అప్పుడు కిడారి కారులో రూ.3 కోట్లు ఉన్నాయి..!మరి ఆ డబ్బు ఏమైంది?:చివరి కాల్ అదే
విశాఖపట్టణం: అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును మావోయిస్టులు కాల్చిచంపిన సమయంలో ఆయన కారులో రూ. 3 కోట్ల నగదు ఉన్నట్లు పోలీసుల విచారణలో వెల్లడయినట్లు సాక్షి పత్రికలో వచ్చింది. అయితే ఆ తరువాత ఎక్కడా ఆ డబ్బు ప్రస్తావన రాకపోవడంతో మరి ఆ నగదు ఏమైందనే కోణంలో ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ జరుపుతున్నట్లు తెలిసింది. అంతేకాకుండా అసలు అంత డబ్బును ఆ సమయంలో ఆయన కారులో ఎందుకు తీసుకువెళుతున్నారు?...ఏదైనా మైనింగ్ సెటిల్మెంట్ కోసమా?...లేక మావోయిస్టులకు ఇచ్చేందుకా అనే కోణాల్లోనూ సిట్ సమగ్ర విచారణ జరుపుతోందని సాక్షి పేర్కొంది.
అయితే ఆ తరువాత ఎక్కడా ఆ డబ్బు ప్రస్తావన రాకపోవడంతో మరి ఆ నగదు ఏమైందనే కోణంలో ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ జరుపుతున్నట్లు తెలిసింది. అంతేకాకుండా అసలు అంత డబ్బును ఆ సమయంలో ఆయన కారులో ఎందుకు తీసుకువెళుతున్నారు?...ఏదైనా మైనింగ్ సెటిల్మెంట్ కోసమా?...లేక మావోయిస్టులకు ఇచ్చేందుకా అనే కోణాల్లోనూ సిట్ సమగ్ర విచారణ జరుపుతోందని సమాచారం.
ఆ డబ్బు...ఏమైంది?
అయితే కిడారి హత్య తరువాత కారు నుంచి ఆ డబ్బు మాయం అయినట్లు సిట్ విచారణలో వెల్లడయింది. దీంతో ఆ డబ్బును మావోయిస్టులు తీసుకువెళ్లారా?...లేక ఆ డబ్బు గురించి తెలిసిన కిడారి అనుచరులు తీసుకున్నారా?...లేక కిడారి ఇంటికి ఆ డబ్బును చేర్చారా?...లేక ఈ హడావుడిలో కారులో నగదును ఎవరైనా అపహరించారా?...ఇలా వివిధ కోణాల్లో ఆ నగదు గురించి, తద్వారా వెల్లడయ్యే విషయాల గురించి సిట్ సమగ్ర విచారణ జరుపుతున్నట్లు తెలిసింది.
ఆ ఫోన్ కాల్...అంతా మార్చేసింది
ఇదే విషయమై ఇప్పటికే టీడీపీ మాజీ ఎంపీపీ ధనీరావుతో పాటు కొండబాబు, త్రినాథరావు, అంత్రిగూడకు చెందిన శోభన్, కొర్రా కమల, పొంగిదాసు తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నట్లు సమాచారం. అలాగే దాడికి సహకారం విషయమై ఎమ్మెల్యే గ్రామదర్శినికి హాజరుకావాల్సిన సర్రాయి గ్రామానికి చెందిన 15 మందిని కూడా విచారణకు తీసుకువచ్చారు. సోమవారం అరకు మండలానికి చెందిన అధికార పార్టీ మహిళా ప్రజాప్రతినిధిని కూడా పోలీసులు విచారించినట్లు తెలిసింది. ఇదిలావుంటే తన హత్య కోసం మావోయిస్టులు వేసిన స్కెచ్ నుంచి ఒక్కసారి తప్పుకున్న ఎమ్మెల్యే కిడారి రెండోసారి జరిగిన లిపిటిపుట్టు దాడి నుంచి కూడా తప్పించుకునేవారేనని, అయితే అనూహ్యంగా వచ్చిన ఫోన్ కాల్ ఆయన పాలిట యమపాశంగా మారినట్లు తెలుస్తోంది.
