కోస్తాంధ్రను కమ్మేస్తున్న పొగమంచు...వాహనదారులు, ప్రయాణికుల అవస్థలు
అమరావతి: కోస్తాంధ్రాను పొగమంచు కమ్మేస్తోంది. గత కొన్నిరోజులుగా దట్టంగా అలుముకుంటున్న మంచు ప్రజానికాన్ని తీవ్ర ఇబ్బందుల పాలుచేస్తోంది.
కోస్తాంధ్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఉదయం 9 గంటలు దాటుతున్నా పొగమంచు తీవ్రత తగ్గుముఖం పట్టకపోవడంతో వాహనదారులు, పాదచారులు నానా అవస్థలు పడుతున్నారు. గుంటూరు,కృష్ణాజిల్లాల్లో దట్టంగా కురుస్తున్న పొగమంచు కారణంగా జనం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
వాహనాదారుల ఇక్కట్లు....
హైవేలపై దట్టంగా పొగమంచు కమ్మేస్తుండటంతో ఎదురుగా వస్తున్న వాహనాలు అతి దగ్గరగా వచ్చేంత వరకు కనిపించక వాహనదారులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణిస్తున్నారు. రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు బాగా ఎక్కువగా ఉండటంతో, రిస్క్ ఎందుకు అనుకుంటున్న ప్రయాణికులు మంచు తీవ్రత తగ్గే వరకు వాహనాలను రోడ్లపక్కననిలిపివేస్తున్నారు.
ప్రయాణికుల అవస్థలు...
అటు విశాఖలోనూ పొగమంచు వణికిస్తోంది. దట్టంగా కమ్ముకుంటున్న పొగమంచు నేల మీద ప్రయాణించే వాహనాలనే కాదు పట్టాల పైనే ప్రయాణించే రైళ్లను, ఆకాశమార్గంలో రాకపోకలు సాగించే విమానాలను సైతం ఇబ్బందులకు గురిచేస్తోంది. దీంతో పలు రైళ్లు,విమానాలు రద్దు అవుతుండటంతో ప్రయాణికులు ఇక్కట్ల పాలవుతున్నారు. అందులోను సంక్రాంతి పండుగ కోసమని సుదూర ప్రాంతాల నుంచి స్వస్థలాలకు చేరుకున్న ప్రజలు తిరిగి గమ్యస్థానాలు చేరుకోవాలంటే ఊహించని విధంగా రద్దవుతున్న రైళ్లు, విమానాల కారణంగా ప్రయణాలను అనివార్యంగా వాయిదా వేసుకోవాల్సి వస్తోంది.
పలు రైళ్ల రద్దు...
పొగమంచు కారణంగా పలు రైలు సర్వీసులు, విమానాలు రద్దు అయ్యాయి. పొగమంచు కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశం మెండుగా ఉన్నందున ముందు జాగ్రత్తగా రైల్వే శాఖ నాలుగు రైళ్లను రద్దు చేసింది. 21 రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
విమానాల రాకపోకలకు అంతరాయం...కొంతకాలం ఇంతే
వమరోవైపు ఎయిరిండియా, ఇండిగో విమానాలు మార్గం గుర్తించలేక గాలిలోనే చక్కర్లు కొడుతున్నాయి. ఢిల్లీలో పలు విమానాలు రద్దయ్యాయి. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల రీత్యా మరికొన్నాళ్లు పొగమంచు ప్రభావం తప్పదని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. మారిన వాతావరణ పరిస్థితులను గమనించుకుంటూ ప్రజలు అప్రమప్తంగా మెలగాలని హెచ్చరిస్తున్నారు.