కిరణ్తో లాభం లేదు: పితాని, మోడీకి కావూరి ప్రశంసలు
హైదరాబాద్: మాజీ మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఏర్పాటు చేసిన జై సమైక్యాంధ్ర పార్టీ వల్ల ఇప్పుడు ఉపయోగం లేదని మాజీ మంత్రి పితాని సత్యానారాయణ శుక్రవారం అన్నారు. రాష్ట్ర నిర్మాణం కోసం కృషి చేసే పార్టీ వల్లే ఉపయోగం ఉంటుందని చెప్పారు. సీమాంధ్రను అభివృద్ధి చేసే సమర్థ నాయకుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడే అన్నారు.
తెలుగుజాతికి ద్రోహం చేసినందునే కాంగ్రెస్ పార్టీని వీడినట్లు చెప్పారు. ప్రజల అభీష్ఠం మేరకే తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన నేపథ్యంలో ఇటీవల పలువురు సీమాంధ్ర కాంగ్రెసు పార్టీ నేతలు తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలలో చేరుతున్న విషయం తెలిసిందే.
పదవులను ఆశించి తాను భారతీయ జనతా పార్టీలో చేరలేదని ఆ పార్టీ నేత, మాజీ కేంద్రమంత్రి పురందేశ్వరి మరోసారి స్పష్టం చేశారు. శుక్రవారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ అందిరినీ విమర్శించే జైరామ్ రమేష్ టైటానియం కుంభకోణంపై కూడా స్పందిస్తే బాగుంటుందన్నారు.
రాష్ట్ర విభజన సమయంలో అరుణ్ జైట్లీ, వెంకయ్యనాయుడు ఒత్తిడితోనే సీమాంధ్రకు ప్యాకేజి లభించిందని ఆమె అన్నారు. పార్టీ ఎక్కడి నుంచి పోటీచేయమంటే అక్కడి నుంచి పోటీ చేస్తానని పురందేశ్వరి తెలిపారు. తెలుగుదేశం పార్టీతో పొత్తులపై రేపు సాయంత్రంలోగా స్పష్టత వస్తుందని, కేంద్రంలో సుస్థిరమైన ప్రభుత్వం కోసం పొత్తులు అవసరమని మరో బిజెపి నేత కంభంపాటి హరిబాబు అన్నారు.
మోడికి కావూరి ప్రశంసలు
కావూరి సాంబశివ రావు బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ పైన ప్రశంసలు కురిపించారు. మోడీ సమర్థ నాయకుడని, అభివృద్ధితో మోడీ తన సత్తా నిరూపించుకున్నారని కావూరి చెప్పారు. రాహుల్ గాంధీ ఆలోచనలా విధానాలు ఏవీ పెద్దగా ప్రజల పైన ప్రభావం చూపలేదన్నారు.