ఆ కార్యక్రమానికి...ఎందుకో విముఖత
సెప్టెంబర్ 22 శనివారం రోజున అనంతగిరి మండలం గుమ్మకోటలోని ఓ కార్యక్రమంలో పాల్గొని సాయంత్రానికి ఎస్.కోట చేరుకున్న ఎమ్మెల్యే కిడారి అక్కడే ముఖ్యమంత్రి యువనేస్తం పథకానికి సంబంధించిన బ్యానర్లు, కరపత్రాలను ఓ ప్రింటింగ్ ప్రెస్లో దగ్గరుండి ప్రింటింగ్ పూర్తి చేయించుకున్నారట. ఇక వాటితో విశాఖ బయలుదేరి వెళ్లాలనేది ఆయన అభిమతంగా తెలుస్తోంది. నిజానికి మరుసటి రోజు సర్రాయిలో గ్రామదర్శనిలో పాల్గోవాల్సి ఉందని ఆయనకు తెలిసినా ఎందుచేతనో ఆయన ఆ కార్యక్రమంలో పాల్గొనేందుకు సుముఖంగా లేరని...అందుకే వాళ్లు ఫోన్ చేసి రమ్మంటే అప్పుడు చూద్దామంటూ విశాఖకు బయలుదేరేందుకు ఉద్యుక్తులయ్యారట.
ఆ ఫోన్ కాల్ తో...మృత్యువు వైపు ప్రయాణం
ఇంతలోనే ఫోన్ మోగనే మోగిందట...సర్రాయిలో ఏర్పాటు చేసిన గ్రామదర్శినికి తప్పనిసరిగా హాజరుకావాలని అవతలి వ్యక్తి ఫోన్ లో గట్టిగా ఒత్తిడి చెయ్యడంతో ఇక తప్పనిసరి పరిస్థితుల్లో వెనుతిరగి అప్పటికప్పుడు రాత్రి కల్లా అరకులోని క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారట. ఆ క్రమంలో ఆదివారం ఉదయాన్నే సర్రాయికి బయలుదేరివెళుతూ లివిటిపుట్టు వద్ద మావోల చేతిలో దారుణ హత్యకు గురయ్యారు. దీంతో విశాఖ వెళ్లిపోదామనుకున్న ఎమ్మెల్యేను తమ ఫోన్ కాల్తో ఎస్.కోట నుంచి వెనక్కి రప్పించినవారు ఎవరైవుంటారనేది తెలుసుకునేందుకు పోలీసులు విచారణ చేస్తున్నారు.
ఒక ఫోన్ తీసుకొని...యాపిల్ ఫోన్ వదిలేశారు
లివిటిపుట్టు వద్ద ఎమ్మెల్యే కిడారిని కాల్చిచంపిన తరువాత ముందుకు వెళ్లిపోయిన మావోయిస్టులు మరలా వెనక్కువచ్చి ఎమ్మెల్యే కిడారి సెల్ఫోన్ను తీసుకునిపోయారట. అయితే ఎమ్మెల్యే కి సంబంధించిన ఫోన్లు అక్కడ రెండు వుంటే మావోయిస్టులు యాపిల్ ఫోన్ని వదిలేసి మరో ఫోన్ మాత్రమే తీసుకువెళ్లారట. ప్రస్తుతం ఈ యాపిల్ ఫోన్ పోలీసుల దగ్గర ఉందని తెలిసింది. మావోయిస్టుల దాడికి సంబంధించి పోలీసుల విచారణకు ఇందులో కాల్ డేటా ఉపయోగపడుతుందనే భావనతో ఆ దిశలో పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.