామాజికవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తారని అంచనా వేశారు. రాష్ట్రవ్యాప్తంగా లక్షల సంఖ్యలో ఉన్న చిరంజీవి అభిమానుల అండ ఆయనకు ఉంటుందని, వారి ఓటుబ్యాంకు ద్వారా చిరంజీవి అద్భుతాలను సృష్టించగలరని భావించారు. అవన్ని తలకిందులయ్యాయి.
'సామాజిక న్యాయం` అనే నినాదంతో ప్రజారాజ్యం పార్టీ పెట్టారు చిరంజీవి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి జిల్లా తిరిగారు. అయినప్పటికీ అనుకున్న లక్ష్యాన్ని అందుకోలేకపోయారు. ప్రజారాజ్యం పార్టీకి 2009 ఎన్నికల్లో దక్కినవి 18 అసెంబ్లీ స్థానాలే. కాపుల ఓట్లు పెద్ద సంఖ్యలో ఉన్న పాలకొల్లులో స్వయంగా పోటీ చేసిన చిరంజీవే ఓడిపోవడం పార్టీ పతనాన్ని శాసించినట్టయింది. అధికారంలోకి వస్తారనే అంచనా నుంచి కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదాను కూడా అందుకోలేకపోయింది ప్రజారాజ్యం పార్టీ. ఇదంతా ఆయన స్వయంకృతాపరాధమే. ఎన్నికల సందర్భంగా ఇష్టానుసారంగా టికెట్లను అమ్ముకున్నారనే అపవాదు ఆయనపై ఉంది. ఆ తరువాత ఆయన పార్టీని నడిపించలేక చేతులెత్తేశారు. కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. కేంద్రమంత్రిగా పనిచేశారు. తనను చూసి ఓట్లు వేస్తారని చిరంజీవి అతిగా ఊహించడం, కాపులు చిరంజీవిని `తమ వాడు` అనే దృష్టిలో చూడకపోవడమే దీనికి ప్రధాన కారణమని వాదన ఉంది.
పవన్ ను ఓన్ చేసుకోవట్లేదు..
చిరంజీవి వారసునిగా అటు సినీ పరిశ్రమలో, ఇటు రాజకీయాల్లో అడుగు పెట్టిన పవన్ కల్యాణ్.. రాజకీయ పార్టీని పెట్టారు. వచ్చే ఎన్నికల్లో పోటీకి సిద్ధపడుతున్నారు. ఓ పూర్తిస్థాయి రాజకీయ పార్టీ అధ్యక్షునిగా.. అన్ని సామాజిక వర్గాలనూ సమదృష్టితో చూడాల్సిన బాధ్యత పవన్ కల్యాణ్కు ఉంది. కాపులకు ప్రాధాన్యత ఇచ్చుకుంటూ వెళ్తే, కుల పార్టీ అనే ముద్ర పడుతుందనే భయం పవన్ కల్యాణ్ కు ఉంది. పైగా, తాను కుల రహిత సమాజం కోసం కృషి చేస్తున్నానని కూడా ఆయన చెప్పుకొన్నారు.
ఈ పరిస్థితుల్లో ఆయనను కాపులు తమ నాయకునిగా గుర్తించడం లేదు. పైగా ఆయన అన్నచిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్కు అమ్ముకున్నారనే అపవాదు.. పవన్ ను వెంటాడుతోంది. పవన్ కల్యాణ్ కూడా చిరంజీవిలాగే మోసం చేస్తారనే భయం కాపుల్లో వ్యక్తమౌతోంది. పవన్ కల్యాణ్ లో నిలకడ లేదని, ఎప్పుడు, ఎలా ప్రవర్తిస్తారో, ఎప్పుడు ఏమి మాట్లాడతారో ఆయనకే తెలియదని ఉదాహరణలతో సహా చెబుతున్నారు కాపులు.
రాధా అయినా ఎదుగుతారనుకుంటే..!
కాపు నాయకునిగా కొద్దో, గొప్పో పేరు తెచ్చుకున్న వ్యక్తి వంగవీటి రాధాకృష్ణ. తన తండ్రి, కాపుల కోసం ప్రాణత్యాగం చేసిన వంగవీటి మోహన రంగా వారసునిగా పేరు తెచ్చుకున్న రాధా.. ఆ ముద్ర నుంచి ఎంతమాత్రమూ బయట పడలేకపోయారు. తన తండ్రి పేరే తనను కాపు నాయకునిగా నిలబెడుతుందని ఆశించారు. అది ఫలితాలను ఇవ్వలేదు. సొంతగా ఎదిగేంత అంగబలం, అర్ధబలం వంగవీటి రాధాకు లేదనేది ఆయన సన్నిహితుల వాదన.
అందుకే- ఏదో ఒక రాజకీయ పార్టీలో ఉంటూ తన తండ్రిలా పూర్తిస్థాయి కాపు నాయకునిగా మారడానికి రాధా చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. చివరికి.. రాజకీయాల్లో మనుగడ సాగించడానికి ఆయన తన తండ్రిని హత్య చేసిన పార్టీగా గుర్తింపు తెచ్చుకున్న తెలుగుదేశం పార్టీలోనే చేరిపోయారు. కాపుల కోసం కొద్దో, గొప్పో శ్రమిస్తారని అనుకున్న రాధా.. టీడీపీ తీర్థాన్ని పుచ్చుకున్నారు. వంగవీటి రాధా టీడీపీలో చేరిపోవడంతో ఆయన అంకం సమాప్తి అయిందనే కాపులు భావిస్తున్నారు. ప్రస్తుత రాజకీయాల్లో కాపుల కోసం కష్టపడే నాయకుడు కనిపించట్లేదు.