బిజెపి నేతల్లో చీలిక: చంద్రబాబుకు కొరకరాని కొయ్యలు వీరే...
చంద్రబాబుతో దోస్తీ కట్టే విషయంలో ఎపి బిజెపి నాయకులు రెండుగా చీలిపోయినట్లు కనిపిస్తున్నారు. ఒక వర్గం దోస్తీని వ్యతిరేకిస్తుండగా, మరో వర్గం సమర్థిస్తోంది.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బిజెపి రెండు వర్గాలుగా చీలిపోయినట్లు కనిపిస్తోంది. ఓ వర్గం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి అనుకూలంగా ఉండగా, మరో వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. చంద్రబాబుతో దోస్తీని వ్యతిరేకిస్తున్న నాయకుల్లో ఎక్కువ మంది కాంగ్రెసు నుంచి బిజెపిలోకి వచ్చినవారే కావడం విశేషం.
రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ కాంగ్రెసు నుంచి బిజెపిలోకి పలువురు ప్రముఖ నాయకులు వచ్చారు. వారంతా మొదటి నుంచీ చంద్రబాబుకు వ్యతిరేకంగా ఉన్నవారే. వారు బిజెపి వచ్చే ఎన్నికల నాటికైనా ఒంటరిగా పోటీ చేయాలని కోరుకుంటున్నారు.
తెలుగుదేశం, బిజెపి మధ్య పొత్తు దాదాపుగా తెగే దాకా వచ్చింది. అయితే, చివరి నిమిషంలో బిజెపి జాతీయాధ్యక్షుడు అమిత్ షా, చంద్రబాబు భేటీతో విభేదాల తీవ్రత తగ్గినట్లు అనిపిస్తోంది. అయితే, వచ్చే ఎన్నికల్లో టిడిపితో పొత్తు ఉంటుందనే విషయాన్ని అమిత్ షా కచ్చితంగా చెప్పలేదు.
దగ్గుబాటి పురంధేశ్వరి....
చంద్రబాబుతో దోస్తీని వ్యతిరేకిస్తున్నవారిలో మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి ఉన్నారు. చంద్రబాబుతో ఆమె కుటుంబానికి కుటుంబ విభేదాలు కూడా ఉన్నాయి. తెలుగుదేశం పార్టీతో పొత్తు కారణంగా ఆమె తీవ్రమైన ఇబ్బందులకు గురి కావాల్సి వచ్చింది. విశాఖపట్నం పార్లమెంటు సీటు నుంచి కాకుండా ఆమె రాజంపేట నుంచి పోటీ చేయాల్సి వచ్చింది. దాంతో ఆమె ఓటమి పాలయ్యారు. ఆమె ప్రస్తుతం చంద్రబాబుతో బిజెపి తెగదెంపులు చేసుకోవాలని ఆశిస్తున్నట్లున్నారు. ఇటీవలి కాలంలో ఆమె చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.
కావూరి సాంబశివ రావు....
రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ మాజీ పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివ రావు బిజెపిలో చేరారు. ఆయన బిజెపిలో చేరినప్పటికీ ఈ మధ్య కాలంలో రాజకీయాలకు దూరంగానే ఉన్నట్లు కనిపించారు. కానీ, అకస్మాత్తుంగా ఆయన బాంబు పేల్చారు. చంద్రబాబు గ్రాఫ్ పడిపోతోందని, చంద్రబాబుతో బిజెపి తెగదెంపులు చేసుకోవాలని ఆయన సూచించారు.
కన్నా లక్ష్మినారాయణ...
కన్నా లక్ష్మినారాయణ కూడా కాంగ్రెసు నుంచి బిజెపిలోకి వచ్చినవారే. ఆయన మొదటి నుంచీ చంద్రబాబుకు మాత్రమే కాకుండా తెలుగుదేశం పార్టీకి కూడా బద్దవ్యతిరేకి. అయితే, బిజెపి అధినాయకత్వాన్ని కాదనలేక పార్టీలో సర్దుకుపోతున్నారు. అయితే, ఆయన కూడా బిజెపి తెలుగుదేశం పార్టీతో తెగదెంపులు చేసుకోవాలని అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది.
సోము వీర్రాజు....
బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు కూడా చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. కావూరి సాంబశివ రావు, కన్నా లక్ష్మినారాయణ, పురంధేశ్వరి మాటకు ఆయన విలువ ఇస్తున్నట్లు కనిపిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వంపై తరుచుగా విమర్శలు చేస్తున్నారు.
వెంకయ్య నాయుడి అండదండలు....
చంద్రబాబుకు వెంకయ్య నాయుడి అండదండలు దండిగా ఉన్నట్లు చెబుతారు. ఆయన కారణంగానే కేంద్రంలో చంద్రబాబుకు తగిన ప్రాధాన్యం లభిస్తోందని అంటున్నారు. ఇరు పార్టీల మధ్య పొరపొచ్చాలు వచ్చినప్పుడు చంద్రబాబుకు అనుకూలంగా ఆయన జాతీయ నాయకత్వాన్ని ప్రభావితం చేస్తారని అంటారు. ఈసారి కూడా ఆయన అదే పనిచేశారని అంటున్నారు.
హరిబాబు ఇలా....
తెలుగుదేశం పార్టీతో పొత్తు కారణంగా విశాఖపట్నం పార్లమెంటు సీటు నుంచి హరిబాబు విజయం సాధించారు. ఆయన చంద్రబాబుకు అనుకూలంగా ఉన్నట్లు కనిపిస్తున్నారు. కావూరి సాంబశివ రావు చేసిన వ్యాఖ్యలను ఆయన ఇటీవల ఖండించారు. చంద్రబాబు గ్రాఫ్ పడిపోతోందనే కావూరి సాంబశివ రావు వ్యాఖ్యలతో ఆయన విభేదించారు. అదే సమయంలో చంద్రబాబు మంత్రివర్గంలో ఉన్న బిజెపి నేత కామినేని శ్రీనివాస్ కూడా చంద్రబాబుకు అనుకూలంగా ఉన్నట్లు కనిపిస్తున్నారు.