పవన్ కళ్యాణ్ది తప్పుకాదు, బాబుకు ప్రధాని ఫోన్: గాలి, సెక్షన్ 8పై
చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించి సేకరించనున్న భూమి పైన జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ను ఒప్పిస్తామని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు సోమవారం అన్నారు.
రైతుల నుంచి బలవంతంగా భూసేకరణ చేయవద్దని పవన్ కళ్యాణ్ టిడిపి ప్రభుత్వానికి సూచించిన విషయం తెలిసిందే. దీనిపై గాలి స్పందించారు. భూసేకరణ విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంపై పవన్ కళ్యాణ్ను ఒప్పిస్తామన్నారు.
భూసేకరణ అంశం పైన పవన్ కళ్యాణ్ తన అభిప్రాయం చెప్పడంలో తప్పు లేదన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు త్వరలో ఢిల్లీ వెళ్తారని చెప్పారు. ప్రధాని మోడీని కలిసి చర్చిస్తారని చెప్పారు. బాబుకు ఢిల్లీకి రావాలని ప్రధాని నుంచి ఫోన్ వచ్చిందని చెప్పారు.
వైసిపి ఎమ్మెల్యే రోజా విషయమై మాట్లాడుతూ... చిత్తూరు జిల్లా పోలీసులను తాను నియంత్రిస్తున్నానంటూ రోజా చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. వైసిపి నేతలు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారని ఈ క్రమంలో పోలీసులు తమ కర్తవ్యాన్ని నిర్వర్తించారన్నారు.
నగరి మున్సిపల్ కమిషనర్ను మున్సిపల్ ఛైర్ పర్సన్ భర్త కించపరిచేలా మాట్లాడారన్నారు. అందువల్లే పోలీసులు అరెస్ట్ చేశారని చెప్పారు. రెచ్చగొట్టేలా మాట్లాడటాన్ని రోజా మానుకోవాలన్నారు. కేంద్రం నుంచి ఇప్పటి వరకు రూ.8 వేల కోట్ల నిధులను పొందామన్నారు.
సెక్షన్ 8 పైన రోజాకు అవగాహన లేదన్నారు. రోజా లాంటి ఎమ్మెల్యేలను ఆ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ కట్టడి చేయాలన్నారు. కాగా, సెక్షన్ 8 హైదరాబాదులో కాదని, తెలంగాణలో పెట్టాలని రోజా అన్నట్లుగా వార్తలు వచ్చాయి. దీనిపై ఆయన కౌంటర్ ఇచ్చారు.
20న మోడీని కలవనున్న చంద్రబాబు
చంద్రబాబుతో ప్రధాని నరేంద్ర మోడీ అపాయింటుమెంట్ ఖరారైంది. ఈ నెల 20వ తేదీన సాయంత్రం నాలుగు గంటలకు ప్రధాని మోడీతో చంద్రబాబు భేటీ కానున్నారు.