అవి సాధారణ ఐటీ దాడులు కాదు...సెలెక్టెడ్ దాడుల్లాగా ఉన్నాయి:కాంగ్రెస్ నేత తులసిరెడ్డి
విజయవాడ:ఏపీలో జరుగుతున్న ఐటీ దాడులు సాధారణ ఐటి దాడుల్లాగా లేవని...సెలెక్టెడ్ దాడులుగా కనిపిస్తున్నాయని ఏపీ పీసీసీ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి అభిప్రాయపడ్డారు.
విజయవాడ ఆంధ్రరత్నభవన్ లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఐటీ దాడులు పార్టీలకు అతీతంగా బిజెపి,టిడిపి,వైసిపిలో ఉన్నవారిపై జరిగితే ఆహ్వానిస్తామని...అయితే కొంతమందిని మాత్రమే టార్గెట్ చేసి చేస్తున్న ఈ దాడులు ఖచ్చితంగా రాజకీయ కక్ష సాధింపేనని తులసిరెడ్డి ఆరోపించారు. ప్రధాని మోడీ రాజ్యాంగ బద్ధ వ్యవస్థలను స్వప్రయోజనాల కోసం వాడుతూ వాటిని నిర్వీర్యం చేస్తున్నారని తులసి రెడ్డి విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్లో పథకం ప్రకారమే ఐటీ దాడులు జరుగుతున్నాయని...అందులో ఎలాంటి సందేహం లేదన్నారు. బిజెపి నేతలు పథకం ప్రకారం రాజకీయ పబ్బం గడుపుకోవడానికే ఐటీ దాడులు చేపట్టారని ఆయన మండిపడ్డారు. టిఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్కు ఓటమి భయం పట్టుకుందని...అందుకే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని తులసి రెడ్డి ఎద్దేవా చేశారు.
తిట్టాలంటే ఎవరైనా తిట్టగలరని తులసిరెడ్డి వ్యాఖ్యానించారు. కేసీఆర్కు నోటి దురుసు ఎక్కువని అందరికీ తెలుసని, సీఎం హోదాలో ఉండి వ్యక్తిగత దూషణలు సరికాదన్నారు. తెలంగాణలో మహాకూటమి విజయం ఖాయమని తులసిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.