సిగ్గుచేటు... వైసీపీ ఏడాదిన్నర పాలనలో ఒక్క కొత్త ప్రాజెక్టు లేదు... : చంద్రబాబు నాయుడు
వైసీపీ ఏడాదిన్నర పాలనలో ఉత్తరాంధ్ర,రాయలసీమకు ఏం చేశారో చెప్పాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. విశాఖ,కర్నూలు జిల్లాలకు వైసీపీ ప్రభుత్వం చేసిందేమీ లేదని.. టీడీపీ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులే తప్ప కొత్త ప్రాజెక్టు ఒక్కటి కూడా లేదని విమర్శించారు.అమరావతి ఉద్యమ భవిష్యత్ కార్యాచరణపై శుక్రవారం(అక్టోబర్ 9) పార్టీ సీనియర్ నేతలతో టెలికాన్ఫరెన్స్ సందర్భంగా చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు.
వైసీపీ ప్రభుత్వం వచ్చాక నీటి ప్రాజెక్టులన్నీ నిలిచిపోయాయని... పెట్టుబడులు పెట్టేందుకు వచ్చిన కంపెనీలను బెదిరించి తరిమికొట్టారని చంద్రబాబు నాయుడు ఆరోపించారు. టీడీపీ హయాంలో చేసిన అభివృద్దినే తమ అభివృద్దిగా వైసీపీ ప్రచారం చేసుకుంటోందని... అలా చెప్పుకోవడం సిగ్గుచేటని విమర్శించారు.
రాజధాని రైతులకు మద్దతుగా 3 రోజుల పాటు ప్రతీ మండలంలో సంఘీభావ దీక్షలు,ర్యాలీలు చేపట్టాలని చంద్రబాబు నాయుడు పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. టీడీపీ కార్యకర్తలు,నేతలు చురుగ్గా పాల్గొని దీక్షలను విజయవంతం చేయాలన్నారు. ఆదివారం(అక్టోబర్ 11) ఉదయం అమరావతి పరిరక్షణ ర్యాలీ,అదే రోజు రాత్రి స్కైలాంతర్ల ర్యాలీ ద్వారా నిరసన చేపట్టాలన్నారు. సోమవారం(అక్టోబర్ 12) ఉదయం తహశీల్దార్ కార్యాలయాల వద్ద దీక్షలు,ప్రదర్శనల ద్వారా రైతులకు సంఘీభావం తెలపాలన్నారు.
కాగా,అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ అక్కడి రైతులు గత కొద్ది నెలలుగా నిరసనలు చేపడుతున్న సంగతి తెలిసిందే. శుక్రవారం(అక్టోబర్ 9) నాటికి ఈ నిరసనలు 297వ రోజుకు చేరుకున్నాయి. మందడం, తుళ్లూరు, వెలగపూడి, వెంకటపాలెం, కృష్ణాయపాలెం తదితర గ్రామాల్లో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. మరో 3 రోజుల్లో రైతు నిరసనలు 300 రోజులు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో టీడీపీ ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్లనుంది.