ఆ ఇద్దరు టిడిపి నేతలు బిజెపి మీద రెచ్చిపోతోంది..అందుకా!
వాళ్లిద్దరూ టిడిపి నేతలు...ఒకరేమో ఎమ్మెల్యే...మరొకరు ఎంపి...వీళ్లల్లో ఒకరేమో అసలు బీజేపీ పొగరు అణచాల్సిందేనంటారు...మరొకరేమో రాష్ట్రానికి ఎటువంటి ప్రయోజనం చేకూర్చని బీజేపీతో పొత్తు ఎందుకని ఘాటుగా ప్రశ్నిస్తారు...అయితే టిడిపిలో ఎంతోమంది నేతలున్నా వీళ్లిద్దరు మాత్రం బిజెపితో తెగతెంపులు మీద కాస్త ఎక్కువ ఆసక్తి చూపుతున్నట్లు అనిపిస్తుంది...అయితే అది నిజమేనని వీరి మాటల వెనుక ఒక వ్యూహమే ఉండిఉండొచ్చంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఇంతకీ ఎవరు ఈ టిడిపి నేతలు...ఏంటి వాళ్ల వ్యూహం...ఎందుకోసం బిజెపిపై ఈ దండయాత్రలంటే...
ఆ ఇద్దరు టిడిపి నేతల్లో ఒకరు రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ కాగా...మరొకరు రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి. వీరిద్దరూ బీజేపీతో తలాక్ చెప్పేద్దామనే గట్టిగా నొక్కివక్కాణిస్తున్నారు...అయితే ఎందుకు వీరికి బీజేపీపై అంత ఆగ్రహం? నిజంగా ఆ పార్టీ రాష్ట్రానికి ఏ ప్రయోజనాలు చేకూర్చడం లేదనేనా? లేక వీరికి సొంత ఎజెండా ఏమైనా ఉందా?...అంటే ఎంతైనా రాజకీయ నాయకులు...స్వప్రయోజనాలు లేకుండా ఎలా ఉంటాయనే సమాధానం వస్తోంది...అయితే ఏమిటా వ్యక్తిగత ఎజండా అంటే...
కర్నూలులో...కుమారుడి కోసం…
ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ తరుపున రాజ్యసభ ఎంపీగా ఉన్నటీజీ వెంకటేశ్...గతంలో కాంగ్రెస్ హయాంలో మంత్రిగా పనిచేసి కర్నూలు జిల్లాలో ఒక వెలుగు వెలిగిన వ్యక్తి. అయితే రాష్ట్ర విభజన తర్వాత ఆయన టీడీపీ గూటికి చేరుకున్నారు...ఆ తర్వాత రాజ్యసభ సీటు సంపాధించుకున్నారు. అయితే టీజీ వెంకటేష్ కు తన వారసుడిని రాజకీయ రంగంలోకి దించాలనే కోరిక ప్రబలంగా ఉంది. అందుకే వచ్చే ఎన్నికల్లో కర్నూలు సిట్టింగ్ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డికి పోటీగా టిడిపి తరుపున తన కుమారుడు భరత్ కు టిక్కెట్ ఇప్పించుకోవాలని టీజీ వెంకటేష్ ఇప్పటి నుంచే గట్టి ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం.
Recommended Video
ఒకవేళ సీటొచ్చినా...బిజెపి పొత్తుతో నష్టం...
