జగన్ సర్కారుకు కేంద్రం భారీఊరట- హైకోర్టు ఉంటేనే రాజధాని కాదు-రాజధానులకు విభజన చట్టం ఒకే...
ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు కోసం జరుగుతున్న ప్రయత్నాలకు మరో ఊతం లభించింది. మూడు రాజధానుల విషయంలో ఇప్పటికే సానుకూలంగా ఉన్న కేంద్ర ప్రభుత్వం సీఎం జగన్కు మరో తీపికబురు చెప్పింది. ఇప్పటివరకూ రాజధాని రైతులు ఏపీ విభజన చట్టంలో మూడు రాజధానుల ప్రస్తావనే లేదని వాదిస్తున్న నేపథ్యంలో దీనిపై మరింత స్ఫష్టత ఇచ్చింది. విభజన చట్టాన్ని అర్ధం చేసుకోవడంలో పిటిషనర్లు అయిన రైతులు అపోహ పడుతున్నట్లు కేంద్రం తెలిపింది. అదే సమంయలో హైకోర్టు రాజధానిలోనే ఉండాలని చేస్తున్న వాదనలోనూ అర్ధం లేదని తెలిపింది. దీంతో జగన్ సర్కారుకు మరో భారీ ఊరట లభించినట్లయింది.
కేంద్రం అఫిడవిట్లో క్లారిటీ...
ఏపీలో మూడు రాజదానుల ఏర్పాటుకు వ్యతిరేకంగా హైకోర్టులో దాఖలైన పిటిషన్లను విచారిస్తున్న ధర్మాసనం ముందు కేంద్రం ఇవాళ మరో అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ అదనపు అఫిడవిట్లో ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుకు ఉన్న అవకాశాలను కేంద్ర హోంశాఖ మరోసారి స్పష్టంగా చెప్పింది. ఏపీలో రాజధాని లేదా రాజధానుల ఏర్పాటులో కేంద్రం ప్రమేయం ఉండబోదని తేల్చిచెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకున్న రాజధానికి ఆర్ధిక, ఇతర సాయాలు చేయడం మాత్రమే తమ పరిధి అని స్పష్టం చేసింది. తద్వారా ఏపీలో రాజధాని ఏర్పాటులో కేంద్రం పాత్రేమీ ఉండబోదని మరోసారి చెప్పినట్లయింది.
విభజన చట్టంలో రాజధానుల సంఖ్య లేదు..
ఏపీ విభజన కోసం కేంద్రం అప్పట్లో రూపొందించిన చట్టంలో రాజధాని ఎంపిక అని మాత్రమే ఉందని, అంటే ఒకే రాజధాని అని మాత్రమే ఇప్పటివరకూ రైతులు, విపక్షాలు వాదిస్తుండగా... ఇప్పుడు అదీ తప్పేనని కేంద్రం తేల్చిచెప్పింది. రాజధాని ఏర్పాటుకు కేంద్రం సహకరిస్తుందంటే ఒకే రాజధాని కాదని, ఒకటి కంటే ఎక్కువ రాజధానులు ఉఁటే సాయం చేయబోమని తామెక్కడా చెప్పలేదని కేంద్రం తాజా అఫిడివిట్లో పేర్కొంది. దీంతో మూడు రాజధానుల ఏర్పాటు విషయంలో కేంద్రం పూర్తి క్లారిటీ ఇచ్చేసినట్లయింది. విభజన చట్టాన్ని అడ్డుపెట్టుకుని ఒకే రాజధాని ప్రస్తావన చేయడం సరికాదని ఈ అఫిడివిట్ తేల్చిచెప్పింది.
Recommended Video
హైకోర్టుపైనా క్లారిటీ...
హైకోర్టు ఉంది కాబట్టి అమరావతే రాజధాని అనుకోవడానికి లేదని కూడా కేంద్రం ఈ అఫిడవిట్లో క్లారిటీ ఇచ్చింది. రైతులు తమ పిటిషన్లు హైకోర్టు ఏర్పాటు చేశారు కాబట్టి అమరావతినే రాజధానిగా ఉంచాలని కోరుతున్న నేపథ్యంలో కేంద్రం ఇచ్చిన స్పష్టత ప్రాధాన్యం సంతరించుకుంది. విభజన చట్టం ప్రకారం రాష్ట్ర హైకోర్టు రాజధానిలోనే ఉండాలని ఎక్కడా చెప్పలేదని కూడా కేంద్ర హోంశాఖ తన తాజా అపిడవిట్లో స్పష్టత ఇచ్చింది. అంటే హైకోర్టు మార్పు విషయం కూడా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాధికారమేనని కేంద్రం చెప్పినట్లయింది. మూడు రాజధానుల నేపథ్యంలో అమరావతిలో ఉన్న హైకోర్టును కర్నూలుకు తరలించి న్యాయ రాజధాని ఏర్పాటు చేయాలని జగన్ సర్కారు నిర్ణయించింది. దీంతో ప్రభుత్వం రాజధాని నుంచి హైకోర్టుకు తరలించడం కుదరదంటూ కూడా పిటిషనర్లు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం తాజా అఫిడవిట్లో హైకోర్టు రాజధానిలో ఉండాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పడంతో హైకోర్టు తరలింపుకు కూడా మార్గం సుగమం అయినట్లయింది.