జగన్కు షాకిచ్చిన ఆ నలుగురికే బాబు ఛాన్స్: అందుకే భూమా, జ్యోతులకు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరికొద్ది రోజుల్లో కేబినెట్ను విస్తరించనున్నారు. ఈ విస్తరణలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచి, టిడిపిలో చేరిన ఇద్దరు ముగ్గురికి అవకాశం దక్కనుంది.
వైసిపి నుంచి ఇరవై మంది ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలో చేరారు. అందులో మంత్రివర్గం రేసులో పలువురు ఉన్నారు. కానీ ముగ్గురి పేరు ఎక్కువగా వినిపిస్తోంది. వారినే కేబినెట్లోకి తీసుకునేందుకు సర్వం సన్నద్ధమయిందనే వాదనలు వినిపిస్తున్నాయి.
వాటికి కారణాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. కేబినెట్లోకి భూమా నాగిరెడ్డి, జ్యోతుల నెహ్రూ, జలీల్ ఖాన్ను తీసుకుంటారని అంటున్నారు. వారిని తీసుకోవడం వెనుక కూడా చంద్రబాబుకు పక్కా లెక్కలు ఉన్నాయని చెబుతున్నారు.
గత సార్వత్రిక ఎన్నికల్లో కర్నూలు జిల్లాలో టిడిపి సత్తా చాటలేదు. భూమా వర్గీయులను చేర్చుకోవడం ద్వారా టిడిపి బలం పెంచుకుంది. ఇప్పుడు వారిని కేబినెట్లోకి తీసుకోవడం ద్వారా మరింత టిడిపి బలం పెంచాలని చంద్రబాబు యోచిస్తున్నారు.
ఇక, గోదావరి జిల్లాలో జ్యోతుల నెహ్రూకు మంచి పట్టు ఉంది. పైగా ఆయన కాపు సామాజిక వర్గానికి చెందిన వారు. గత ఎన్నికల్లో తమకు ఓటు వేసిన కాపులను జ్యోతుల నెహ్రూ ద్వారా మరింత చేరువ చేసుకోవాలని భావిస్తున్నారని అంటున్నారు. ఇక టిడిపి నుంచి ఒక్క ముస్లీం ఎమ్మెల్యే గెలవలేదు. దీంతో జలీల్ ఖాన్ను కేబినెట్లోకి తీసుకోనున్నారు. అమర్నాథ్ రెడ్డి పేరు కూడా వినిపిస్తోంది.
వైసిపి నుంచి భూమా నాగిరెడ్డి (నంద్యాల), జ్యోతుల నెహ్రూ (జగ్గంపేట), అమర్నాథ్ రెడ్డి (పలమనేరు), జలీల్ ఖాన్ (విజయవాడ వెస్ట్)లను కేబినెట్లోకి తీసుకుంటారని చెబుతున్నారు. ప్రస్తుతం చంద్రబాబు కేబినెట్లో 20 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. చంద్రబాబుతో కలిపి 26 వరకు ఉండవచ్చు.