అయితే తాను ఎలాగో కష్టపడి కొడుక్కి కర్నూలు అసెంబ్లీకి టికెట్ తెచ్చుకున్నా అక్కడ స్థానిక సామాజిక సమీకరణాల ప్రకారం బీజేపీతో పొత్తు ఉంటే చాలా ఇబ్బందేనని టీజీ వెంకటేష్ అంచనా వేశారట. అందుకే ఇప్పటినుంచే నరుక్కొస్తే అప్పటికి గెలుపు బాట పట్టొచ్చని ఆయన ఆలోచన అంటున్నారు...ఇంతకీ బిజెపితో కటీఫ్ ను టిజివి ఎందుకు కోరుకుంటున్నారంటే...కర్నూలు టౌన్ లో ముస్లింల జనాభా ఎక్కువ కావడమే. బీజేపీతో పొత్తుతోనే తాము ఎన్నికలకు వెళితే గెలవలేమని టీజీ వెంకటేష్ ఊహిస్తున్నారట. గత ఎన్నికల్లో కూడా తాను ఓడిపోవడం...తనపై ఇక్కడ వైసీపీ గెలవడంతోనే ఆయన ఇలా విశ్లేషిస్తున్నట్లు తెలిసింది. దీంతో వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని, తన వారసుడి రాజకీయ ఆరంగ్రేటం...తదనంతర ప్రస్థానం సాఫీగా సాగాలంటే బిజెపితో టిడిపి పొత్తు తెగిపోవాలని టిజి వెంకటేష్ కోరుకుంటున్నారనేది ఒక విశ్లేషణ...అందుకే ఆయన ఆ పార్టీపై అంతలా దూకుడు చూపుతున్నారని కామెంట్లు...
మరి...గోరంట్ల బుచ్చయ్య చౌదరి...ఎందుకంటే?...
మరోవైపు రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూడా బిజెపిపై పదునైన వ్యాఖ్యలతో విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే...టిడిపిలో చాలా సీనియర్ నేత, మాజీ మంత్రి అయిన ఆయన ఈసారి మంత్రిమండలిలో చోటు దక్కుతుందని ఆశించి భంగపడ్డారు. ఒక దశలో తమ పార్టీ అధిష్టానంపై కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు...అదంతా వదిలేస్తే...ఇప్పుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి...బిజెపితో తెగతెంపులు కోరుకుంటోంది...తన సీటు గురించే అంటున్నారు... అదెలాగంటే...
తన...ఆస్థానం కోసమే...
గోరంట్ల బుచ్చయ్య చౌదరికి రాజమండ్రి అర్బన్ నియోజకవర్గంలో మంచి పట్టుంది. అయితే గత ఎన్నికల్లో బీజేపీతో పొత్తులో భాగంగా ఆ సీటు బీజేపీకి కేటాయించిన సంగతి తెలిసిందే...దీంతో అక్కడ పోటీచేసిన ఆకుల సత్యనారాయణ ఘన విజయం సాధించారు. బీజేపీ కోసమే గోరంట్ల బుచ్చయ్య చౌదరిని అర్బన్ నుంచి రూరల్ కు గత ఎన్నికల్లో టిడిపి అధిష్టానం షిఫ్ట్ చేసింది. దీంతో గోరంట్ల తాను రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ భవిష్యత్తు రాజకీయాల దృష్ట్యా రాజమండ్రి అర్బన్ పై తన పట్టు వదులుకోవడానికి ఇష్టపడటంలేదు...అందుకే ఇదే విషయమై ఎన్నోసార్లు ఆయనకు అర్బన్ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణతో ఎన్నోసార్లు బహిరంగంగానే గొడవలు సైతం జరిగాయి...కాబట్టి...ఈ నేపథ్యంలో బీజేపీతో టిడిపికి పొత్తు లేకుంటే తిరిగి తన పాత స్థానానికి తాను వెళ్లిపోవచ్చనేది గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆలోచనగా తెలుస్తోంది...ఇదండి...ఈ ఇద్దరు టిడిపి నేతలు బిజెపితో విడాకులు కోరుకోవడానికి వెనుకున్న కారణమని అంటున్నారు వీరంటే గిట్టనివారు...అయితే తాజా రాజకీయ పరిణామాలు చూస్తే వీరి ఆశ ఇంకా అప్పుడే నెరవేరే అవకాశం కనిపించడం లేదు...ఇంకొంతకాలం వెయిట్ చెయ్యాల్సిందే అంటున్నారు రాజకీయ పరిశీలకులు...