వాళ్లిద్దరూ అడ్డంగా దొరికిపోయారు...కొనసాగే అర్హత లేదు:టిడిపి ఎంపి కనకమేడల
విజయవాడ:ఢిల్లీలో బిజెపి పెద్దలను కలిసిన వ్యవహారంలో పొంతన లేని వాదనలు వినిపించి భాజపా ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, వైసిపి నేత బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి అడ్డంగా దొరికిపోయారని తెదేపా రాజ్యసభ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ విమర్శించారు.
అడ్డంగా దొరికి కూడా అడ్డగోలు వాదన చేస్తున్నారంటూ వారి వైఖరిని ఆయన తప్పుపట్టారు. ఢిల్లీ కేంద్రంగా ఏపీపై కుట్ర జరుగుతోందని ఆరోపించిన ఆయన... భాజాపా డైరెక్షన్లో వైసిపి యాక్షన్ చేస్తోందని ధ్వజమెత్తారు. శాసనసభ నిబంధనలకు విరుద్ధంగా బుగ్గన వ్యవహరించారని మండిపడ్డారు...పీఏసీ ఛైర్మన్ పదవిని దుర్వినియోగం చేసినందున బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి ఆ పదవిలో కొనసాగడానికి అనర్హుడని ఎంపి కనకమేడల అభిప్రాయపడ్డారు.
ఒకే విషయం...మూడు వాదనలు
ఢిల్లీలో భాజపా పెద్దలతో భేటీ విషయమై ఈ ఒకే ఒక విషయానికి సంబంధించి మూడు రకాల వాదనలను బుగ్గన, ఆకుల వినిపించారన్నారు. తెదేపా ప్రత్యర్థులను భాజాపా నేతలు ఢిల్లీకి పిలిపిస్తున్నారని ఇందులో భాగంగానే వైకాపా నేతలు భాజాపాతో భేటీలు జరుపుతున్నారని ఆయన ఆరోపించారు. పీఏసీ ఛైర్మన్ పదవిని దుర్వినియోగం చేసినందున బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి ఆ పదవిలో కొనసాగడానికి ఎంతమాత్రం అర్హుడు కాదని కనకమేడల అభిప్రాయపడ్డారు.
ఈ విషయంతో...తేలిపోయింది
భాజపా మార్గదర్శకత్వంలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైకాపా వ్యవహరిస్తోందని తేలిపోయిందన్నారు. ప్రజాపద్దుల కమిటీ (పీఏసీ) ఛైర్మన్ పదవిని అడ్డం పెట్టుకుని బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి అక్రమంగా, శాసనసభ వ్యవహారాలకు సంబంధించిన కీలక పత్రాలను కేంద్రానికి చేరవేస్తున్నట్లు ఆరోపించారు. ఆయన ప్రవర్తన పీఏసీ వ్యవస్థకు భంగం కలిగించే రీతిలో ఉందన్నారు. వైకాపా ఎంపీల రాజీనామా వ్యవహారం మొత్తం బూటకమని ఆయన వ్యాఖ్యానించారు. భాజపా, వైకాపాల నాటకం మొత్తం ఇప్పటికే బట్టబయలైనందున వాస్తవాలను ప్రజలు గమనిస్తున్నట్లు ఎంపీ రవీంద్రకుమార్ చెప్పారు.
బుగ్గన రాజద్రోహి: యరపతినేని
గుంటూరులోని తెదేపా రాష్ట్ర కార్యాలయంలో యరపతినేని శ్రీనివాసరావు విలేకరులతో మాట్లాడుతూ... ‘‘చట్టరీత్యా అధికార పత్రాలను సభాపతికి, శాసనసభకు తప్పా ఇంకెవ్వరికీ ఇవ్వకూడదు. అలాంటిది సదరు పత్రాలను బుగ్గన భాజపా నేతలకు ఇచ్చి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. సభా, ప్రజాద్రోహానికి పాల్పడ్డారు. ఆయనపై శాసనసభాపతి సుమోటోగా చర్యలు తీసుకోవాలి. సభాహక్కుల తీర్మానం నోటీసు కూడా ఇస్తాం. రాజద్రోహానికి పాల్పడ్డ బుగ్గనపై రాజద్రోహం కేసు పెట్టాలి'' అని యరపతినేని డిమాండు చేశారు.
మోదీ, జగన్ది...దొంగ కాపురం
ప్రధానమంత్రి నరేంద్రమోదీ, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏకమై, దొంగ కాపురం చేస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, మంత్రి కిమిడి కళా వెంకటరావు విమర్శించారు. శనివారం శ్రీకాకుళం జిల్లా రాజాంలో నిర్వహించిన జి.సిగడాం మండల సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర అభివృద్ధి చూడలేక వైసీపీ, బీజేపీలు మోసపూరిత రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రాభివృద్ధి కోసం అహర్నిశలూ కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రతిపక్ష నేతగా అభివృద్ధికి సహకరించాల్సిన వైఎస్ జగన్ మాత్రం, ముఖ్యమంత్రిపై లేనిపోని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.